Rakul: ఈడీ. ఈడీ. ఈడీ. తెలంగాణలో మారుమోగుతున్న పేరు. ఈడీ నోటీసులు ఇవ్వడం, ప్రశ్నించడం రెగ్యులర్ టాపిక్ గా మారింది. రాజకీయ నేతలు, వ్యాపార ప్రముఖులు, సినీ వర్గాలపై ఈడీ పంజా విసరడం కామన్ గా మారింది. కొన్నివారాలుగా తెలంగాణలో తీవ్ర అలజడి.
తాజాగా, టాప్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ కు ఈడీ నోటీసులు ఇచ్చింది. ఎప్పుడో జరిగిపోయిన, అంతా మర్చిపోయిన టాలీవుడ్ డ్రగ్స్ కేసులో లేటెస్ట్ గా రకుల్ ను ఈడీ టార్గెట్ చేయడం ఆసక్తికరంగా మారింది. ఈడీ నోటీసుల వెనుక రాజకీయ కోణమూ ఉందనే అనుమానం కూడా వ్యక్తం అవుతోంది. ఆయన్ను టార్గెట్ చేయడానికే.. ఈమెకు నోటీసులు ఇచ్చారనే టాక్ వినిపిస్తోంది.
టాలీవుడ్ డ్రగ్స్ కేసులో గతేడాది సెప్టెంబర్ 3న రకుల్ను ఈడీ అధికారులు విచారించారు. అప్పుడు విచారణ మధ్యలోనే రకుల్ వెళ్లిపోవడంతో ఆమెను పూర్తిస్థాయిలో విచారించలేకపోయారు. టాలీవుడ్లో డ్రగ్స్ వ్యవహారంపై 2017 జులైలో ఎన్డీపీఎస్ చట్టం కింద తెలంగాణ ఎక్సైజ్ పోలీసులు కేసు నమోదు చేశారు. సిట్ ఏర్పాటు చేసి పలువురు సినీ ప్రముఖులును విచారించారు. అనంతరం ఈడీ సైతం దర్యాప్తు చేపట్టింది. ఆ విచారణ కొనసాగి..సాగి.. లేటెస్ట్ గా రకుల్ ప్రీత్ సింగ్ కు మరోసారి నోటీసులు ఇచ్చే వరకు వచ్చింది.
అయితే, సమయం, సందర్భమే కాస్త అనుమానాలకు తావిస్తోంది. ఓవైపు టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ వార్ ఓ రేంజ్ లో జరుగుతోంది. మంత్రులు, ఎంపీ, ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేలపై ఈడీ, సీబీఐ, ఐటీ దాడులు జరుగుతున్నాయి. ఇలాంటి రాజకీయ ఉద్రిక్తతల మధ్య.. సడెన్ గా హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ కు ఈడీ నోటీసులు ఇవ్వడంతో ఇందులోనూ పొలిటికల్ యాంగిల్ వెతుకుతున్నారు కొందరు.
మరెవరైనా సినీ ప్రముఖులకు నోటీసులు ఇస్తే ఇంత చర్చ జరిగి ఉండకపోవచ్చు. రకుల్ కు ఇవ్వడం వల్లే సంథింగ్ సంథింగ్ అంటున్నారు. ఓ టీఆర్ఎస్ బిగ్ లీడర్ కు రకుల్ ప్రీత్ తో సన్నిహిత సంబంధాలు ఉన్నాయంటూ.. గోవా, డ్రగ్స్ అంటూ.. గతంలో ఆరోపణలు వచ్చాయి. రేవంత్ రెడ్డి, బండి సంజయ్ లు పలుమార్లు ఆ విషయాన్ని ప్రస్తావించారు. ఆ తర్వాత ఆ నేత కోర్టుకు వెళ్లి.. డ్రగ్స్ విషయంలో తన పేరు ప్రస్తావించకుండా ఉత్తర్వులు తెచ్చుకున్నారు. తాజాగా, రకుల్ కు ఈడీ నోటీసులు ఇవ్వడం వెనుక ఆ నేతను టార్గెట్ చేసే ఉద్దేశమేమైనా ఉందా? అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు రాజకీయ విశ్లేషకులు. ఇప్పటికే ఢిల్లీ లిక్కర్ స్కాంలో కవితను కార్నర్ చేశారు.. ఇక ఆ కీలక నేతను డ్రగ్స్ కేసులో దెబ్బేస్తే..?