Fire Accident: పశ్చిమ బెంగాల్లో ఓ రైల్వే స్టేషన్లో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఉదయం ఒక షాపులో మొదలైన మంటలు ఇతర దుకాణాలకూ వేగంగా వ్యాపించాయి. చాలా వరకు షాపులు దగ్దమయ్యాయి. ఈ మంటలను చూసి ప్లాట్ ఫామ్ పై ఉన్న ప్రయాణికులు పరుగు పెట్టారు. ఈ ఘటన దక్షిణ 24 పరగణాల జిల్లాలోని గుటియారి షరీఫ్ రైల్వే స్టేషన్లో ఆదివారం జరిగింది.
గుటియారి షరీఫ్ రైల్వే స్టేషన్లో ప్లాట్ ఫామ్ నెంబర్ 1 పైన ఉన్న ఓ షాపులో ఈ రోజు ఉదయం 10.30 గంటల ప్రాంతంలో మంటలు చెలరేగాయి. అవి వెంటనే ఇతర ప్లాట్ ఫామ్లపై గల దుకాణాలకు వ్యాపించాయి. అప్పుడు ట్రైన్ కోసం ప్లాట్ ఫామ్లపై ఎదురుచూస్తున్న ప్రయాణికులు భయంతో పరుగులు తీశారు. ఈ మంటల గురించి రైల్వే పోలీసులు, బ్రిగేడ్ సిబ్బందికి సమాచారం అందించారు. వారు వెంటనే రంగంలోకి దిగారు. మంటలను ఆర్పే పనిలో పడ్డారు.
రెండు అగ్నిమాపక యంత్రాలు స్పాట్కు వచ్చారు. మంటలను అదుపులోకి తెచ్చాయి. అయితే, ప్రయాణికుల భద్రతను దృష్టిలో పెట్టుకుని సియల్డా సౌత్ సెక్షన్ రైళ్ల సేవలు కొంత సేపు నిలిచిపోయాయి.