Bigg Boss 8 Telugu Latest Updates: బిగ్ బాస్ రియాలిటీ షోలో వీక్ డే ఎపిసోడ్స్ అంతా ఒక ఎత్తు అయితే.. వీకెండ్ ఎపిసోడ్స్ అంతా ఒక ఎత్తు. నాగార్జున వచ్చి వారమంతా కంటెస్టెంట్స్ చేసిన తప్పులు, పడిన గొడవలు గురించి ఏం మాట్లాడతారా అని ప్రేక్షకుల్లో స్పెషల్ ఇంట్రెస్ట్ ఉంటుంది. అలా బిగ్ బాస్ సీజన్ 8లో మొదటి వీకెండ్ ఎపిసోడ్ ముగిసింది. చాలావరకు కంటెస్టెంట్స్ మధ్య సమస్యలను వారితోనే చెప్పించారు. నాగార్జున వాటి గురించి ఎక్కువగా మాట్లాడలేదు. హౌజ్మేట్స్ మధ్య ఉన్న మనస్పర్థలను వారే క్లియర్ చేసుకునే అవకాశం ఇచ్చారు. కానీ అందరిలో నలుగురు హౌజ్మేట్స్ను మాత్రం ఆయన ఫెయిల్ చేసి వారి నుండి బెటర్ పర్ఫార్మెన్స్ రావాలని తెలిపారు.
లీడర్ అవ్వాలి
ముందుగా ప్రేరణను ఆయన ఫెయిల్ చేశారు. ప్రేరణ బిగ్ బాస్ స్టేజ్పై ఎంటర్ అవ్వగానే తన అల్లరి, తన మాటలు చూసి బిగ్ బాస్ హౌజ్లో యాక్టివ్గా ఉంటుందని భావించానని కానీ అలా జరగడం లేదని నాగార్జున తెలిపారు. హౌజ్లో మరింత యాక్టివ్గా ఉంటేనే ముందుకు వెళ్తుందని అన్నారు. ఆ తర్వాత బేబక్కను కూడా ఫెయిల్గానే పరిగణించారు నాగ్. బిగ్ బాస్ హౌజ్లోకి ఎంటర్ అయినప్పటి నుండి బేబక్క కిచెన్లోనే ఎక్కువగా ఉంటుంది. పైగా కిచెన్లో ఉంటూ ఫుడ్ సమయానికి అందించడం లేదని తనపై ఇతర హౌజ్మేట్స్ ఫిర్యాదు కూడా చేస్తున్నారు. అందుకే కిచెన్ నుండి బయటికి వచ్చి గేమ్లో తానేంటో చూపించమని, తనలో మంచి లీడర్ ఉందని నాగ్ మోటివేట్ చేశారు. ఇప్పటినుండి తనలోని లీడర్ను చూపిస్తానని బేబక్క కూడా మాటిచ్చింది.
Also Read: సోనియా ముద్దు, యష్మీ వద్దు.. ఆ అమ్మాయిని కొట్టి హౌజ్లో నుండి వెళ్లిపోవాలనుంది అంటున్న నిఖిల్
సెన్సిటివ్గా ఆలోచించాలి
ఒకప్పుడు హీరోగా పలు యూత్ఫుల్ చిత్రాలతో ఆకట్టుకున్న ఆదిత్య ఓం.. ఇన్నాళ్ల తర్వాత బిగ్ బాస్ హౌజ్లో కంటెస్టెంట్గా ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. హౌజ్లోకి ఎంటర్ అయినప్పటి నుండి ఒక్కరితో కూడా గొడవపడకుండా, అందరితో కలిసిపోయిన ఒకేఒక్క కంటెస్టెంట్ ఆదిత్య. ఇంటిపనుల్లో అందరికీ సాయంగా ఉన్నా కూడా తన అభిప్రాయాన్ని గట్టిగా చెప్పకపోవడం లాంటివి తనకు మైనస్గా మారాయి. అందుకే తను హౌజ్లో ఎక్కువగా కనిపించడం లేదని, కనిపిస్తే బాగుంటుందని నాగార్జున సలహా ఇచ్చారు. విష్ణుప్రియాను కూడా నాగ్ ఫెయిల్ చేశారు. సోనియాతో జరిగిన గొడవలో విష్ణుప్రియాపై ప్రేక్షకుల్లో నెగిటివ్ అభిప్రాయం ఉందని నాగ్ ఇన్డైరెక్ట్గా చెప్పారు. ఎప్పుడూ స్ట్రాంగ్గా ఉన్నట్టు కాకుండా అప్పుడప్పుడు సెన్సిటివ్గా ఆలోచించమని సలహా ఇచ్చారు.
తను సేఫ్
బిగ్ బాస్ సీజన్ 8 మొదటి వారంలో ఆరుగురు కంటెస్టెంట్స్ నామినేట్ అయ్యారు. శేఖర్ భాషా, బేబక్క, పృథ్విరాజ్, నాగ మణికంఠ, విష్ణుప్రియా, సోనియా నామినేషన్స్లో ఉన్నారు. ఈ ఆరుగురిలో ఒక కంటెస్టెంట్ను తాజాగా ప్రసారమయిన ఎపిసోడ్లో సేవ్ చేశారు నాగార్జున. అందరిలో ముందుగా సోనియా సేవ్ అయ్యిందని నాగ్ ప్రకటించారు. చాలా విషయాల్లో సోనియాపై ప్రేక్షకుల్లో నెగిటివ్ అభిప్రాయం ఏర్పడింది. తనను తాను ఆడపులి అనుకోవడం, ఇతర కంటెస్టెంట్స్ను నెగిటివ్ చేయడం కోసం అభ్యంతరకర మాటలు మాట్లాడడం.. ఇవన్నీ చాలామంది ఆడియన్స్కు నచ్చడం లేదు. కానీ అలాంటి కంటెస్టెంట్ వల్ల బిగ్ బాస్ హౌజ్లో గొడవలు జరుగుతాయని, అందుకే తనను ఇప్పుడే బయటికి పంపించరని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.