Traffic Diverted Routes in Hyderabad : గణేష్ నవరాత్రి ఉత్సవాలు.. ముంబై తర్వాత అత్యంత ఘనంగా గణేషుడికి నవరాత్రులు పూజలు జరిపి.. వినాయకచవితిని గ్రాండ్ సెలబ్రేట్ చేసుకుంటారు హైదరాబాదీలు. వీధి వీధికొక గణేష్ మంటపాన్ని ఏర్పాటు చేసి.. వినాయక విగ్రహాన్ని ప్రతిష్టించి.. 9 రోజులపాటు మాంసాహారం, మద్యం ముట్టకుండా ఎంతో కన్నులపండువగా పూజలు నిర్వహిస్తారు. తెల్లవారుజామునుంచే గణేషుడి ప్రత్యేక పాటలతో హోరెత్తిస్తారు. ఇక నిమజ్జనం రోజైతే చెప్పనక్కర్లేదు. నగరమంతా తీన్ మార్ డప్పులు, స్టెప్పులతో మారుమోగిపోతుంది. అన్నింటికంటే ఆఖరున ఖైరతాబాద్ గణేషుడి నిమజ్జనం చేస్తారు. నగరం నలుమూలల్లో ఉన్న గణేష్ మంటపాల నుంచి వినాయక విగ్రహాలను ట్యాంక్ బండ్ లోనే నిమజ్జనం చేస్తారు.
3, 5, 7, 9 రోజులలో వినాయకుడిని గంగమ్మతల్లిలో నిమజ్జనం చేస్తారు. గణేష్ నిమజ్జనం సమయంలో ట్రాఫిక్ కు ఇబ్బందులు కలుగకుండా పోలీసులు నేటి నుంచి కొన్ని మార్గాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ప్రత్యామ్నాయ మార్గాల్లో ట్రాఫిక్ ను డైవర్ట్ చేశారు. వాహనదారులు ఈ విషయాలను తెలుసుకుని సహకరించాలని కోరారు.
సెప్టెంబర్ 10 నుంచి 16వ తేదీ వరకూ నెక్లెస్ రోడ్ పీవీఎన్ మార్గ్ లో నిమజ్జనాలు జరగనున్న నేపథ్యంలో ట్రాఫిక్ ను డైవర్ట్ చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. మధ్యాహ్నం 3 గంటల నుంచి అర్థరాత్రి వరకూ ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయని స్పష్టం చేశారు.
Also Read: దారులన్నీ ఖైరతాబాద్ వైపే.. వర్షంలోనూ పోటెత్తిన భక్తజనం
హైదరాబాద్ లో ట్రాఫిక్ ఆంక్షలు
1.కర్బల మైదానం నుంచి అప్పర్ ట్యాంక్ బండ్ వైపు వచ్చే వాహనాలను సైలింగ్ క్లబ్ మీదుగా కవాడిగూడ క్రాస్ రోడ్స్ వైపు మళ్లించారు.
లిబర్టీ లేదా ఖైరతాబాద్ వైపు వెళ్లే వాహనదారులు కవాడిగూడ క్రాస్ రోడ్స్, డీబీఆర్ మిల్స్, వార్త లైన్, స్విమ్మింగ్ పూల్, బండ్ల మైసమ్మ, ధర్నా చౌక్, ఇందిరాపార్క్ క్రాస్ రోడ్స్, ఆర్కే మ్యాథ్, కట్ట మైసమ్మ జంక్షన్, అంబేద్కర్ స్టాచ్యూ, తెలుగుతల్లి ఫ్లైఓవర్, ఇక్బాల్ మినార్ వైపుగా వెళ్లాలని సూచించారు. అలాగే ట్యాంక్ బండ్ నుంచి పంజాగుట్టవైపు వెళ్లే వాహనాలను రాణిగంజ్, మినిస్టర్ రోడ్, బేగంపేట్ మీదుగా పంజాగుట్ట వైపు మళ్లించారు.
2. పంజాగుట్ట, రాజ్ భవన్ ల మీదుగా ఎన్టీఆర్ మార్గ్, పీవీఎన్ఆర్ మార్గ్ (నెక్లెస్ రోడ్) వైపు సాధారణ వాహనాల రాకపోకలను ఖైరతాబాద్ ఫ్లై ఓవర్ పై నుంచి అనుమతించడం లేదు. ఆ వాహనాలను సదన్ కాలేజీ, లక్డీ కా పూల్ మీదుగా మళ్లించారు.
3. అంబేద్కర్ స్టాచ్యూ నుంచి ఎన్టీఆర్ మార్గ్ వైపు వెళ్లే వాహనాలను తెలుగుతల్లి జంక్షన్ మీదుగా ఇక్బాల్ మినార్ వైపు మళ్లించారు.
4. ఇక్బాల్ మినార్ నుంచి ట్యాంక్ బండ్ మీదుగా సికింద్రాబాద్ వైపు వెళ్లాల్సిన వాహనాలను తెలుగుతల్లి ఫ్లై ఓవర్, కట్టమైసమ్మ ఆలయం, డీబీఆర్ మిల్స్, కవాడిగూడ క్రాస్ రోడ్స్ మీదుగా మళ్లించినట్లు ట్రాఫిక్ పోలీసులు తెలిపారు.
5. కట్టమైసమ్మ తల్లి ఆలయం నుంచి దోభీఘాట్ రూట్ లో వాహనాలను అనుమతించడం లేదు. ఆ మార్గంలో వెళ్లేవారు చిల్డ్రన్స్ పార్క్ మీదుగా డీబీఆర్ మిల్స్, కవాడీగూడ క్రాస్ రోడ్ మీదుగా మళ్లించారు.
6. ముషీరాబాద్ నుంచి సైలింగ్ క్లబ్ వైపు వెళ్లే వాహనాలను కవాడిగూడ క్రాస్ రోడ్స్ మీదుగా డీబీఆర్ మిల్స్ వైపు మళ్లించారు.
7. మినిస్టర్ రోడ్డు నుంచి నెక్లెస్ రోడ్డులో వెళ్లే వాహనదారులు నల్లగుట్ట బ్రిడ్జి మీదుగా కర్బల వైపు వెళ్లాలని సూచించారు.
8. బుద్ధభవన్ నుంచి నెక్లెస్ రోడ్డు వైపు వెళ్లే వాహనాదారులను నల్లగుట్ట బ్రిడ్జి మీదుగా మినిస్టర్ రోడ్డు వైపు మళ్లించినట్లు తెలిపారు.
గణేష్ నిమజ్జనాల్లో వాహనదారులు తమకు సహకరించాలని ట్రాఫిక్ పోలీసులు కోరారు. ఎవరికైనా సందేహాలున్నా, ఎమర్జెనీ ఉన్నా 9010203626 నంబర్ ను సంప్రదించవచ్చని తెలిపారు.