Kolkata doctor rape-murder case..nurse informed to cbi: దేశవ్యాప్తంగా పెను సంచలనం సృష్టించింది కోల్ కతా ట్రైనీ డాక్టర్ అత్యాచారం, హత్య కేసు. దీనికి సంబంధించి పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ పలు ఆరోపణలు ఎదుర్కుంటున్నారు ప్రతిపక్షాల నుంచి. మమత ఉదాసీనంగా వ్యవహరించడం వలనే కీలక నిందితులు బయటకు రావడం లేదని అవసరమైతే మమత ఫోన్ కాల్స్ రికార్డులు పరిశీలించాలని ఆ రాష్ట్ర ప్రతిపక్ష నేత సువేందు అధికారి ఆరోపించారు. ఉరిశిక్ష విధించాల్సిన రేపిస్టులను రక్షించే ప్రయత్నం జరుగుతోందని..ఇందుకు బాధ్యత వహిస్తూ మమత రాజీనామా చేయాలని విపక్ష నేతలు ఆందోళన చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సీబీఐ కీలక దర్యాప్తు చేపట్టిన విషయం తెలిసిందే. అయితే ఈ సంఘటనకు సంబంధించి ఇందులో ఓ జూనియర్ డాక్టర్ ప్రమేయం ఉందని సీబీఐ అధికారులు చెబుతున్నారు.
ఆ రాత్రి బాత్ రూమ్ లో స్నానం చేసిందెవరు?
ఆగస్టు 9న ట్రైనీ వైద్యురాలు హత్య జరిగిన రోజు కోల్ కతాలోని ఆర్ జీ కర్ ఆసుపత్రి కి చెందిన జూనియర్ వైద్యుడు అక్కడే ఆ రాత్రి స్నానం చేసినట్లు ఆ రోజు నైట్ డ్యూటీ నిర్వహిస్తున్న నర్సు సీబీఐ అధికారులకు వాంగ్మూలం ఇవ్వడంతో కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఆ రోజు రక్తపు మరకలతో ఓ జూనియర్ వైద్యుడు హడావిడిగా బాత్రూమ్ వైపు వెళ్లినట్లు నర్సు చెప్పింది. అయితే ఆ వైద్యుని ఆ ఆసుపత్రిలో గతంలో ఎప్పుడూ చూసి వుండలేదని అంటోంది నర్సు. అయితే ఆ రక్తపు మరకల గురించి జూనియర్ డాక్టర్ ని నర్సు అడగగా..సంబంధిత వార్డులోని బెడ్ నెంబర్ నాలుగులో ఉన్న పేషెంట్కు పీఆర్బీసీ ఇచ్చానని..అందుకు సంబంధించిన రక్తపు మరకలు పడ్డాయని..వాటిని శుభ్రం చేసుకోవడానికే తాను స్నానం చేస్తున్నానని చెప్పారని సీబీఐ అధికారులకు నర్సు వాంగ్మూలం ఇచ్చింది. రాత్రి 9 గంటల సమయంలో మల్టీ డ్రగ్ రెసిస్టెన్స్ వార్డులోకి ఓ జూనియర్ వైద్యుడు ప్రవేశించాడని..ఎందుకు ఫ్రిడ్జ్ డోర్ తెరిచి ఏవో వెతుకుతున్నారని..ఎందుకని అడిగితే పీఆర్ బీసీ కోసం వెతుకుతున్నానని చెప్పారని అంది నర్సు. సీబీఐ అధికారులు నర్సు ఇచ్చిన వాంగ్మూలం మేరకు దర్యాప్తు ముమ్మరం చేశారు. అసలు జూనియర్ డాక్టర్ వేషంలో వచ్చిన ఆ అజ్ణాత వ్యక్తి ఎవరు? అతని కోటుపై ఉన్న రక్తపు మరకలు హతురాలివేనా? లేక ఇంకెవరివైనా అనే విషయాలను కూలంకుషంగా దర్యాప్తు చేస్తున్నారు సీబీఐ అధికారులు.
దూకుడు పెంచిన సీబీఐ
ఆసుపత్రిలో ఇప్పటికే కొన్ని కీలక సాక్ష్యాలు తారుమారయ్యాయయి..మృతురాలి డెడ్ బాడీ సమీపంలో సెమినార్ హాల్ సమీపంలో ఉన్న బాత్ రూమ్ ని ఎవరో కూల్చివేశారని..సుప్రీం కోర్టుకు గతంలో సీబీఐ తెలిపింది. అయితే ఈ కేసుకు సంబంధించి ఆసుపత్రి పౌర వాలంటీర్ సంజయ్ రాయ్ ని సీబీఐ అధికారులు అరెస్టు చేశారు. అలాగే ఆసుపత్రి కి చెందిన మాజీ ప్రిన్సిపాల్ సందీప్ ఘోష్ కూడా అరెస్టయ్యారు. ఇప్పుడు నర్సు చెప్పినదానిని బట్టి ఎవరో అజ్ణాత వ్యక్తి జూనియర్ వైద్యుని గెటప్ తో ఆసుపత్రిలోకి ప్రవేశించాడని..అత్యాచారం, హత్య చేసి బాత్ రూమ్ లో రక్తపు మరకలు కడుక్కుని వెళ్లారనే అంశంపై విచారణ జరుగుతోంది. త్వరలోనే అతనిని కూడా పట్టుకుంటామని సీబీఐ అధికారులు చెబుతున్నారు.