Rain Alert For Telangana: తెలంగాణకు మరో ముప్పు పొంచి ఉంది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలపడి తీవ్ర వాయుగుండంగా మారింది. ఈ నేపథ్యంలో రాష్ట్రానికి ఇప్పట్లో వరద ముప్పు తగ్గేలా కనిపించడం లేదు. తాజాగా, వాతావరణశాఖ కీలక హెచ్చరిక జారీ చేసింది. ఈ మేరకు పలు జిల్లాలకు బిగ్ అలర్ట్ జారీ చేసింది.
వాయువ్య బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం కొనసాగుతోందని వాతావరణశాఖ హెచ్చరించింది. ఒడిశా పూరీకి తూర్పు ఆగ్నేయ దిశలో 50 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైందని వాతావరణ కేంద్రం పేర్కొంది. వాయువ్యదిశగా పయనించి రాబోయే 3 గంటల్లో ఒడిశా తీరం దాటే అవకాశం ఉందని తెలిపింది.
ఒడిశా మీదుగా వెళ్తూ అదే తీవ్రతను కొనసాగిస్తూ వాయుగుండంగా మారే అవకాశం ఉందని చెప్పింది. రానున్న 24 గంటల్లో ఛత్తీస్ గఢ్ మీదుగా పశ్చిమ వాయువ్య దిశగా పయనించే అవకాశం ఉందని అంచనా వేసింది. ఈ క్రమంలో తెలంగాణలోని పలు జిల్లాల్లో రానున్న 24 గంటల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.
ఆసిఫాబాద్, మంచిర్యాల, భూపాలపల్లి జిల్లాలో భారీ నుంచి అతిభారీ వర్షాలు పడతాయని ఆరెంజ్ అలర్ట్ చేసింది. ఇక, ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, కరీంనగర్, పెద్దపల్లి, ములుగు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసేందుకు అవకాశం ఉందని పేర్కొంది.
అలాగే, రాజన్న సిరిసిల్ల, కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాలలో అక్కడక్కడ ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో వర్షం కురిసేందుకు అవకాశం ఉందని పేర్కొంది.
Also Read: తెలంగాణ అసెంబ్లీలో కమిటీల నియామకం.. అరికెపూడికి బిగ్ ఆఫర్
ఇదిలా ఉండగా, ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరదలతో నష్టపోయిన వరద బాధితులకు ప్రభుత్వం భరోసా ఇచ్చింది. రాష్ట్రానికి తీవ్ర నష్టం వాటిల్లిందని, ఎవరూ ఆందోళన పడాల్సిన అవసరం లేదని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పారు. వర్షాలతో నష్టపోయిన ప్రతి కుటుంబానికి రూ.16,500చొప్పున సాయం అందిస్తామన్నారు. అయితే రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 33మంది మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. మృతుల కుటుంబాలకు రూ.5లక్షల చొప్పు ఆర్థికసాయంతోపాటు ఇందిరమ్మ ఇల్లు అందజేయననున్నట్లు కలెక్లర్లను ఆదేశించారు.