KTR Reaction: పార్టీ ఫిరాయింపులకు సంబంధించి తెలంగాణ హైకోర్టు తాజాగా ఇచ్చిన తీర్పుపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ స్పందించారు. పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించిన కాంగ్రెస్ కు హైకోర్టు తీర్పు చెంప పెట్టులాంటిదంటూ ఆయన పేర్కొన్నారు. నాలుగు వారాల తరువాత దానం నాగేందర్, కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావుల ఎమ్మెల్యే పదవులు ఊడటం ఖాయమన్నారు. పార్టీ మారిన ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు తప్పవన్నారు. తాను మొదటి నుంచి ఇదే విషయాన్ని చెబుతున్నానంటూ ఆయన వివరించారు. రాజ్యాంగ పరిరక్షణ అంటూనే ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారంటూ రాహుల్ గాంధీపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటు న్యాయస్థానాల్లోనూ, అటు ప్రజాక్షేత్రంలోనూ కాంగ్రెస్ పార్టీకి శిక్ష తప్పదంటూ కేటీఆర్ పేర్కొన్నారు.
ఇటు హరీశ్ రావు మాట్లాడుతూ..’హైకోర్టు తీర్పు అధికార కాంగ్రెస్ పార్టీకి చెంప పెట్టులాంటిది. ఈ తీర్పు కాంగ్రెస్ అప్రజాస్వామిక పద్ధతులకు గణనీయమైన ఎదురుదెబ్బ. పార్టీ మారినవారు అనర్హత వేటు నుంచి తప్పించుకోలేరని స్పష్టం అర్థమవుతోంది. న్యాయస్థానం తీర్పు ప్రజాస్వామ్యానికి దక్కిన విజయం, మన రాజ్యాంగ విలువలను కాపాడడంలో బలమైన వైఖరి. ఉప ఎన్నికలు అనివార్యం. ఆ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ విజయం సాధించడం ఖాయం.
రానున్న నాలుగు వారాల్లో నిర్ణయం తీసుకోవడం ద్వారా ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించేందుకు, కోర్టు ఆదేశాలను అనుసరించి అసెంబ్లీ స్పీకర్ వెంటనే చర్యలు తీసుకుంటారని మేం విశ్వసిస్తున్నాం’ అంటూ హరీశ్ రావు పేర్కొన్నారు.
Also Read: తెలంగాణ అసెంబ్లీలో కమిటీల నియామకం.. అరికెపూడికి బిగ్ ఆఫర్
ఇదిలా ఉంటే.. 16వ ఆర్థిక సంఘం సమావేశంలో హరీశ్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘మంచి పనితీరు కనబరుస్తున్న రాష్ట్రాలకు కేంద్ర నిధుల్లో అన్యాయం జరుగుతుంది. బాగున్న రాష్ట్రానికి నిధులు తక్కువగా ఇస్తామనడం ఎంతవరకు సరికాదు. బాగా పనిచేస్తున్న రాష్ట్రాన్ని ప్రోత్సహించేలా నిర్ణయాలు ఉండాలి.. కానీ, వాటి గొంతు నొక్కేలా విధానాలు ఉండొద్దంటూ ఆర్థిక సంఘాన్ని కోరాం. ఇటు పన్నుల వాటా కేటాయింపుల్లోనూ కేంద్రం పాటిస్తున్న విధానాలు సైతం సరిగా లేవంటూ ఆర్థిక సంఘానికి తెలియజేశాం.
Also Read: తప్పు తెలుసుకున్న కేసీఆర్.. వాళ్ళతో చర్చలకు సిద్ధం
ఇంటింటికి నీరు అందిస్తామంటూ కేంద్రం హర్ ఘర్ జల్ పథకాన్ని తీసుకొచ్చింది. కానీ, ఆ పథకాన్ని రాష్ట్రంలో మిషన్ భగీరథ రూపంలో మేం గతంలోనే అమలు చేశాం. ఆ సమయంలో మిషన్ భగీరథ పథకానికి నిధులు ఇవ్వాలని ఎన్ని విన్నవించినా, ఇటు నీతి ఆయోగ్ చెప్పినా కూడా కేంద్రం తెలంగాణకు నిధులు ఇవ్వలేదు. 15వ ఆర్థిక సంఘం సూచనల్లో ఒక్క సూచనను కూడా కేంద్రం పాటించలేదు. నాటి నుంచి నేటి వరకు కేంద్రం తెలంగాణ పట్ల వివక్ష చూపుతూనే వస్తున్నది. ఈ విధానాన్ని కేంద్రం మార్చుకోవాలి’ అంటూ ఎమ్మెల్యే హరీశ్ రావు వ్యాఖ్యానించారు.