MLA Defection Case Telangana High Court Statement: తెలంగాణలో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల అనర్హత వ్యవహారంపై తెలంగాణ హైకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. అనర్హత పిటిషన్లు స్పీకర్ ముందు ఉంచాలని అసెంబ్లీ సెక్రటరీకి హైకోర్టు ఆదేశించింది. నాలుగు వారాల్లో స్టేటస్ రిపోర్టు ఇవ్వాలని, పిటిషన్ల విచారణపై షెడ్యూల్ విడుదల చేయాలని హైకోర్టు ఆదేశించింది.
ఎప్పటివరకు వాదనలు వినాలి, ఎప్పటిలోగా ప్రొసీడింగ్స్ పూర్తి చేయాలన్న దానిపై షెడ్యూల్ విడుదలకు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. నాలుగు వారాల్లో నిర్ణయం తీసుకోకపోతే సుమోటోగా స్వీకరించి విచారణ చేపడుతామని చెప్పింది.
కాగా, గత ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలుపొందిన కొంతమంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఇందులో ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావులపై అనర్హత వేటు వేయాలని హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద్ గౌడ్ కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే.
పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై బీఆర్ఎస్ దాఖలు చేసిన పిటిషన్లపై హైకోర్టు విచారణ చేపట్టింది. ఇప్పటికే ఈ పిటిషన్లపై వాదనలు సైతం పూర్తి చేసింది. ఈ పార్టీ ఫిరాయింపులపై చర్యలు తీసుకోవాలంటూ స్పీకర్ కార్యాలయంలో పిటిషన్ ఇచ్చినట్లు కోర్టులో వాదనలు వినిపించారు.
అంతకుముందు పార్టీ ఫిరాయింపుదారులపై అనర్హత వేటు వేయాలని చట్టం చెబుతున్నప్పటికీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ చోద్యం చూస్తున్నారని హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఇరువైపులా వాదనలు విన్న తెలంగాణ హైకోర్టు తీర్పును సెప్టెంబర్ 9కి వాయిదా వేసిన సంగతి తెలిసిందే.
Also Read: మరోసారి తెలంగాణ, ఆంధ్రా ఉద్యోగుల మధ్య వివాదం
ఇందులో భాగంగానే, సోమవారం ఉదయం కోర్టు ప్రారంభం కాగానే హైకోర్టు తీర్పును వెలువరించింది. పార్టీ ఫిరాయింపులకు పాల్పడిన ఎమ్మెల్యేలపై నాలుగు వారాల్లోగా చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది.