Train Splits: న్యూఢిల్లీ నుంచి ఇస్లాంపూర్ బయల్దేరిన మగధ్ ఎక్స్ప్రెస్ శరవేగంగా దూసుకుపోతున్నది. బిహార్ రాష్ట్రంలోకి ప్రవేశించిన తర్వాత 13, 14వ నెంబర్ బోగీల మధ్యనున్న కప్లింగ్ లూజ్ అయింది. కొంత దూరం ప్రయాణించాక.. కప్లింగ్ రెండుగా విరిగిపోయింది. దీంతో ఇంజిన్ వైపున్న బోగీలతో వెనుక వైపున్న కొన్ని బోగీలు విడిపోయాయి. ఇంజిన్ వైపున్న ట్రైన్ దూసుకుపోతుండగా.. కప్లింగ్ బ్రేక్ అయిన బోగీ నుంచి వెనుక ఉన్నవన్నీ నెమ్మదించాయి. ఈ విషయం తెలుసుకున్న లోకో పైలట్ వెంటనే సమీపంలోని రైల్వే స్టేషన్కు సమాచారం అందించి ఇంజిన్ను మెల్లిగా నిలిపేశాడు. కప్లింగ్ బ్రేక్ కావడంతో ట్రైన్ రెండుగా విడిపోయిన ఈ ఘటన బిహార్లో ఆదివారం ఉదయం చోటుచేసుకుంది.
న్యూఢిల్లీ నుంచి బయల్దేరిన మగధ్ ఎక్స్ప్రెస్ (20802) బిహార్లో ప్రవేశించిన తర్వాత ఈ రోజు ఉదయం 11.07 గంటల ప్రాంతంలో రెండుగా విడిపోయింది. త్వినిగంజ్ – రఘునాథ్పూర్ రైల్వే స్టేషన్ల మధ్య ఈ ఘటన జరిగింది. అనంతరం, అధికారులు ఈ ట్రైన్ను రఘునాథ్ పూర్ రైల్వే స్టేషన్కు రిపేర్ కోసం తరలించారు. రిపేర్ పూర్తి అయిన తర్వాత ట్రైన్ తిరిగి తన ప్రయాణాన్ని ప్రారంభించింది.
దుమ్రాన్ డీఎస్పీ అఫక్ అక్తర్ అన్సారీ ఈ ఘటనపై మాట్లాడారు. ప్రమాదమేమీ జరగలేదని, కప్లింగ్ ఫెయిల్ కావడంతో ట్రైన్ రెండుగా విడిపోయిందని వివరించారు. ఆ తర్వాత వాటిని రఘునాథ్ పూర్ రైల్వే స్టేషన్కు తరలించినట్టు చెప్పారు. ప్రతి ఒక్కరూ సురక్షితంగానే ఉన్నారని, ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేవని తెలిపారు. కప్లింగ్ రిపేర్ చేసిన తర్వాత ట్రైన్ తన డెస్టినేషన్కు జర్నీ ప్రారంభిస్తుందని పేర్కొన్నారు. ఈ వైఫల్యానికి గల కారణాలను రైల్వే అధికారులు విచారిస్తారని చెప్పారు.
ఇదిలా ఉండగా.. ఇదే రోజు ఉదయం పశ్చిమ బెంగాల్లోని దక్షిణ 24 పరిగణాల జిల్లాలో రైల్వే స్టేషన్లో ప్రమాదం చోటుచేసుకుంది. గుటియారి షరీఫ్ రైల్వే స్టేషన్లో ఆదివారం ఉదయం 10 గంటల ప్రాంతంలో ప్లాట్ ఫామ్ నెంబర్ వన్ పై గల ఓ దుకాణంలో మంటలు వ్యాపించాయి. అనతి కాలంలోనే అవి వేరే ప్లాట్ ఫామ్ పై గల షాపులకూ పాకాయి. పెద్ద మొత్తంలో మంటలు చెలరేగడంతో ట్రైన్ కోసం ఎదురుచూస్తున్న ప్రయాణికులు పరుగులు పెట్టారు. రైల్వే పోలీసులు, బ్రిగేడ్ అధికారులు స్పాట్కు చేరుకున్నారు. రెండు అగ్నిమాపక యంత్రాలు మంటలను అదుపు చేయడానికి వచ్చాయి. స్థానికులు కూడా వెంటనే అప్రమత్తమై మంటలను ఆర్పడంలో నిమగ్నమయ్యారు. కొద్ది సేపటి తర్వాత మంటలు అదుపులోకి వచ్చాయి. ప్లాట్ ఫామ్ పైనున్న దుకాణాల్లోని ఫర్నీచర్, వస్తువులు అగ్నిలో మాడి మసైపోయాయి. నష్టాన్ని ఇంకా అంచనా వేయాల్సి ఉన్నది. ఈ రైల్వే స్టేషన్ మీదుగా వెళ్లే కొన్ని ట్రైన్లు ప్రయాణికుల భద్రత దృష్ట్యా ఆలస్యంగా వచ్చాయి. ఈ ప్రమాదంలో ఎవరికీ గాయాలు కాలేవు. ప్రమాదానికి గల కారణాలను తెలుసుకోవడానికి దర్యాప్తు చేస్తామని అధికారులు తెలిపారు.