Huge Rains in Vijayawada: ఎడతెరిపి లేని భారీ వర్షాల కారణంగా బుడమేరు ముంచెత్తి ఇప్పటికే అతలాకుతలమైన విజయవాడను వర్షం వదలడంలేదు. సర్వం కోల్పోయి బాధపడుతున్న వరద బాధితులకు ప్రభుత్వం నిత్యావసర వస్తువులను సరఫరా చేస్తుంది. ఇటు సహాయక చర్యలను సైతం ముమ్మరం చేసింది. ఈ క్రమంలో మరోసారి విజయవాడలో భారీగా వర్షం కురుస్తోంది. దీంతో సహాయ కార్యక్రమాలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతుంది. ఇప్పటికే ముంపు ప్రాంతాల్లో బురదను తొలగించే పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. వరద బాధిత కుటుంబాలకు ప్రభుత్వం నిత్యావసర సరకులను సరఫరా చేస్తోంది. వర్షం భారీగా కురుస్తుండడంతో మునుపటి మాదిరిగా ఈ వర్షాల వల్ల ఎటువంటి నష్టం వాటిల్లకుండా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోంది. సంబంధిత అధికారులను ఎప్పటికప్పుడు అలర్ట్ చేస్తుంది.
Also Read: మీడియా ముందు నీతి కబుర్లు చెప్పి.. చాటుగా బిల్లులు పెడుతున్నావా పవన్ కళ్యాణ్
కాగా, బుడమేరు గండ్లను ప్రభుత్వం పూర్తిగా పూడ్చివేసింది. ఇప్పటికే రెండు గండ్లు పూడ్చివేసిన జలవనరుల శాఖ అధికారులు తాజాగా శనివారం మూడో గండిని కూడా పూడ్చివేశారు. దీంతో దిగువ ప్రాంతాలకు బుడమేరు ప్రవాహం ఆగిపోయింది. అంతకుముందు మంత్రి నారా లోకేశ్ అక్కడికి చేరుకుని గండి పూడ్చివేత పనులను పర్యవేక్షించారు. సంబంధిత మంత్రి నిమ్మల రామానాయుడు పర్యవేక్షణలు ఈ పనులు కొనసాగుతున్నాయి.
ఇదిలా ఉంటే.. వాతావరణ శాఖ అధికారులు తాజాగా కీలక సూచన చేశారు. రానున్న మూడు రోజులూ ఏపీలో వర్షాలు కురవనున్నాయని తెలిపారు. మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం నేడు తీవ్ర అల్పపీడనంగా బలపడింది. ఈ అల్పపీడనం ఉత్తర దిశగా కదులుతూ ఒడిశా, పశ్చిమ బంగ్లాదేశ్ తీరాల్లో సోమవారం నాటికి వాయుగుండంగా మారనున్నది. ఆ తరువాత మూడు రోజుల్లో పశ్చిమ వాయవ్య దిశగా కదులుతూ ఝార్ఖండ్, ఉత్తర ఒడిశా, ఉత్తర ఛత్తీస్ గఢ్ మీదుగా ప్రయాణించే అవకాశమున్నదని, దీని ప్రభావంతో నేడు ఉత్తర కోస్తాలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. రేపు, ఎల్లుండి కోస్తా జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వారు అంచనా వేశారు. రాయలసీమలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ భావిస్తున్నది.
Also Read: బుడమేరు గండి పూడ్చివేత పూర్తి .. పరిశీలించిన మంత్రి నారా లోకేశ్..
అల్లూరి సీతారామరాజు, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, ఎన్టీఆర్ జిల్లాల్లోని పలు చోట్ల నేడు భారీ వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపారు. ఏలూరు, అల్లూరి సీతారామరాజు, గోదావరి జిల్లాలు, ఎన్టీఆర్ జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. అదేవిధంగా కాకినాడ, అనకాపల్లి, కోనసీమ, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, పార్వతీపురం, మన్యం, కృష్ణా జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని, పలు చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపారు. ఇటు గుంటూరు, పల్నాడు, బాపట్ల జిల్లాల్లోనూ భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. వర్షాల నేపథ్యంలో ఇటు సంబంధిత అధికారులు, ఇటు ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ వాతావరణ శాఖ సూచిస్తున్నది.