Speed Trains: భారత రైల్వే శాఖ దూకుడు పెంచుతున్నది. తనను తాను సంపూర్ణంగా సంస్కరించుకుంటున్నది. సరికొత్త నిర్ణయాలు తీసుకుంటూ ప్రయాణికులకు మరింత సౌకర్యాలను ముందుకు తెచ్చే ప్రయత్నం చేస్తున్నది. పేద ప్రజల కోసం అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ తెచ్చిన రైల్వే శాఖ.. స్పీడ్ ట్రైన్లను తీసుకువచ్చే నిర్ణయంలో భాగంగా వందే భారత్ ఎక్స్ప్రెస్లను ప్రవేశపెట్టింది. త్వరలోనే అధునాతన సౌకర్యాలతో వందే భారత్ స్లీపర్ ట్రైన్ కూడా పట్టాలెక్కనుంది. ఇటీవలే బెంగళూరులోని బీఈఎంఎల్లో కేంద్ర రైల్వే శాఖ అశ్విని వైష్ణవ్ వందే భారత్ స్లీపర్ ప్రోటోటైప్ ఆవిష్కరించారు. అలాగే.. మరో కీలక నిర్ణయం కూడా తీసుకున్నది. గంటకు 250 కిలోమీటర్ల వేగంతో పరుగెత్తే ట్రైన్ను పట్టాలెక్కించే పనిలో పడింది.
250 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించడానికి అనుకూలంగా ఉండేలా రెండు ట్రైన్ సెట్లను తయారు చేయడానికి కేంద్ర ప్రభుత్వం బిడ్లు ఆహ్వానించినట్టు తెలిసింది. బిడ్ ఓకే అయిన కంపెనీ గంటకు గరిష్టంగా 250 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించినా.. బోగీలు సురక్షితంగా ఉండేలా రెండు ట్రైన్ సెట్లను నిర్మించాల్సి ఉంటుంది. భారత రైల్వే శాఖ ఈ బిడ్డింగ్ ఆహ్వానానికి ముందు ఇదే ఏడాదిలో చెన్నైలోని ఇంటిగ్రేటెడ్ కోచ్ ఫ్యాక్టరీకి ఓ లేఖ రాసింది. 8 బోగీలతో ఒక స్టాండర్డ్ గేజ్ ట్రైన్ సెట్ను తయారు చేయాలని సూచించింది. ఆ బోగీలు స్టీల్తో తయారు చేయాలని కూడా పేర్కొంది. ఆ ట్రైన్ సెట్ గరిష్టంగా 250 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించడానికి అనుకూలంగా ఉండాలని వివరించింది. సగటున ఆ ట్రైన్ గంటకు 220 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించాల్సి ఉంటుందని తెలిపింది. ప్రస్తుతం అత్యధిక వేగంతో వందే భారత్ ఎక్స్ప్రెస్ నడుస్తున్నది. ఈ వందే భారత్ ఎక్స్ప్రెస్ ట్రైన్ గంటకు 160 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. రైల్వే శాఖ ఆలోచనలు అమల్లోకి వస్తే మీ ట్రైన్ గాల్లో దూసుకెళ్లుతుందని చెప్పవచ్చు. సగటున గంటకు 220 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లనుంది.
Also Read: Magadh Express: బోగీల మధ్య ఊడిన కప్లింగ్.. రెండుగా విడిపోయిన ట్రైన్
ఇటీవలే కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ వందే భారత్ స్లీపర్ ట్రైన్ ఆవిష్కరించారు. ఈ వందే భారత్ స్లీపర్ ట్రైన్లో ప్రయాణికుల భద్రత, అంతర్జాతీయ శ్రేణి సదుపాయాలతో అందుబాటులోకి రానుంది. ట్రైన్ లోపల క్రాష్ వర్తీ ఎలిమెంట్స్ ఉన్నాయి. క్రాష్ బఫర్స్, కపులర్స్ వంటివి ఒక వేళ ట్రైన్ కుదుపునకు లేదా ప్రమాదానికి గురైనా ప్రయాణికులకు ఎక్కువ గాయాలు కాకుండా.. దెబ్బలు తగలకుండా చూస్తాయి. అలాగే.. ఇంటిగ్రేటెడ్ రీడింగ్ లైట్, యూఎస్ బీ చార్జింగ్ పోర్టు, పబ్లిక్ అనౌన్స్మెంట్, విజువల్ ఇన్ఫర్మేషన్, డిస్ ప్లే ప్యానెళ్లు, సెక్యూరిటీ కెమెరాలతోపాటు మాడ్యులర్ ప్యాంట్రీలు కూడా ఈ వందే భారత్ స్లీపర్ ట్రైన్లో అందుబాటులోకి రానున్నాయి.
వందే భారత్ స్లీపర్ ట్రైన్లలో వికలాంగుల కోసం ప్రత్యేక సదుపాయాలను ఏర్పాటు చేస్తున్నారు. వీరికి ప్రత్యేక బెర్తుల, ప్రత్యేక టాయిలెట్లు అందుబాటులో ఉంాయి. ఫస్ట్ ఏసీ కార్లో ప్రయాణికులకు అలసటను తగ్గించేలా స్నానానికి వేడి నీళ్లు కూడా అందిస్తారు. ఆటోమేటిక్ ఎక్స్టీరియర్ ప్యాసింజర్ డోర్లు వందే భారత్ స్లీపర్ ట్రైన్లలో ఉంటాయి. సెన్సార్ ఆధారంగా కమ్యూనికేట్ అయ్యే డోర్లు ఉంటాయి. డ్రైవింగ్ సిబ్బందికి కూడా మంచి టాయిలెట్లు అందుబాటులోకి తేనుంది. అలాగే.. ప్రయాణికుల లగేజ్ కోసం విశాలమైన లగేజ్ రూమ్ ఉంటుంది.