Budameru Floods| గత కొన్ని రోజులుగా భారీ వర్షాలకు బుడమేరు వాగు వరద ప్రభావంతో విజయవాడ భారీ ప్రాణ నష్టం, ఆస్తి నష్టం సంభవించింది. అయితే బుడమేరు వాగు గండిని పూడ్చివేసేందుకు ప్రభుత్వం యుద్ధప్రతిపాదికన పనులు ప్రారంభించి.. విజయవంతంగా మూడు గండ్లను పూడ్చివేసింది. మూడో గండిని శనివారం పూడ్చివేయడంతో పనులు పూర్తయ్యాయి. పూడ్చివేత పనులు జరగడంతో దిగువ ప్రాంతాలకు వరద ప్రవాహం పూర్తిగా ఆగిపోయినట్లు అధికారులు తెలిపారు.
బుడమేరుకు పడ్డ గండ్లను పూడ్చే పనులను మంత్రి నిమ్మల రామానాయుడు పర్యవేక్షణలో జరిగాయి. పనులు పూర్తి చేసినట్లుగా మంత్రి నారా లోకేశ్ పరిశీలించి వెల్లడించారు. ఇటీవల ఒక్కసారిగా కురిసిన భారీ వర్షాలకు 60వేల క్యూసెక్కుల వరద నీరు రావడంతో బుడమేరు డైవర్షన్ చానెల్కు గండ్లు పడ్డాయి. అయితే ఈ గండ్ల పూడ్చి వేత పనుల్లో ఆర్మీ జవాన్లు కూడా పాల్పంచుకున్నారు. సికింద్రాబాద్కు చెందిన రెజిమెంటల్ బెటాలియన్, చెన్నైకు చెందిన 6వ బెటాలియన్ జవాన్లు మొత్తం 120 మంది కలిసి మూడో గండి పూడ్చివేత పనులు చేశారు.
బుడమేరు గండ్లు.. ఇబ్రహీంపట్నం సమీపంలో కవూలూరు వద్ద బీడీసీకి ఎడమవైపు కట్టకు పడ్డాయి. అయితే ఇందులో మూడో గండి చాలా పెద్దది. దాదాపు 100 మీటర్ల పొడవు ఉండడంతో మట్టితో నింపినా నీటి ప్రవాహం ఆగలేదు. పరిస్థితి సీరియస్ కవాడంతో మేఘా ఇంజినీరింగ్, వెంకటేశ్వర కన్స్ట్రక్షన్స్ కలిసి కొండపల్లి క్వారీల నుంచి గ్రావెల్, రాళ్లు తెచ్చి గండి పూడ్చివేత పనులు ప్రారంభించారు. కానీ పూడ్చివేత సమయంలో మధ్యలో శుక్రవారం కూడా వర్షం పడడంతో పనులకు అంతరాయం కలిగింది. పైగా బీడీసీలో 15 వేల క్యూసెక్కుల వరద నీరు ప్రవహిస్తూ ఉండడం మరో సవాల్ గా మారింది. అందుకే మట్టి నింపినా ఉపయోగం లేకపోవడంతో రాళ్లు పోసి ఆ తరువాత మట్టితో నింపారు. గండ్లను పటిష్టం చేసేందుకు కంకర పోసి ఆ తరువాత గ్రావెల్ తో కూడా నింపారు.
Also Read: కాల్ గర్ల్ తల నరికి యువతి సోదరుడి ఇంట్లో పెట్టిన ప్రియుడు.. ఎందుకు చేశాడంటే..
గండ్లు పూడ్చివేత పనులు పూర్తి కావడంతో విజయవాడకు వరద సమస్య నుంచి ఉపశమనం లభించింది. విజయవంతంగా గండ్ల పూడ్చి వేత పనులు పూర్తి చేయడంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులు, మంత్రులను అభినందించారు.