Telangana legislature committee: తెలంగాణ అసెంబ్లీలో కమిటీల నియామకం చేపట్టింది ప్రభుత్వం. పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ గా అరికెపూడి గాంధీ నియామకమయ్యారు. సభ్యులుగా ప్రశాంత్ రెడ్డి, గంగుల కమలాకర్, రేవూరి ప్రకాశ్ రెడ్డి, చిక్కుడు వంశీ కృష్ణ, యెన్నం శ్రీనివాస్ రెడ్డి, రామారావ్ పవార్, అహ్మద్ బిన్ అబ్దుల్లా బలాలా, కూనంనేని సాంబశివరావు, టి. జీవన్ రెడ్డి, టి. భానుప్రసాద్ రావు, ఎల్. రమణ, సత్యవతి రాథోడ్ కు అవకాశం కల్పించారు.
Also Read: హైకోర్టు తీర్పుపై స్పందించిన కేటీఆర్.. ఆ నియోజకవర్గాల్లో ఇక..
ఇటు ఎస్టిమేట్ కమిటీ చైర్ పర్సన్ గా ఎన్. పద్మావతి రెడ్డి నియామకమయ్యారు. సభ్యులుగా ఎమ్మెల్యేలు సునీతా లక్ష్మారెడ్డి, డి. సుధీర్ రెడ్డి, మాగంటి గోపీనాథ్, సీహెచ్. విజయరమణారావు, కోరం కనకయ్య, రాందాస్ మాలోత్, యశస్వినీరెడ్డి, రాకేశ్ రెడ్డి, ఎమ్మెల్సీలు ప్రభాకర్ రావు, సుంకరి రాజు, టి. రవీందర్ రావుకు అవకాశం కల్పించారు.
ఇదిలా ఉంటే.. పబ్లిక్ అకౌంట్స్ కమిటీ(పీఏసీ) చైర్మన్ గా శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ నియామకంపై మాజీ మంత్రి, సిద్ధిపేట బీఆర్ఎస్ ఎమ్మెల్యే స్పందించారు. అరెకిపూడి గాంధీ నియామకాన్ని ఆయన తప్పుబట్టారు. పీఏసీ చైర్మన్ పదవి విపక్షాలకు ఇవ్వడం ఆనవాయితీ అని ఆయన గుర్తు చేశారు. ఈ ఆనవాయితీ నాటి నుంచి కొనసాగుతుందన్నారు. కానీ, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం అధికార పార్టీ నేతను పీఏసీ చైర్మన్ గా నియమించిందంటూ ఆయన అసంతృప్తిని వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరిన అరికెపూడి గాంధీకి పీఏసీ చైర్మన్ పదవిని కట్టబెట్టడం దారుణమన్నారు. పీఏసీ చైర్మన్ విషయంలో ప్రభుత్వ చర్య అప్రజాస్వామికమన్నారు. నిత్యం రాజ్యాంగం చేతిలో పట్టుకునే రాహుల్ గాంధీ దీనిపై ఏ విధంగా స్పందిస్తారో చూడాలన్నారు. కేంద్రంలో పీఏసీ చైర్మన్ పదవిని ఎవరు తీసుకున్నారో కాంగ్రెస్ చెప్పాలంటూ హరీశ్ రావు డిమాండ్ చేశారు.