Khairtabad Ganesh: ఖైరతాబాద్ భారీ వినాయకుడిని రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ శర్మ దర్శించుకున్నారు. అనంతరం ఆయన గణేషుడికి ఆయన ప్రత్యేక పూజలు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి కూడా ఈ వినాయకుడి తొలిపూజలో పాల్గొన్నారు.
Also Read: బడా గణపయ్యకు సీఎం రేవంత్ తొలి పూజ
కాగా, ఖైరతాబాద్ వినాయకుడిని చూసేందుకు భక్తులు భారీ సంఖ్యలో తరలివస్తున్నారు. దీంతో ఉత్సవ కమిటీ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. వర్షంలో భక్తులు తడవకుండా ప్రత్యేకంగా షెడ్లను కూడా నిర్వాహకులు ఏర్పాటు చేశారు. గతేడాది బడా గణేషుడిని దాదాపు 22 లక్షల మంది భక్తులు దర్శించుకోగా, ఈ ఏడాది 39 లక్షలకు పైగా మంది భక్తులు దర్శించుకునే అవకాశముందని ఉత్సవ కమిటీ భావిస్తున్నది. ఈ క్రమంలో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. ట్రాఫిక్ ఇబ్బంది కలగకుండా ఖైరతాబాద్ వైపు వచ్చే వాహనాలను ఇతర మార్గాలవైపు దారి మళ్లించారు.
Also Read: తెలంగాణలో ఐదుగురు ఐపీఎస్ల బదిలీ.. హైదరాబాద్ సీపీగా సీవీ ఆనంద్
ఇదిలా ఉంటే.. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఈ మహా గణపతి వెరి వెరీ స్పెషల్. ప్రతిసంవత్సరం కొత్త ఆకారంలో ఈ ఖైరతాబాద్ వినాయకుడు భక్తులకు దర్శనమిస్తుంటాడు. ఈసారి సప్తముఖ మహాశక్తి గణపతిగా ఖైరతాబాద్ గణేషుడు భక్తులకు దర్శనమిస్తున్నాడు. ఖైరతాబాద్ గణేష్ ఉత్సవాలకు 70 ఏళ్లు పూర్తి కావడంతో 70 అడుగుల ఎత్తు, 28 అడుగుల వెడల్పైన మట్టి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. మొత్తం ఏడు ముఖాలు, ఏడు సర్పాలు, 24 చేతులతో వినాయకుడి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఈ భారీ వినాయకుడి పాదాల చెంత ప్రత్యేక ఆకర్షణగా అయోధ్య బాలరాముడి విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేశారు. అదేవిధంగా ఖైరతాబాద్ మహాగణపతికి ఇరువైపులా శ్రీనివాస కళ్యాణం, శివపార్వతుల కళ్యాణం ప్రతిమలు సైతం ఉన్నాయి. కాగా, ఈసారి ఖైరతాబాద్ విగ్రహ తయారీలో 190 మంది కళాకారులు పాల్గొన్నారు.