RTC Bus Fell into valley in AP: ఏపీలో పెను ప్రమాదం తప్పింది. ప్రయాణికులతో వెళ్తున్న బస్సు అదుపుతప్పి వాగులోకి దూసుకెళ్లింది. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 50 మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే.. ఏపీలోని తూర్పు గోదావరి జిల్లా బోరన్నగూడెంలో ఆర్టీసీ బస్సు రోడ్డు ప్రమాదానికి గురైంది. ప్రయాణికులతో వెళ్తున్న ఆర్టీసీ బస్సు అదుపు తప్పి కల్వర్టును ఢీకొట్టింది. అనంతరం ఆ బస్సు వాగువైపునకు దూసుకెళ్లింది. బస్సు పూర్తిగా ఒకవైపునకు చెట్ల మధ్య ఒరిగింది. ప్రమాద సమయంలో బస్సులో 50 మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తోంది. అందులో 20 మంది వరకు ప్రయాణికులకు తీవ్ర గాయాలైనట్లు తెలుస్తోంది. విషయం తెలుసుకున్న స్థానికులు, పలువురు అధికారులు అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. బస్సులో నుంచి ప్రయాణికులను బయకు తీశారు. అనంతరం క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి గురైన ఆర్టీసీ బస్సు రాజమండ్రి నుంచి నర్సీపట్నం వెళ్తున్నట్లు గుర్తించారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
Also Read: వెళ్లొద్దు అని మొత్తుకున్న వినకుండా.. వరదలో సాఫ్ట్వేర్ ఉద్యోగి గల్లంతు
మరో ప్రమాదంలో ముగ్గురు మృతి?
ఇదిలా ఉంటే.. ఏపీలో మరో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతిచెందినట్లు తెలుస్తోంది. కర్నూలు జిల్లా ఆలూరు మండలం హులేబీడు సమీపంలో జైలో వాహనం అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో అక్కడికక్కడే ముగ్గురు మృత్యువాతపడినట్లు సమాచారం. మరో ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానికులు స్థానిక ఆసుపత్రికి తరలించినట్లు తెలుస్తోంది. బళ్లారి నుంచి అదోనికి వెళ్తుండగా టైర్ పంచర్ కావడంతో ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం.