D.K.Shiva kumar gave clarity on his US trip: కాంగ్రెస్ పార్టీలో విద్యార్థి నాయకుడి స్థాయి నుంచి కర్ణాటక రాజకీయాలను ప్రభావితం చేసే వ్యక్తిగా ఎదిగారు డీకే శివకుమార్. కర్ణాటక కనకపుర నియోుజకవర్గం నుంచి నాలుగు పర్యాయాలు గెలిచి తన సత్తా చాటారు. కాంగ్రెస్ అగ్ర నేతలు సోనియాగాంధీ, రాహుల్ గాంధీకి అత్యంత సన్నిహితుడుగా పేరు తెచ్చుకున్నారు. ప్రస్తుతం కర్ణాటక డిప్యూటీ సీఎంగా కీలక బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డీకే శివకుమార్ సోమవారం రాత్రి అమెరికా కు వెళ్లనున్నారు. అయితే ఈ పర్యటన ఎంతో ప్రత్యేకతతో కూడుకున్నది కావడం విశేషం. డీకే శివకుమార్ అమెరికాలో డెమెక్రాటిక్ పార్టీ తరపున అధ్యక్ష పదవికి పోటీ చేయనున్న కమలా హ్యారిస్ ను మర్యాద పూర్వకంగా కలవనున్నారు. అంటూ కొన్ని వార్తా ఛానళ్లు హోరెత్తిస్తున్నాయి. గత రెండు రోజులుగా డీకే అమెరికా పయనం..కమలా హ్యారిస్ తో భేటీ అని వార్తలు వండి వారుస్తున్నారు.
వ్యక్తిగత పర్యటన
ఈ విషయంలో స్పందిస్తూ డీకే ఇలా అన్నారు. అమెరికా పర్యటన అనేది తన వ్యక్తిగత అంశం అని..పూర్తిగా తన వ్యక్తిగత పర్యటన అని ఈ నెల 15 దాకా అక్కడే ఉంటానని స్పష్టం చేశారు. ఈ విషయంలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖార్గేకు ఉత్తరం కూడా రాశానని డీకే తెలిపారు. తిరిగి 16వ తేదీన ఇండియాకు వస్తానని చెప్పారు. గత రెండు రోజులుగా కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ కూడా అమెరికాలోనే ఉన్నారు. అక్కడ ప్రవాస భారతీయులను కలిసి వారి సమస్యలను సామరస్యంగా విని తనవంతు సాయం అందిస్తానని హామీ ఇచ్చినట్లు సమాచారం.
విషయాలు గోప్యంగా..
కమలా హ్యారిస్ కు భారతీయ ఓటర్ల మద్దతు అవసరం కనుక డీకేని కలిసి అక్కడే స్థిర నివాసం ఏర్పరుచుకున్న కర్ణాటక ఓటర్ల మద్దతు కోసం డీకే కృషి చేస్తారని భావిస్తున్నారు. అందుకే అనధికారికంగా డీకేని కమలా హ్యరిస్ కలిసే ఛాన్స్ ఉందని అక్కడి రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. అయితే ఇందుకు సంబంధించిన వ్యవహారాలు గోప్యంగా ఉంచాలని డీకే భావిస్తున్నట్లు సమాచారం.