– వరద బాధితులను కేంద్రం ఆదుకుంటుంది
– రాకాసి తండా ప్రజలు సర్వస్వం కోల్పోయారు
– రైతులు తీవ్రంగా నష్టపోయారు
– కేంద్రం అన్నివిధాలా అండగా ఉంటుంది
– నష్టంపై సమగ్ర విచారణ తర్వాత పూర్తిస్థాయి సహకారం
– దంసలాపురం, రాకాసి తండాలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి పర్యటన
Kishan Reddy: మున్నేరు పరివాహక ప్రాంతానికి అడ్డుగా రిటైనింగ్ వాల్ కట్టిస్తామని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి హామీ ఇచ్చారు. ఖమ్మం పట్టణంలోని 16వ డివిజన్ దంసలాపురంలో పర్యటించారు. రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఎంపీ ఈటల రాజేందర్ సహా పలువురు నేతలు ఉన్నారు. భారీ వరదల కారణంగా ముంపునకు గురైన ప్రాంతాల్ని పరిశీలించారు. వరద బాధితులతో మాట్లాడి నివారణ చర్యలు, పునరావాస కార్యక్రమాలపై వివరాలను అడిగి తెలుసుకున్నారు. వరద బాధితులను కేంద్ర ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని కిషన్ రెడ్డి ఈ సందర్భంగా తెలిపారు. రాష్ట్రం ప్రభుత్వం నుంచి వరద విపత్తుల సంస్థ ద్వారా నష్టంపై సమగ్ర విచారణ అందిన వెంటనే కేంద్రం నుంచి పూర్తిస్థాయి సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు.
అక్కడి నుంచి పాలేరు నియోజకవర్గం తిరుమలాయపాలెం మండలం రాకాసి తండాకు వెళ్లారు నేతలు. అక్కడ మీడియాతో మాట్లాడిన కిషన్ రెడ్డి, ప్రధాన మంత్రి మోదీ ఆదేశాల మేరకు పరిశీలనకు వచ్చానని అన్నారు. రాకాసి తండా ప్రజలు వరద కారణంగా సర్వస్వం కోల్పోయారని, పంట పొలాల్లో ఇసుక మేటలు ఉన్నాయని తెలిపారు. గ్రామస్థులు ప్రత్యామ్నాయం ఏర్పాటు చేయాలని కోరారని, అందరి ఆమోదం ప్రకారం రాకాసి తండాను సురక్షిత ప్రాంతానికి మార్చే ఏర్పాటు చేయాలన్నారు. పంట పొలాల్లో ఇసుక మేటలను తొలగించి ఆర్థిక సాయం అందించి రైతులు సాగు చేసుకునే విధంగా చేయాలని చెప్పారు. వరద బాధితులు దైర్యంగా ఉండాలని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అండగా ఉంటాయని తెలిపారు. ఇల్లు కోల్పోయిన వారికి వసతి ఏర్పాటు చేయడానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. విషయం తెలిసిన వెంటనే కేంద్ర ప్రభుత్వ పరిశీలకులను రప్పించి నష్టం అంచనా వేశామని, బాధితులకు సహాయం అందేలా చర్యలు చేపట్టామని వివరించారు. రాజకీయాలకు అతీతంగా అందరూ వరద బాధితులకు అండగా ఉండాలని పిలుపునిచ్చారు కిషన్ రెడ్డి.
బీఆర్ఎస్ది.. చిల్లర రాజకీయం
రాకాసి తండాలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ, రాష్ట్ర వ్యాప్తంగా గత వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు అనేక జిల్లాలు జలమయం అయ్యాయని అన్నారు. నష్టపోయిన వారికి అండగా ఉండేందుకు కేంద్ర ప్రభుత్వం నుంచి మొన్న వ్యవసాయ శాఖ మంత్రి చౌహాన్ రాగా, ఇప్పుడు కిషన్ రెడ్డి వచ్చారని చెప్పారు. కేంద్ర బృందం వచ్చి నష్టాన్ని అంచనా వేసి పంపించాలని కిషన్ రెడ్డి సెక్రెటరీని ఆదేశించారని తెలిపారు. ఇక్కడ జరిగిన విపత్తుని దేశ విపత్తుగా తీసుకోవాలన్నారు. రాజకీయాలు ముఖ్యం కాదు, ప్రజలను కాపాడటమే ముఖ్యమని కేంద్రం చేయూతనిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. తెలంగాణ అంటే గతంలో మాదిరి ధనిక రాష్ట్రం కాదని ప్రధాన మంత్రికి ఈ విషయాన్ని తెలియజేశామని గుర్తు చేశారు. విపత్తు మొదలైన రోజే ప్రధాన మంత్రి మోదీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఫోన్ చేసి అండగా ఉంటామని చెప్పారన్నారు. ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు ప్రధాన ప్రతిపక్షం శవాల మీద చిల్లర ఏరుకుంటోందని, ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో ప్రజలను ఆదుకోకుండా రాజకీయ లబ్ధి కోసం పాకులాడుతోందని మండిపడ్డారు పొంగులేటి.