Indian Army: 1999 మే నుంచి జులై మధ్య ఇండియా, పాకిస్తాన్ మధ్య యుద్ధం జరిగింది. ఇది లడాఖ్లోని కార్గిల్ జిల్లాలో జరిగింది. అందుకే దీన్ని కార్గిల్ వార్ లేదా.. కార్గిల్ ఘర్షణలు అంటారు. పాకిస్తాన్, భారత్ను అధికారంగా వేరే చేసే రేఖ లేదా సరిహద్దును లైన్ ఆఫ్ కంట్రోల్ అని పిలుస్తాం. పాకిస్తాన్ ఆర్మీ ఈ సరిహద్దును దాటుకుని దొంగచాటున భారత భూభాగంలో అడుగుపెట్టింది. భారీ యుద్ధానికి లేదా కుట్రకు ప్లాన్ వేసే ఆ ఆర్మీ మన దేశంలో అడుగుపెట్టిందని చెబుతారు. అయితే.. ఈ చొరబాటును భారత జవాన్లు వెంటనే గ్రహించి కౌంటర్ ఆపరేషన్ చేపడతారు. దీనికి ఆర్మీ ఒక సీక్రెట్ పేరు పెట్టుకుంది. అదే ఆపరేషన్ విజయ్. ఈ ఆపరేషన్ను భారత్ విజయవంతంగా చేపట్టింది. పాక్ ఆర్మీకి ముచ్చెమటలు పట్టించింది. భారత్ ఆర్మీ రంగంలోకి దిగడంతో పాకిస్తాన్ సైన్యం తోకముడుచుకుని వెనక్కి పరుగు లంకించుకుంది. ఇదంతా ఇప్పుడు ఎందుకు మాట్లాడుకోవడం అనే కదా మీ డౌటు. దీనికి ఒక కారణం ఉన్నది. తాజాగా పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ సంచలన ప్రకటన చేశాడు. అందుకే ఈ చర్చ.
కార్గిల్ యుద్ధం జరిగినప్పటి నుంచి అందులో తమ ప్రమేయం లేదని పాకిస్తాన్ బుకాయిస్తూ వచ్చింది. అప్పటి ఆర్మీ చీఫ్, ఇతర అధికారులు కూడా కార్గిల్ ఘర్షణల్లో పాకిస్తాన్ ఆర్మీ ప్రమేయం లేదని, అది కేవలం కశ్మీర్లోని ముజాహిదీన్ల లేదా ఫ్రీడం ఫైటర్ల పని అని చెప్పుకుంటూ వచ్చింది. కానీ, తొలిసారిగా పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ జనరల్ ఆసిం మునీర్ నిజం అంగీకరించాడు. కార్గిల్ యుద్ధంలో పాకిస్తాన్ ఆర్మీ ప్రమేయం ఉన్నదని ఓ ప్రసంగంలో వెల్లడించాడు.
పాకిస్తాన డిఫెన్స్ డే సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో ఆ దేశ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ మాట్లాడుతూ.. ఈ దేశం కోసం, ఇస్లాం కోసం వేలాది జవాన్లు తమ ప్రాణాలను త్యాగం చేశారని చెప్పారు. అది 1948 అయినా, 1965 అయినా, 1971 అయినా.. అది 1999లో జరిగిన కార్గిల్ యుద్ధమైనా.. మన సోల్జర్లు ప్రాణాలు పణంగా పెట్టి దేశం కోసం, ఇస్లాం కోసం పోరాడారు అని గొప్పలు పోయాడు. కార్గిల్ యుద్ధంలో పాకిస్తాన్ ఆర్మీ డైరెక్ట్ రోల్ లేదని ఇప్పటి వరకు ఆ దేశం అధికారికంగా తప్పించుకుంటూ వస్తున్నది. కానీ, తాజా ప్రకటన పాకిస్తాన్ వైఖరికి భిన్నంగా వెలువడింది.
BREAKING NEWS
• For the first time, the Pakistani Army has acknowledged its involvement in the Kargil War.
• General Asim Munir, the current Chief of the Pakistan Army, has confirmed the Army's direct role in the conflict with India.
• This marks a significant departure… pic.twitter.com/StvovmdFjI
— Bharat Spectrum (@BharatSpectrum) September 7, 2024
కార్గిల్ యుద్ధం జరిగినప్పుడు పాకిస్తాన్ ప్రధానిగా నవాజ్ షరీఫ్ ఉన్నాడు. ఆయన స్వయంగా ఈ మిలిటరీ ఆపరేషన్ను బహిరంగంగా విమర్శించాడు. నిజానికి ఈ మిలిటరీ ఆపరేషన్ గురించి నవాజ్ షరీఫ్కు కూడా తెలియదని పాకిస్తాన్ మాజీ ఆర్మీ ఆఫీసర్ షహీద్ అజిజ్ ఓసారి పేర్కొన్నాడు. కార్గిల్లో పాకిస్తాన్ ఆర్మీ ప్రమేయం ఉన్నదని ఆయన మిలిటరీ చీఫ్గా రిటైర్ అయ్యాక చెప్పాడు. అది కేవలం నలుగురికి తెలిసి మాత్రమే జరిగిందని, ఒకరు జనరల్ పర్వేజ్ ముషార్రఫ్, మరికొందరు టాప్ కమాండర్లకు మాత్రమే ఈ ఆపరేషన్ గురించి సమాచారం ఉన్నదని తెలిపాడు. అప్పటి భారత ప్రధాని అటల్ బిహారి వాజ్పేయీతో 1999 లాహోర్ డిక్లరేషన్ పై సంతకం పెట్టింది పాకిస్తాన్ ప్రధానిగా ఉన్న నవాజ్ షరీఫ్. ఉభయ దేశాల మధ్యనున్న ఒప్పందాలను పాకిస్తాన్ ఉల్లంఘించిందనూ బహిరంగంగా అంగీకరించాడు.
Also Read: HYDRA: మురళీ మోహన్ జయభేరి సంస్థకు నోటీసులు.. హైడ్రా దూకుడు కంటిన్యూ
భారత్ స్వాతంత్ర్యం పొందినప్పటి నుంచీ లడాఖ్, కార్గిల్లో ఎప్పుడూ ఉద్రిక్తతలు ఉంటూనే ఉండేవి. ఈ ప్రాంతాల్లోనే పాకిస్తాన్తో యుద్ధాలు జరిగాయి. 1999లో దుర్బేధ్యమైన ఈ ప్రాంతంలో కార్గిల్ యుద్ధం జరిగింది. ఎత్తైన శిఖరాలు, సున్నాకు తక్కువగా ఉండే ఉష్ణోగ్రతలతో ఈ ప్రాంతం కఠినమైన వాతావరణ పరిస్థితులను కలిగి ఉంటుంది. ఈ ఏరియా గుండానే పాకిస్తాన్ ఆర్మీ ఎల్వోసీ దాటి మన దేశ భూభాగంలోకి చొరబడింది. గుర్తు తెలియని వ్యక్తులు ఆ ఏరియాలో తచ్చాడటాన్ని తొలుత స్థానికులే పసిగట్టారు. వారి నుంచి సమాచారం అందుకున్న ఇండియన్ ఆర్మీ వెంటనే పెట్రోలింగ్ మొదలుపెట్టింది. అది పాకిస్తాన్ పన్నిన పన్నాగమని గుర్తించడానికి భారత ఆర్మీకి ఎక్కువ సమయమేమీ పట్టలేదు. అయితే.. యుద్ధానికి దారితీసేలా వ్యవహరించకుండా భారత ఆర్మీ ఒక రూల్ పెట్టుకుంది. ‘మన ఆర్మీ ఎల్వోసీ దాటకూడదు. కానీ, వారిని తరిమికొట్టాలి’ ఇదీ నిబంధన. 1999 మే 26న భారత ఆర్మీ ఆపరేషన్ విజయ్ ప్రారంభించింది. ఇండియన్ ఆర్మీ, ఎయిర్ఫోర్స్ సంయుక్తంగా ఈ ఆపరేషన్ చేపట్టి.. గగనతలదాడులతో విరుచుకుపడింది. ఈ దాడులతో ఎత్తైన శిఖరాలు, కొండ శ్రేణుల మధ్య నుంచి పాకిస్తాన్ ఆర్మీని వెనక్కి పంపించగలిగింది. ఈ యుద్ధంలో భారత్ వైపున 527 మంది జవాన్లు మరణించగా(అధికారికంగా), పాకిస్తాన్ వైపున 1600 మంది(ముషారఫ్ ప్రకారం) మరణించారు.