No permission for construction of cellar in Hyderabad: నాలుగున్నర దశాబ్దాల చరిత్ర కలిగిన భాగ్యనగరం ఇప్పుడు విశ్వనగరంగా రూపుదిద్దుకుంటోంది. ఆకాశాన్ని తాకే భవనాలతో.. నగరం చుట్టుపక్కల పెరిగిన పరిధితో నిత్యం వేలాది మంది రాకపోకలతో ఐటీ కూడళ్లతో, ఫ్లై ఓవర్లతో నగరం నలుదిశలా విస్తరించింది. ఐటీ రంగాన్ని కేవలం హైటెక్ సిటీకే పరిమితం చేయకుండా నగరం నలుచెరుగులా అభివృద్ధి చేస్తున్నారు. కొత్తగా సీఎం రేవంత్ రెడ్డి కూడా ఫోర్త్ సిటీని రూపొందించే బృహత్కర కార్యక్రమం రూపొందిస్తున్నారు. ఇప్పటికే ట్విన్ సిటీస్, సైబర్ సిటీ అంటూ మూడు సిటీలు అభివృద్ధి చెందగా ఇప్పుడు ఫోర్త్ సిటీగా రూపొందబోతోంది. సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్ అభివృద్ధిపై దృష్టి కేంద్రీకరించారు. ఎన్ని సొగసులు ఉన్నా..కొద్ది పాటి వర్షం వస్తే నగరం ఛిద్రంగా మారుతోంది. ముఖ్యంగా నాలాలు, చెరువులు ఆక్రమించి ఇళ్లు, పరిశ్రమలు కట్టుకోవడంతో వరద నీరు రహదారులు, లోతట్టు ప్రాంతాలను ముంచెత్తుతోంది. ఇదంతా హైదరాబాద్ ప్రతిష్టకు భంగం కలిగేలా ఉందని భావిస్తూ సీఎం రేవంత్ రెడ్డి కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నారు.
నో సెల్లార్స్
చెరువులు, నాలాలు కబ్జా చేసేవారిపై హైడ్రా అధికారాన్ని ప్రయోగిస్తున్నారు. ఇప్పటికే చెరువు ప్రాంతాలలో అక్రమంగా కట్టుకున్న భవంతులు, భవన సముదాయాలను కూల్చేవేస్తున్నారు హైడ్రా అధికారులు. ప్రజల నుంచి ఎంత వ్యతిరేకత వచ్చినా రేవంత్ రెడ్డి మాత్రం ఈ విషయంలో ముందుకు వెళుతున్నారు. హైకోర్టు కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఇక చెరువు ప్రాంతాల ఆక్రమణదారుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. అలాగే విశ్వనగరానికి చెడ్డ పేరు తెస్తున్న ఆక్రమణలతో సహా ఇకపై నూతన భవన నిర్మాణాలకు నిబంధనల విషయంలో కఠిన వైఖరి అవలంబించాలని సీఎం ఆదేశించారు. దీనితో జీహెచ్ ఎంసీ నూతన భవన నిర్మాణాల విషయంలో ఇకపై సెల్లార్లు అనుమతించబోమంటున్నారు. కొద్దిపాటి వర్షాలకే నీరు సెల్లార్లలోకి చేరుకుంటోంది. దీనితో భవన నిర్మాణ దారులు మోటార్లతో నీటిని తోడి రోడ్డుపైకి వదులుతున్నారు. రహదారులనుంచి నీరు లోతట్ఠు ప్రాంతాల ప్రజల ఇళ్లలోకి ప్రవేశించడంతో వారంతా ఆందోళనలు చేపడుతున్నారు. జీహెచ్ ఎంసీ అధికారులకు ఎంతో కాలంగా ఈ విషయంపై ఎన్ని ఫిర్యాదులు చేసినా పట్టించుకోలేదని లోతట్టు ప్రాంతాల ప్రజలు ఆరోపిస్తున్నారు. ఇకనైనా సెల్లార్ల విషయంలో ఒక నిర్ణయం తీసుకోవడం పట్ల అంతా సంతోషిస్తున్నారు.
ఫస్ట్ ఫ్లోర్ పార్కింగ్
తమ వాహనాలను ఎక్కడ పార్కింగ్ చేసుకోవాలని అపార్టుమెంట్ వాసులు అడుగుతున్నారు. సెల్లార్ల కోసం భూమిపై మరింత లోతుగా తవ్వడంతో పొరుగున ఉన్న భవనాలకు ఎఫెక్టు అవుతోందని అంటున్నారు. అందుకే సెల్లార్ల స్థానంలో ఇకపై స్టిల్ట్ లు నిర్మించుకోవాలని సూచిస్తున్నారు. అంటే ఫస్ట్ ఫ్లోర్ లో ఎటువంటి నిర్మాణాలు చేపట్టకుండా దానిని కేవలం పార్కింగ్ కోసం ఎత్తుగా కట్టుకోమని జీహెచ్ఎంసీ అధికారులు సూచిస్తున్నారు. ఇటీవల దేశ రాజధాని న్యూఢిల్లీలో సెల్లార్లలో నిర్వహిస్తున్న ఓ కోచింగ్ సెంటర్ లో వరద నీరు చేరుకోవడంతో అందులో ఇరుక్కున్న విద్యార్థులు మృతి చెందిన విషయం తెలిసిందే. దీనిపై రాజకీయ నాయకులు ఒకరిపై ఒకరు నిందలు వేసుకున్నారు. ఇప్పుడు హైదరాబాద్ లోనూ ఇకపై సెల్లార్లతో సమస్యలు రాకుండా నూతనంగా ఏర్పాటయ్యే భవనాలకు సెల్లార్లను అనుమతించేది లేదని జీహెచ్ఎంసీ అధికారులు చెబుతున్నారు. త్వరలోనే సెల్లార్ల విషయంలో అధికారిక ప్రకటన చేయనున్నారని సమాచారం.