HYDRA Commissioner: గత కొద్ది రోజుల నుంచి నగరంలో హైడ్రా దూసుకుపోతున్నది. చెరువులు, కుంటలు, నాలాలను ఆక్రమించి ఇళ్లు, వాణిజ్య భవనాలు, నిర్మాణాలను చేపట్టిన వారిపై హైడ్రా పెద్ద ఎత్తున కొరడా ఝళిపిస్తున్నది. అక్రమ కట్టడాలను గుర్తించి వాటిని బుల్డోజర్లతో కూల్చివేస్తున్నది. పలు ప్రాంతాల్లో పేద ప్రజలు ఆందోళన చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అక్రమ కట్టడాల కూల్చివేతపై హైడ్రా కమిషనర్ రంగనాథ్ తాజాగా వివరణ ఇచ్చారు. ఎఫ్టీఎల్, బఫర్ జోన్ పరిధిలో గుర్తించిన కొత్త నిర్మాణాలను మాత్రమే కూలుస్తున్నామంటూ ఆయన పేర్కొన్నారు. ఎఫ్టీఎల్ లేదా బఫర్ జోన్ లో ఇప్పటికే ఎవరైనా ఇళ్లు నిర్మించి, అందులో నివాసం ఉంటే ఆ ఇళ్లను కూల్చబోమన్నారు. అదేవిధంగా ఒకవేళ ఆ నిర్మాణాలు ప్రస్తుతం నిర్మాణ దశలో ఉంటే మాత్రం ఖచ్చితంగా కూల్చివేస్తామన్నారు. మల్లంపేట చెరువులో కూల్చివేస్తున్న భవనాలు నిర్మాణదశలో ఉన్నాయని, అవి బఫర్ జోన్ లో అనుమతులు లేకుండా నిర్మిస్తున్నారన్నారు. సున్నం చెరువులో నిర్మించినటువంటి పలు షెడ్లు వాణిజ్యపరంగా వినియోగిస్తున్నారని కమిషనర్ స్పష్టం చేశారు. గతంలో కూడా వాటిని కూల్చేశారన్నారు. అందులో మళ్లీ ఇప్పుడు నిర్మాణాలు చేపట్టడంతోనే వాటిని ప్రస్తుతం కూల్చివేస్తున్నామని చెప్పారు.
Also Read: పదేళ్లు మంత్రిగా పనిచేసిన మీకు ‘ఇది కూడా తెల్వదా కేటీఆర్’..? : చామల
అదేవిధంగా ఓ బిల్డర్ పై క్రిమినల్ కేసులు నమోదు చేసినట్లు కమిషనర్ స్పష్టం చేశారు. ఇటు ఓ మాజీ ఎమ్మెల్యేపై కూడా క్రిమినల్ కేసులు నమోదు చేసినట్లు ఆయన పేర్కొన్నారు. ఆక్రమణలో ఉన్న ఏ ఇంటినీ కూడా కూల్చోబోమంటూ కమిషనర్ హామీ ఇచ్చారు. ఇటు ప్రజలకు కూడా ఈ సందర్భంగా ఓ సూచన చేశారు. ఎఫ్టీఎల్, బఫర్ జోన్ లో ఉన్నటువంటి స్థలాలను లేదా ఇళ్లను కొనుగోలు చేయొద్దన్నారు.