Maharashtra Minister Comments: రాష్ట్రంలో ఆయనకు మంచి గుర్తింపు. ఆ గుర్తింపుతోనే ఆయన ఎమ్మెల్యేగా కూడా గెలిచారు. మంత్రి కూడా అయ్యారు. అయితే, ఈ మంత్రి పలు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తన కుమార్తె – అల్లుడిని నదిలో తోసేయాలన్నారు. మంత్రి వ్యాఖ్యలపై దేశవ్యాప్తంగా చర్చ నడుస్తోంది. ఒక రాష్ట్రానికి మంత్రి అయ్యుండి.. ఏంటి ఈ విధంగా మాట్లాడారు.? ఆయన ఈ విధంగా ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది ? అని తెలుసుకునేందుకు సోషల్ మీడియాలో నెటిజన్స్ తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇందుకు సంబంధించి జాతీయ మీడియాలో వచ్చిన కథనాల ప్రకారం వివరాల్లోకి వెళితే..
Also Read: ఆ విషయంలో.. పాక్తో చర్చలు జరిపే ఆలోచనే లేదు: అమిత్ షా
మహారాష్ట్ర మంత్రి, సీనియర్ ఎన్సీపీ నేత ధర్మారావ్ బాబా ఆత్రామ్ ప్రస్తుతం అహేరీ అసెంబ్లీ నియోజకవర్గానికి ప్రాతినిథ్యం వహిస్తున్నారు. తన నియోజకవర్గ ప్రజలతో మాట్లాడుతూ ఆయన పలు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మంత్రి కుమార్తె భాగ్యశ్రీ, అల్లుడు రితురాజ్ హాల్గేకర్.. శరద్ పవార్ వర్గం ఎన్సీపీలో చేరొచ్చంటూ వస్తున్న వార్తలపై ఆయన స్పందించారు. ‘పార్టీని వీడి కొందరు వెళ్తుంటారు. వారిని మీరు ఏ మాత్రం పట్టించుకోవాల్సిన అవసరంలేదు. నా రాజకీయ పలుకుబడిని ఉపయోగించుకుని మా కుటుంబంలో కొంతమంది మరో పార్టీలోకి వెళ్లాలని అనుకుంటున్నారు. శరద్ పవార్ గ్రూప్ నాయకులు నా ఇల్లును ముక్కలు చేసి, ఏకంగా నాపై నా కుమార్తెను పోటీకి నిలబెట్టాలని చూస్తున్నారు. నా కుమార్తె, అల్లుడిని ఎట్టి పరిస్థితుల్లో నమ్మకండి. వారు నన్ను వదిలేశారు. వారిని ప్రాణహిత నదిలో తోసేయండి. ఒక తండ్రికి కుమార్తెగా ఉండలేకపోయిన కూతురు.. మీ వ్యక్తి ఎలా అవుతుంది..? మీ సమస్యలు ఎలా తీరుస్తుంది..? ఆమె మీకు ఎలాంటి న్యాయం చేస్తుంది..? మీరు ఈ విషయం గురించి ఆలోచించాలి’ అంటూ మంత్రి పేర్కొన్నారు. కాగా, సదరు మంత్రి ఈ వ్యాఖ్యలు చేసినప్పుడు అతని పక్కనే ఎన్సీపీ చీఫ్ అజిత్ పవార్ కూడా ఉన్నారు.
Also Read: యూపీలో తోడేళ్ల విధ్వంసం.. 8 మంది మృతి.. మంత్రి వింత వాదన!
ఇదిలా ఉంటే.. ఎన్సీపీ నుంచి చీలిపోయి మెజార్టీ ఎమ్మెల్యేలతో కలిసి బీజేపీ – షిండే సర్కారుకు మద్దతు పలికిన అజిత్ పవార్ డిప్యూటీ సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన విషయం తెలిసిందే. ఆయన వర్గానికి చెందిన పలువురు మంత్రులయ్యారు. ఈ క్రమంలో ఎన్సీపీలో చీలిక ఏర్పడింది. అజిత్ పవార్ వర్గాన్ని అసలైన ఎన్సీపీగా ఎన్నికల సంఘం(ఈసీ) గుర్తించింది. దీంతో శరద్ పవార్ నేతృత్వంలోని వర్గాన్ని ఎన్సీపీ(ఎస్పీ)గా పిలుస్తున్నారు. మహారాష్ట్రలో త్వరలోనే ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో అక్కడ రాజకీయ వాతావరణం రోజురోజుకు వేడెక్కుతోంది. ఇదే మంత్రి వ్యాఖ్యలకు కారణమై ఉంటుందని చెబుతున్నారు.