Train derailment bid foiled in Rajasthan’s Ajmer: రాజస్థాన్లోని అజ్మీర్ సమీపంలో భారీ రైలు ప్రమాదానికి దుండగులు కుట్ర చేశారు. ఏకంగా రైలు పట్టాలపై బరువైన సిమెంట్ దిమ్మలను పెట్టి పట్టాలు తప్పించేందుకు కొంతమంది దుండగులు ప్రయత్నించారు. అయితే, ఈ రైలు ఆ బరువైన సిమెంట్ దిమ్మెలను ఢీకొట్టి ముందుకు దూసుకెళ్లింది. దీంతో ఆ రైలుకు త్రుటిలో పెను ప్రమాదం తప్పింది.
ఈ ప్రమాదంలో రైలు ఇంజిన్తో పాటు కొంతభాగం ట్రాక్ కూడా దెబ్బతింది. దీంతో వెంటనే అప్రమత్తమైన లోకో పైలట్.. రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ అధికారులకు సమాచారం అందించారు. వెంటనే రైలును నిలిపివేశారు. విషయం తెలుసుకున్న ఆర్పీఎఫ్ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు.
ఈ ఘటనలో రైలు ఢీకొట్టిన ప్రదేశంలో చెల్లాచెదురుగా పడి ఉన్న సిమెంట్ దిమ్మె విరిగిన భాగాలను ప్రొటెక్షన్ ఫోర్స్ అధికారులు గుర్తించారు. కావాలనే ఎవరో సిమెంట్ దిమ్మెలు పెట్టి రైలు ప్రమాదం జరిగేలా కుట్ర చేశారని అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
సిమెంట్ దిమ్మెలు తీసుకురావడం ఒకరితో కష్టమైందని, ఈ కుట్రలో ఎక్కువమంది ప్రమేయం ఉందని అంచనా వేస్తున్నారు. అనంతరం పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. మంగ్లియావాస్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
Also Read: రెండు కార్లు ఎదురెదురుగా ఢీ.. ఆరుగురు దుర్మరణం.. మరో ఇద్దరి పరిస్థితి విషమం
ఇదిలా ఉండగా, రెండు రోజుల క్రితం కాన్పూర్ సమీపంలో భారీ రైలు ప్రమాదానికి కుట్ర చేసిన సంగతి తెలిసిందే. కొంతమంది దుండగులు గ్యాస్ సిలిండర్ పెట్టి రైలును పట్టాలు తప్పించేందుకు ప్రయత్నించారు. ఈ ఘటనలో ప్రయాగ్ రాజ్ భివాని కాళింది ఎక్స్ ప్రెస్కు త్రుటిలో ప్రమాదం తప్పింది.
శివరాజ్ పుర్ ప్రాంతంలో ఆదివారం రాత్రి పట్టాలపై ఉన్న గ్యాస్ సిలిండర్ను ప్రయాగ్ రాజ్ నుంచి వస్తున్న భివాని కాళింది ఎక్స్ ప్రెస్ రైలు ఢీకొట్టింది. ట్రాక్పై అనుమానం వస్తువు ఉన్నట్లు గుర్తించిన లోకో పైలట్ ఎమర్జెన్సీ బ్రేకులు వేసి రైలును నిలిపివేశారు. కానీ అప్పటికే ఆ రైలు పట్టాలపై ఉన్న సిలిండర్ను ఢీకొట్టి సుమారు 50 మీటర్ల దూరంలో ఎగిరిపడింది. ఈ ఘటనలో ఎలాంటి ప్రమాదం చోటుచేసుకోకపోవడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు.