Washington Post Makes Massive Job Cuts : అమెజాన్ అధినేత జెఫ్ బెజోస్కు చెందిన మరో కంపెనీ ఉద్యోగులను తొలగించేందుకు సిద్ధమైంది. అమెరికా వార్తా సంస్థ వాషింగ్టన్ పోస్ట్… ఉద్యోగులను తొలగిస్తున్నట్లు ప్రకటించింది. వచ్చే ఏడాది ప్రారంభంలో ఉద్యోగుల తొలగింపు ప్రక్రియ ఉంటుందని తెలిపింది. సంస్థలోని మొత్తం 2,500 మంది ఉద్యోగుల్లో… సింగిల్ డిజిట్ పర్సెంట్ కోతలు.. అంటే 1 నుంచి 9 శాతం మందిలో ఎందరి ఉద్యోగాలైనా ఊడిపోవచ్చని భావిస్తున్నారు.
వాషింగ్టన్ పోస్ట్ ఇప్పటికే తన వీక్లీ మ్యాగజైన్ మూసివేసి, కొందరు ఉద్యోగుల్ని తీసివేసింది. ఆర్థిక మాంద్యం ప్రభావం వల్లే వచ్చే ఏడాదిలోనూ ఉద్యోగుల సంఖ్యను తగ్గించుకోబోతున్నట్లు ప్రకటించింది. అయితే సీనియర్ల స్థానంలో కొత్త ఉద్యోగుల్ని తీసుకుంటామని, ఖర్చుల్ని తగ్గించుకునే ఆలోచనే తప్ప ఉద్యోగుల్ని తగ్గించుకునే ఉద్దేశం లేదని వాషింగ్టన్ పోస్ట్ చెబుతోంది. ఉద్యోగుల తొలగింపు… సంస్థ ఆశయాలపై ఎలాంటి ప్రభావం చూపబోదని, పాఠకుల్ని ఆకట్టుకోలేని విభాగాల్లో పెట్టుబడులు పెట్టడం సాధ్యం కాదని వాషింగ్టన్ పోస్ట్ పేర్కొంది. ప్రకటనలపై ఆధారపడే కంపెనీల ఆదాయం తగ్గిపోవడమే ఉద్యోగుల తొలగింపునకు కారణమని, మంచి హోదాల్లో ఉండే వ్యక్తులకు ఇది చాలా కష్ట సమయం అని అభిప్రాయపడింది. పులిట్జర్ ప్రైజ్ విజేత అయిన కౌఫ్మన్ ను కూడా ఉద్యోగం నుంచి తొలగించడమే ఇందుకు ఉదాహరణ అని పేర్కొంది.
ఆదాయాలు తగ్గిపోవడం, ఆర్థిక మాంద్యం రావొచ్చనే భయాలతో… గత నెల రోజులుగా ఎన్నో కంపెనీలు ఉద్యోగుల తొలగింపును చేపట్టాయి. ట్విట్టర్, గూగుల్, మెటా, అమెజాన్ సహా చాలా బడా సంస్థలు ఖర్చుల్ని తగ్గించుకోవడంలో భాగంగా ఉద్యోగులను తీసేశాయి. ప్రపంచవ్యాప్తంగా ఇటీవలి కాలంలోనే ఉద్యోగాలు కోల్పోయిన వారి సంఖ్య లక్షన్నరకు పైగానే ఉందంటే… కంపెనీలు ఎంత జాగ్రత్త పడుతున్నాయో అర్థం చేసుకోవచ్చు. అసలే కరోనా కారణంగా 2020, 2021లో ఉద్యోగాలు పోయి ఎన్నో కుటుంబాలు అవస్థలు పడగా… ఇప్పుడు ఆర్థిక మాంద్యం దెబ్బకు ఉద్యోగాలు ఊడుతుండటంతో… వేల కుటుంబాలు దిక్కుతోచని స్థితిలో పడిపోయాయి.