Top 5 Central Government educational schemes for children: భారత రాజ్యాంగం లింగ వివక్ష లేకుండా ప్రతి ఒక్కరికీ సమానత్వ హక్కులు కల్పించింది. కానీ ఇంకా భారతదేశంలోని పల్లెలలో లింగ వివక్ష కొనసాగుతోంది. కేంద్ర ప్రభుత్వం 2015లో బేటీ బచావో-బేటీ పడావో అంటూ పిలుపునిచ్చింది. మహిళ విద్యావంతురాలు అయతే ఆ కుటుంబం అంతా విద్యావంతులు అవుతారని నాటి ప్రధమ భారత ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ అన్నారు. అయితే స్వాతంత్ర్యం వచ్చినప్పటినుంచి బాలికా విద్య నిర్లక్ష్యానికి గురవుతూనే ఉంది. అయితే కేంద్ర ప్రభుత్వం బాలబాలికల విద్య కోసం ఓ ఐదు బృహత్కర పథకాలు ప్రవేశపెట్టింది. అవేమిటో తెలుసుకుందాం..
సర్వ శిక్షా అభియాన్
ఆరు నుంచి 14 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న బాలలందరికీ ఉచిత, నిర్బంధ విద్యను ప్రాధమిక హక్కుగా కేంద్రం కల్పించింది. మాజీ ప్రధాని వాజ్ పేయి ఆధ్వర్యంలో ప్రవేశ పెట్టిన ప్రతిష్టాత్మక కార్యక్రమం ఇది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ పథకాన్ని సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో కేంద్రం ఈ పథకాన్ని అందిస్తోంది. 2001-02 మధ్య ఈ పథకం ప్రవేశపెట్టబడింది. ప్రత్యేకంగా బాలికలు ఇంటికే పరిమితం కాకూడదని వారిని తప్పకుండా పాఠశాలలకు పంపించాలని తల్లిదండ్రులకు అవగాహన కల్పిస్తున్నారు. పుస్తకాలు, యూనిఫాం, ఉచిత భోజనం వంటి సదుపాయాలను కల్పిస్తోంది కేంద్రం.
బాలల ప్రాథమిక విద్య
ఒకటి నుంచి ఎనిమిది సంవత్సరాల మధ్య ఉన్న బాల బాలికల విద్య కోసం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకం ఇది. ఆర్థికంగా చదువుకునే సామర్థ్యం లేని పేద, మధ్య తరగతి వర్గాలకు చెందిన బాలబాలికల కోసం కేంద్రం ఈ పథకాన్ని ప్రవేశపెట్టింది. ఇప్పటికీ పల్లె ప్రాంతాలలో ఎనిమిది సంవత్సరాలలోపు పిల్లలను కూలి పనులకు పంపిస్తున్నారు.
మాధ్యమిక విద్య :
2030 నాటికి లింగ వివక్ష లేని విద్యను అందించడమే లక్ష్యంగా ఈ పథకాన్ని కేంద్రం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టింది. ఎనిమిది నుంచి 14 సంవత్సరాల బాలికల విద్య కోసం కేంద్రం బడ్జెట్ లో ప్రత్యేక కేటాయింపులు కూడా చేస్తోంది. పురుషులతో సమానమైన అవకాశాలను ఈ సమాజంలో అందుకోవడానికి వారిని ప్రాధమిక, మాధ్యమిక స్థాయి నుంచే పరిపూర్ణ విద్యావంతులను చేయడమే లక్ష్యంగా ఈ పథకాలను కేంద్రం ప్రవేశపెట్టడం గమనార్హం.
మధ్యాహ్న భోజన పథకం
1995 ఆగస్టు 15న ప్రవేశ పెట్టిన కేంద్ర ప్రభుత్వ పథకం. అన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పాఠశాలలలో చదివే విద్యార్థులకు బలవర్థకమైన పోషకాహారాన్ని ఈ పథకం ద్వారా అందిస్తారు. రోజుకు మూడు వందల కేలరీల ఆహారాన్ని ప్రభుత్వ పాఠశాలలలో విద్యార్థులకు అందిస్తున్నారు. ఒక్కపూట కూడా తిండి తినలేని పరిస్థితో దుర్భర జీవితాలు అనుభవిస్తున్న అనేక మంది గ్రామీణ ప్రాంతాలలోనే కాదు పట్టణాలలోనూ ఉన్నారు. అటువంటివారు తమ పిల్లలను వేలకు వేలు ఖర్చుపెట్టి ప్రైవేటు స్కూళ్లలో చేర్చలేక వారిని చదువుకోనీయకండా చేస్తున్నారు. అందుకే కేంద్ర ప్రభుత్వం ఉచిత నిర్బంద విద్యతో బాటు మధ్యాహ్న భోజన పథకం కూడా ప్రవేశపెట్టి పిల్లలకు పాలు, గుడ్డు వంటి పోషక ఆహారాన్ని అందిస్తోంది.
ప్రాథమిక విద్య హక్కు
మాధ్యమిక విద్య కోసం ప్రభుత్వ పాఠశాలలో చదివే ప్రతి ఆడపిల్లలకూ మూడు వేల రూపాయల చొప్పున కేంద్రం డిపాజిట్ చేస్తుంది. దానిని ఆమె టెన్త్ క్లాస్ పాసయ్యాక 18 సంవత్సరల వయసు వచ్చాక ఈ మూడు వేలపై వచ్చే వడ్డీ అసలుతో సహా డ్రా చేసుకోవచ్చు.