జయభేరికి నోటీసులు
– నగరంలో హైడ్రా దూకుడు
– మరో నటుడి కట్టడాలపై ఫోకస్
– మురళీ మోహన్ జయభేరి సంస్థకు నోటీసులు
– రంగలాల్ కుంట ఆక్రమణల నేపథ్యంలో చర్యలు
– వెంటనే తొలగించాలని నోటీసుల్లో స్పష్టం
HYDRA Notices: చెరువులు, నాలాల ఆక్రమణలపై ఉక్కుపాదం మోపుతోంది హైడ్రా. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా కూల్చివేతలు కొనసాగుతున్నాయి. ముందుగా నోటీసులు పంపుతున్న అధికారులు, ఆక్రమణలను తొలగించకపోతే కూల్చివేతకు సిద్ధమౌతోంది. ఈ క్రమంలోనే సీనియర్ నటుడు మురళీమోహన్కు చెందిన జయభేరి సంస్థకు నోటీసులు అందాయి.
వాటిని తొలగించాల్సిందే!
గండిపేట చెరువుకు దగ్గరలోని ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో రంగలాల్ కుంట ఉంటుంది. ఇది ఒకప్పుడు పెద్దదిగా ఉండేది. ఏళ్లు గడిచే కొద్దీ కుచించుకుపోయింది. జయభేరి సంస్థ రంగలాల్ కుంట ఎఫ్టీఎల్, బఫర్ జోన్లో నిర్మాణాలు చేపట్టిందని గుర్తించిన అధికారులు, వాటిని తొలగించాలని నోటీసులు జారీ చేశారు. లేకపోతే, కూల్చివేతలు జరుగుతాయని హెచ్చరించారు.
భగీరథమ్మ చెరువు పరిశీలించిన రంగనాథ్
నగరంలోని చెరువులకు పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు వరుస పర్యటనలు చేస్తూ, అక్రమ నిర్మాణాలు ఉంటే కూల్చివేతలు కొనసాగిస్తున్నారు హైడ్రా కమిషనర్ రంగనాథ్. ఈ క్రమంలోనే భగీరథమ్మ చెరువును పరిశీలించారు. ఎఫ్టీఎల్, బఫర్ జోన్ పరిధిలో నిర్మాణ వ్యర్ధాలను వేయడం గుర్తించారు. దీనిపై పూర్తిస్థాయి విచారణకు ఆదేశించారు రంగనాథ్. 15 రోజుల్లో సమావేశాన్ని నిర్వహిస్తామని, అప్పటిలోగా రిపోర్ట్ రెడీ చేయాలని అధికారులకు స్పష్టం చేశారు.
ఎన్ కన్వెన్షన్ మాదిరి కూల్చివేతలుంటాయా?
కొద్ది రోజుల క్రితం మాదాపూర్లో హీరో నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ను కూల్చివేశారు హైడ్రా అధికారులు. అదంతా అక్రమ కట్టడమని, చెరువు బఫర్ జోన్, ఎఫ్టీఎల్ పరిధిలో నిర్మాణం జరిగిందని నేలమట్టం చేశారు. ఇప్పుడు మరో నటుడు మురళీ మోహన్కు చెందిన జయభేరి సంస్థ రంగలాల్ చెరువు పరిధిలో నిర్మాణాలు చేపట్టినట్టు గుర్తించిన అధికారులు ఎన్ కన్వెన్షన్ మాదిరి కూల్చివేస్తారా? అనే చర్చ జరుగుతోంది.