Khammam: ఇప్పటికే ఉభయ రాష్ట్రాలు ఇంకా వరదల నుంచి కోలుకోనే లేదు, మరోసారి భారీ వర్షం కురుస్తుండటంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. తెలంగాణలో ముఖ్యంగా ఖమ్మంలో వర్షం దంచికొట్టింది. మున్నేరు వాగు ప్రళయరూపం దాల్చడంతో పలువురు మరణించారు. కొంతమందిని కాపాడే ప్రయత్నాలు తీవ్రంగా జరిగినా సరైన ఫలితాలు దక్కలేదు. ఏకంగా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కంటతడి పెట్టి ఓ ఘటనను మీడియాకు వివరించారు. హెలికాప్టర్ సహాయం తీసుకోరాని విధంగా వాతావరణం ఉన్నదని తెలిపారు. ఇప్పుడు ఖమ్మంలో మరోసారి భారీ వర్షం పడుతున్నది. సాయంత్రానికే ఇక్కడ 15 సెంటిమీటర్ల వర్షం పడింది. దీంతో మంత్రులు అలర్ట్ అయ్యారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి హుటాహుటిన ఖమ్మం బయల్దేరి వెళ్లారు.
ఖమ్మంలో మరోసారి భీకర వర్షం పడుతున్నది. శనివారం సాయంత్రం నుంచి కుండపోతగా కురుస్తున్నది. అప్పటికే ఇక్కడ 15 సెంటిమీటర్ల వర్షపాతం నమోదైనట్టు వాతావరణ శాఖ అధికారులు ప్రకటించారు. అంతేకాదు, మరోసారి మున్నేరు వాగు ఉగ్రరూపం దాల్చే ప్రమాదం ఉన్నదని అధికారులు హెచ్చరించారు. దీంతో భట్టి విక్రమార్క, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిలు ఖమ్మం బయల్దేరి వెళ్లారు. లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలను అప్రమత్తం చేయాలని అప్పటికే డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధికారులను ఆదేశించారు. వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించాలని చెప్పారు. వరద ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో జిల్లాలోని ఉన్నత స్థాయి అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. భారీగా కురుస్తున్నందున ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు ఉపముఖ్యమంత్రి భట్టి ఇది వరకే సూచించారు.
Also Read: HYDRA: మురళీ మోహన్ జయభేరి సంస్థకు నోటీసులు.. హైడ్రా దూకుడు కంటిన్యూ
భారీ వర్షాలు, వరదలతో అతలాకుతలమైన ఖమ్మం జిల్లాలో రాష్ట్ర రెవెన్యూ, విపత్తు నిర్వహణ శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఐదు రోజులపాటు పర్యటించారు. బాధితులను పరామర్శించారు. అవసరమైన సహాయక చర్యలను సమీక్షిస్తూ అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేస్తూ గడిపారు. శుక్రవారం సాయంత్రమే ఆయన తన ఐదు రోజుల పర్యటన ముగించుకుని హైదరాబాద్కు వచ్చారు. ఇంతలోనే శనివారం సాయంత్రం నుంచే మళ్లీ ఖమ్మంలో భారీ వర్షం కురవడం మొదలైంది. వరద ముప్పు, మున్నేరు వాగు మళ్లీ పొంగే ప్రమాదం ఉన్నదనే సంకేతాలను దృష్టిలో పెట్టుకుని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మళ్లీ.. శనివారం సాయంత్రం ఖమ్మం వెళ్లారు. జిల్లా కలెక్టర్, సీపీ సహా పాలేరు నియోజకవర్గంలోని ఆయా మండలాల అధికారులందరూ అందుబాటులో ఉండాలని మంత్రి పొంగులేటి ఇది వరకే ఆదేశించారు. అవసరమైతే అర్ధరాత్రి కూడా పరిస్థితులపై సమీక్ష ఉంటుందని, కాబట్టి, ఉద్యోగులందరూ అలర్ట్గా ఉండాలని చెప్పారు.
ఇది వరకే వరదలు ఖమ్మం జిల్లాను ముంచెత్తాయి. ముఖ్యంగా మున్నేరు వాగు ఉగ్రరూపం ప్రదర్శించింది. వరదల వల్ల ఎక్కువ నష్టం వాటిల్లింది. ఈ నేపథ్యంలోనే సీఎం రేవంత్ రెడ్డి.. మరికొందరు మంత్రులు కలిసి వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు. బాధితులను పరామర్శించారు.