Huge Rains in Telangana including Hyderabad: గత కొద్ది రోజుల నుంచి తెలుగు రాష్ట్రాలను వర్షాలు వదలడంలేదు. ఇప్పటికే కురిసిన భారీ వర్షాలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పలు చోట్ల భారీగా వరదలు ముంచెత్తడంతో బాధితులు సర్వం కోల్పోయి ఇబ్బందిపడుతున్నారు. ఈ క్రమంలో ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు వారిని ఆదుకునే పనిలో నిమగ్నమయ్యాయి.
కాగా, ప్రస్తుతం నగరంలో పలు చోట్ల భారీగా వర్షం కురుస్తోంది. వరద నీరు రోడ్లపైకి వచ్చి చేరడంతో పలు ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. దీంతో వాహనదారులు ఇబ్బందిపడుతున్నారు. ఇటు లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయమయ్యాయి. రోడ్లు చెరువుల మాదిరిగా పొంగిపొర్లుతున్నాయి. దీంతో ప్రజలు బయటకు అడుగు పెట్టాలంటేనే వణుకుతున్నారు.
Also Read: మరోసారి డేంజర్ బెల్స్..అప్రమత్తమైన ప్రభుత్వం
పంజాగుట్ట, నాపంపల్లి, ఖైరతాబాద్, బోరబండ, మాదాపూర్, మెహిద్నీపట్నం, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, కొండాపూర్, బేగంపేటతోపాటు నగరంలోని పలు ప్రాంతాల్లో వర్షం దంచికొడుతున్నది. దీంతో వరద నీరు లోతట్టు ప్రాంతాల్లో భారీగా వచ్చి చేరుతున్నది. ఇటు రోడ్లపైకి వచ్చి చేరడంతో పలు చోట్ల భారీగా ట్రాఫిక్ జామ్ అవుతోంది. వాహనం అడుగు దూరం కదలాలంటేనే కనీసం పది నుంచి 20 నిమిషాలు పడుతుంది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. ఓ పక్క వర్షం.. మరోవైపు ట్రాఫిక్ జామ్ తో ఇబ్బందిపడుతున్నామని చెబుతున్నారు. గత కొద్ది రోజుల నుంచి వర్షాలు కురుస్తుండడంతో ఇప్పటికే అలర్ట్ అయిన సంబంధిత అధికారులు ఎప్పటికప్పుడు ప్రజలకు పలు సూచనలు చేస్తున్నారు. వర్షాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, అవసరమైతేనే తప్ప ఇంట్లోనుంచి బయటకు రావొద్దని సూచిస్తున్నారు.
ఇటు తెలంగాణలో పలు జిల్లాల్లో కూడా వర్షం కురుస్తున్నట్లు తెలుస్తోంది. పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నట్లు సమాచారం. కాగా, ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు నేడు, రేపు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొన్న విషయం తెలిసిందే.
Also Read: పదేళ్లు మంత్రిగా పనిచేసిన మీకు ‘ఇది కూడా తెల్వదా కేటీఆర్’..? : చామల
తాజాగా కూడా వాతావరణ శాఖ వర్షానికి సంబంధించి పలు సూచనలు చేసింది. కుమురం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి, ఖమ్మం, కొత్తగూడెం, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, సిద్ధిపేట, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాలో రేపు, ఎల్లుండి కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్ ను కూడా జారీ చేసింది. ఎల్లో అలర్ట్ ను జారీ చేసిన నేపథ్యంలో ప్రజలు, సంబంధిత అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. అదేవిధంగా సోమవారం కూడా కుమురం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాల్లోనూ భారీ వర్షాలు కురిసే అవకాశమున్నందున ప్రజలు పలు జాగ్రత్తలు తీసుకోవాలని పేర్కొన్నది.
ఇదిలా ఉంటే.. శనివారం కూడా తెలంగాణలో వర్షాలు కురిశాయి. మహబూబాబాద్ లో అత్యధికంగా వర్షపాతం నమోదైంది. 182.5 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదు అయ్యింది. ఖమ్మంలో 122 మిల్లీ మీటర్ల వర్షం పాతం నమోదు అయ్యింది.
Also Read: హైడ్రా గుడ్ న్యూస్.. చెరువులను ఆక్రమించి కట్టిన నివాసాలపై రంగనాథ్ కీలక నిర్ణయం
వాయుగుండం ప్రభావంతో ఇటు ఏపీలో కూడా రానున్న రెండు రోజులపాటు వర్షాలు పడే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ తెలిపింది. శ్రీకాకుళం, మన్యం, విజయనగరం జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. దీంతో ఆ జిల్లాలకు రెడ్ అలర్ట్ ను కూడా జారీ చేసింది. ఇటు విశాఖ, అల్లూరి, కాకినాడ, అనకాపల్లి, యానాంలకు ఆరెంజ్ అలర్ట్ ను జారీ చేసింది.
విజయనగరం, గోదావరి జిల్లాలు, విశాఖపట్నం జిల్లాల్లో ఎక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. తీరం వెంబడి గంటకు 50 నుంచి 70 కిలో మీటర్ల బలమైన గాలులు వీచే అవకాశం ఉన్నదని తెలిపింది. భీమిని పట్నం, కళింగపట్నం, గంగవరం, కాకినాడ పోర్టుల్లో మూడో నెంబర్ ప్రమాద హెచ్చరికను కూడా అధికారులు జారీ చేసినట్లు తెలుస్తోంది.