Prakasam barrage report: విజయవాడలో వరదలు తగ్గినా రాజకీయ వేడి ఏ మాత్రం తగ్గలేదు. అధికార టీడీపీ-వైసీపీ మధ్య మాటల యుద్ధం కంటిన్యూ అవుతోంది. తాజాగా ప్రకాశం బ్యారేజ్ని బోట్లు ఢీకొన్న ఘటనపై అధికారులు నివేదికను సీఎం చంద్రబాబుకు అందజేశారు. అందులో నిందితులెవరు? ఏ విధంగా కుట్ర చేశారు? అనేదానిపై వివరాలను అందజేశారు. ఘటనకు ముందు.. తర్వాత కాల్ డేటాను విశ్లేషించే పనిలోపడ్డారు అధికారులు.
ప్రకాశం బ్యారేజ్ని ధ్వంసం చేసిన బోట్ల ఘటనపై నివేదికను అధికారులు సీఎం చంద్రబాబుకు అందజేశారు. ఢీకొన్న బోట్లు వైసీపీ నేతలు, కార్యకర్తలకు చెందినవిగా గుర్తించారు. బోట్లు ఎవరివి? వాటిని ఎవరు నడిపారు? అనేదానిపైనా ఆరాతీశారు. ఉషాద్రి, కోమటి రామ్మోహన్కు చెందినవిగా తేల్చేశారు అధికారులు. వైసీపీ నేత తలశిల రఘురాం మేనల్లుడే కోమటి రామ్మోహన్. మరొకను నందిగం సురేశ్ మద్దతుదారుడి బోట్లని తేలింది.
ఉద్దండరాయునిపాలెంలోవున్న బోట్లు ప్రమాదానికి వారం కిందట గొల్లపూడికి ఎందుకు వచ్చాయి? ఐదు బోట్లలో మూడు ఉషాద్రికి చెందినవి. బోట్లకు సంబంధించిన వివరాలపై మారిటైం బోర్డుకు పోలీసులు లేఖ రాశారు. తొలుత ప్రమాదమే అని భావించినప్పటికీ, ఘటన జరిగి తీరుపై సందేహాలు మొదలయ్యాయి. అధికారుల ఫిర్యాదుతో రామ్మోహన్, ఉషాద్రిని అరెస్ట్ చేసిన పోలీసులు, న్యాయస్థానం ముందు హాజరుపర్చనున్నారు.
ALSO READ: ఉత్తరాంధ్రలో వర్షాలు, పొంగుతున్న కాలువలు.. పోలీసుల వార్నింగ్
బోట్లు ఓనర్లుగా ఉషాద్రి, కర్రి నరసింహాస్వామి గూడూరు నాగమల్లేశ్వరీలకు చెందినవిగా గుర్తించారు. నార్మల్గా బోట్లకు లంగరు ఇనుప చైన్లతో వేస్తారు. కానీ ఇక్కడ ప్లాస్టిక్ తాళ్లతో కట్టినట్టు అందులో ప్రస్తావించినట్టు తెలుస్తోంది. తమ బోట్లతోపాటు మరో రెండు వరదకు కొట్టుకెళ్లాలా కుట్ర చేశారన్నది అందులోని సారాంశం.
సెప్టెంబరు రెండు తెల్లవారుజామున రెండు నుంచి ఐదుగంటల సమయంలో ప్రకాశం బ్యారేజ్ గేట్లను నాలుగు బోట్లు ఢీకొన్నాయి. ఈ ఘటనలో గేట్లకు ఉండే కౌంటర్ వెయిట్లు డ్యామేజ్ అయ్యాయి. ఇదే వ్యవహారంపై కృష్ణాకు వరద రావడం నుంచి బోట్లు ఢీ కొన్న ఘటన వరకు కాల్ డేటాను విశ్లేషించే పనిలో పడ్డారు అధికారులు.
బ్యారేజీ గేట్లను ఢీకొన్న బోట్లు వైసీపీ నేతలకు చెందినవే అంటూ జరుగుతున్న ప్రచారంపై ఆ పార్టీ నేతలు నోరుఎత్తారు. కూటమి ప్రభుత్వం అధికారంలో ఉందని ఘటనపై దర్యాప్తు జరిపించుకోవాలన్నారు మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్.
ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే విజయవాడకు విపత్తు సంభవించిందని ఆరోపించారాయన. బుడమేరు కాలువకు వరద వస్తుందని కొద్దిగంటలకు ముందు ప్రభుత్వానికి తెలిసినా ఏ మాత్రం పట్టించుకోలేదన్నారు. దాని ఫలితంగా ఈ ఘటన జరిగిందన్నారు. విజయవాడ వరద మరణాలన్నీ ప్రభుత్వ హత్యలుగానే వర్ణించారు అమర్నాథ్.
అధికారులు ప్రభుత్వానికి నివేదిక ఇవ్వడంతో తర్వాత చర్యలు ఏంటి అన్నదానిపై అధికార-విపక్ష పార్టీల్లో చిన్నపాటి చర్చ జరుగుతోంది. దీని వెనుక వైసీపీ పెద్దల హస్తముందా అనేదానిపై కాల్ డేటాను విశ్లేషిస్తున్నారు. ఒకవేళ వైసీపీ ముఖ్యనేతల ప్రమేయముంటే కఠినచర్యలు తప్పవన్నది అధికార పార్టీ నేతల మాట. సీఎం చంద్రబాబుతోపాటు మంత్రులు ఇదే విషయాన్ని పదేపదే ప్రస్తావించారు కూడా.
గేట్ల కౌంటర్లకు ఇప్పటివరకు అయిన ఖర్చును వారి నుంచి వసూలు చేయడం ఖాయమని అంటున్నారు. అంతేకాదు పనిష్మెంట్ కూడా అదే విధంగా ఉంటుందని గుర్తు చేస్తున్నారు. అదే జరిగితే విజయవాడ వరద వైసీపీని మరింత ఇబ్బందుల్లోకి నెట్టేయడం ఖాయమన్నది కొందరి నేతల మాట. ఇప్పటికే ఆ పార్టీ పనైపోయిందని, బెజవాడ వరద మరింత డ్యామేజ్ చేసిందని చెప్పుకోవడం గమనార్హం.