– దీప్తి జీవాంజీని అభినందించిన సీఎం రేవంత్
– గ్రూప్ 2 ఉద్యోగం, కోటి నగదు బహుమతి
– వరంగల్లో 500 గజాల స్థలం
– కోచ్కు రూ.10 లక్షలు
– అధికారులకు ఆదేశాలు
CM Revanth Reddy: పారాలింపిక్స్లో కాంస్య పతకం సాధించిన తెలంగాణ యువ అథ్లెట్ దీప్తి జీవాంజీని అభినందించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. దీప్తికి గ్రూప్ 2 ఉద్యోగం, కోటి రూపాయల బహుమతి, వరంగల్లో 500 గజాల స్థలం, కోచ్కు 10 లక్షల రూపాయలు ఇచ్చేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. పారాలింపిక్స్లో పాల్గొనే అథ్లెట్లకు కోచింగ్, ఇతర ప్రోత్సాహం అందించే ఏర్పాట్లు చేయాలని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు దీప్తి కుటుంబసభ్యులు. శాట్ చైర్మన్ శివసేనా రెడ్డి, ఎంపీ బలరాం నాయక్, ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు.
పారాలింపిక్స్లో అదరగొట్టిన దీప్తి
పారిస్లో జరిగిన పారాలింపిక్స్ 2024లో మహిళల 400 మీటర్ల టీ20 ఈవెంట్లో తెలంగాణ అథ్లెట్ దీప్తి కాంస్య పతకం సాధించింది. తొలి పారాలింపిక్స్లోనే 55.82 సెకన్లలో రేసును ముగించి కాంస్యం సాధించటం పట్ల తెలంగాణ వ్యాప్తంగా ఆమెకు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. ఆ సమయంలోనే సీఎం రేవంత్ రెడ్డి ట్వీట్ చేస్తూ, ‘‘పారాలింపిక్స్ మహిళల 400 మీటర్ల టీ20 రేసులో దీప్తి కాంస్య పతకాన్ని గెలుచుకున్నారు. ప్రతిభకు వైకల్యం అడ్డురాదని నిరూపిస్తూ విశ్వ క్రీడా వేదికపై విజేతగా నిలిచిన దీప్తి మనందరికీ గొప్ప స్ఫూర్తి’’ అని తెలిపారు. ఇప్పుడు దీప్తి హైదరాబాద్ చేరుకున్న నేపథ్యంలో ఆమెను పిలిచి అభినందించి సన్మానించారు రేవంత్.