Bangladesh take necessary steps to extradite deposed on Sheikh Hasina: రిజర్వేషన్ల అంశం బంగ్లాదేశ్ ను అస్తవ్యస్తం చేశాయి. ఆందోళనలు రోజురోజుకూ ఉధృతమై చివరికి ఆ దేశ ప్రధాని షేక్ హసీనా తన పదవికి రాజీనామా చేయడమే కాదు..విదేశాలకు పారిపోయి తలదాచుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే బంగ్లాదేశ్ లో జరిగిన హింసాత్మక సంఘటనలతో షేక్ హసీనా ఆమె అనుచరులపై హత్యా నేరం కేసులు నమోదు చేశారు బంగ్లా దేశ్ ప్రస్తుత పాలకులు. బంగ్లాదేశ్ లో జరుగుతున్న హింసాత్మక సంఘటనలతో భీతిల్లిన షేక్ హసీనా భారత్ కు పారిపోయి ..అప్పటినుంచే ఇక్కడే తలదాచుకుంటున్నారు. షేక్ హసీనా గత పదిహేనేళ్లుగా భారత్ కు మద్దతుదారుగా ఉంటున్నారు. దీనితో తన ప్రాణాలకు రక్షణ ఇక్కడే సాధ్యం అని భావించారామె.
హత్యారోపణ కేసులు
హసీనా, ఆమె అనుచరులపై సామూహిక హత్యల నేరారోపణకు సంబంధించి పలు కేసులు బుక్కయ్యాయి. తప్పనిసరిగా ఆమెను స్వదేశం పిలిపించి విచారిస్తామని ఇంటర్నేషనల్ క్రైమ్స్ ట్రైబ్యునల్ చీఫ్ ప్రాసిక్యూటర్ తాజుల్ ఇస్లాం తెలిపారు. బంగ్లాదేశ్ లో కొత్త ప్రభుత్వం వచ్చాక తాజుల్ ను చీఫ్ ప్రాసిక్యూటర్ గా నియమించింది. ఈ విషయంలో భారత రాయబారితో మాట్లాడి నిందితులను అప్పగించేలా ఒప్పందం చేసుకుంటామని తాజుల్ తెలిపారు. అయితే బంగ్లాదేశ్ మీడియా కథనాల ప్రకారం రిజర్వేషన్ల అంశంలో విద్యార్థి సంఘాల ఆందోళనలు..ఆ తర్వాత జరిగిన హింసాత్మక సంఘటనలలో దాదాపు వెయ్యి మందికి పైగా మృతి చెందినట్లు వార్తా కథనాలు వచ్చాయి. దాదాపు రెండు నెలలుగా జరిగిన మారణ హోమానికి షేక్ హసీనా, ఆమె అనుచరులే కారణమని మరో తొమ్మిది మందిపై బంగ్లా అధికారులు కేసులు నమోదు చేయడం గమనార్హం.