Principal arrested for deleting Ganesh Chaturthi post: వినాయక చవితి పండగ వేళ ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడికి చేదు అనుభవం ఎదురైంది. గణేష్ చతుర్థి వేడుకలకు సంబంధించిన ఓ పోస్టర్ను వాట్సప్ గ్రూపులోని డిలీట్ చేసినందుకు గానూ ఆ ఉపాధ్యాయుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటన రాజస్థాన్లోని కోటాలో చోటుచేసుకుంది.
వినాయక చవితి పండగ శుభాకాంక్షలకు సంబంధించిన పోస్టర్ను కొంతమంది ప్రభుత్వ స్కూల్ కమిటీ వాట్సప్ గ్రూపులో షేర్ చేశారు. అయితే ఆ గ్రూపులో ఉన్న మైనార్టీ వర్గానికి చెందిన ఓ స్కూల్ ప్రిన్సిపాల్ ఆ పోస్టర్ను డిలీట్ చేశాడు. దీంతో అదే పోస్టర్ను మళ్లీ షేర్ చేశారు. రెండో సారి కూడా ఆ పోస్టర్ను సదరు ప్రిన్సిపాల్ డిలీట్ చేయడంతో ఆ గ్రూపులో ఉన్న సభ్యులు ఆగ్రహానికి గురయ్యారు. అంతేకాకుండా కొంతమంది టీచర్లు, స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ స్కూల్ వద్ద నిరసన వ్యక్తం చేశారు.
విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని గొడవకు దారితీసిన పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం టీచర్లు, స్థానికుల ఫిర్యాదుతో ఆ స్కూల్ ప్రిన్సిపాల్ మహ్మద్ షఫీక్ను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం దీనికి సంబంధించిన వివరాలను తెలుసుకున్నారు.
వినాయక చవితి రోజు కొంతమంది హిందూ టీచర్లు చవితి శుభాకాంక్షలు తెలియజేస్తూ పోస్ట్ చేయడంతో ఆ పోస్టర్ ను లాటూరిలోని ప్రభుత్వ ప్రిన్సిపాల్ డిలీట్ చేశాడు. ఈ గ్రూపులో కొంతమంది గ్రామస్తులు కూడా ఉన్నారు. దాదాపు రెండు గంటల తర్వాత ఓ ఉపాధ్యాయుడు మళ్లీ పోస్ట్ చేశాడు. రెండు సార్లు డిలీట్ చేయడంతో హిందూవులైన ఉపాధ్యాయులు స్థానికులు, హిందూ సంఘాలతో కలిసి ఆ స్కూల్ వద్ద భైఠాయించి నిరసనకు దిగారు. దీంతో శాంతిభద్రతలకు విఘాతం కలిగించారనే ఆరోపణలపై ఆయనపై ఎఫ్ఐఆర్ నమోదు చేసి అరెస్టు చేశారు.
Also Read: దళపతి విజయ్ పార్టీకి ఎన్నికల కమిషన్ గుర్తింపు
ఈ విషయంపై ఆ ప్రిన్సిపాల్ మహ్మద్ షఫీక్ను వివరణ అడగగా.. వినాయకుడి పండగ పోస్టర్లను వాట్సప్ గ్రూపు నుంచి పొరబాటున డిలీట్ చేసినట్లు మైనార్టీ ప్రిన్సిపాల్ చెప్పినట్లు పోలీసులు తెలిపారు. అయితే రెండోసారి ఎందుకు డిలీట్ చేశారని అడగగా.. సరిగ్గా సమాధానం చెప్పలేదని, స్థానికుల ఫిర్యాదుతో అరెస్ట్ చేసినట్లు తెలిపారు