Amit Shah: భారత్- పాక్ సరిహద్దు వెంబడి శాంతి నెలకొనే వరకు ఆ దేశంతో చర్చలు జరపబోమని కేంద్ర మంత్రి అమిత్ షా వెల్లడించారు. జమ్మూలో శనివారం జరిగిన ఓ సమావేశంలో పాల్లొన్న అమిత్ షా పాకిస్తాన్ను ఉద్దేశించి మాట్లాడారు. జమ్మూ కశ్మీర్కు త్వరలో రాష్ట్ర హోదా కల్పిస్తామని అన్నారు. నేషనల్ కాన్ఫరెన్స్ – కాంగ్రెస్ కూటమి వేర్పాటు వాదులను, ఉగ్రవాదులను విడుదల చేయాలని అనుకుంటోందని తెలిపారు.
జమ్మూ కశ్మీర్ను అస్థిరతకు గురిచేయాలని కాంగ్రెస్ చూస్తున్నట్లు ఆరోపించారు. చాలా ఏళ్ల తర్వాత కశ్మీర్ లోయలో అమర్ నాథ్ యాత్ర విజయవంతం అయిందని తెలిపారు. ఎన్సీ కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఉగ్రవాదులు రెచ్చిపోతారని అన్నారు. ఉగ్రవాదం కావాలో.. లేక శాంతి కావాలో ప్రజలే తేల్చుకోవాలని సూచించారు. అసెంబ్లీ ఎన్నికల తర్వాత జమ్మూ కాశ్మీర్కు రాష్ట్ర హోదాను పునరుద్ధరిస్తామని అమిత్ షా స్పష్టం చేశారు. కేంద్రంలోని మోదీ సర్కార్ ఆర్టికల్ 370 రద్దు చేసిన తర్వాత దేశ జాతీయ జెండా, రాజ్యాంగం కింద జమ్మూలో మొదటిసారి ఎన్నికల జరుగుతున్నాయని అన్నారు. కాంగ్రెస్ నేషనల్ కాన్ఫరెన్స్ కూటమి కాశ్మీర్లో ఉగ్రవాదాన్ని పునరుద్ధరించేందుకు ప్రయత్నం చేస్తుందని ఆరోపించారు.
బీజేపీ ఉగ్రవాదాన్ని పునరుద్ధరణను అనుమతించదని అన్నారు. తమ ప్రభుత్వం కల్పించిన రిజర్వేషన్లతో గుజ్జర్లు, దళితులతో సహా ఏ వర్గానికి అన్యాయం జరగదని తెలిపారు. జమ్మూ కాశ్మీర్లో రాబోయే ఎన్నికలు చారిత్రాత్మకమైనవిగా పేర్కొన్నారు. స్వాతంత్రం వచ్చిన తర్వాత మొదటిసారి భారత జాతీయ జెండా, రాజ్యాంగం కింద ఎన్నికల జరుగుతున్నాయని స్పష్టం చేశారు.
Also Read: 5600 మంది ఖైదీలకు ఒక డాక్టర్.. జైళ్లలో నేరస్తుల ఆరోగ్యంపై నిర్లక్ష్యమా?..
గతంలో రెండు జెండాలు రెండు రాజ్యాంగాల ఆధారంగా ఎన్నికలు జరిగాయని గుర్తు చేశారు. ప్రస్తుతం కశ్మీర్ నుంచి కన్యా కుమారి వరకు ఒకరే ప్రధాని ఆయనే నరేంద్ర మోడీ అని అమిత్ షా వ్యాఖ్యానించారు. కశ్మీర్లో ఎన్డీఏ సర్కార్ 70% ఉగ్రవాద కదలికలను తగ్గించిందని, ఉగ్రవాదుల ఊబిలోకి మరోసారి నెట్టడానికి కాంగ్రెస్ ప్రయత్నిస్తోందని అన్నారు. కాంగ్రెస్ ఎప్పటికీ జమ్మూలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయదని ఎద్దేవా చేశారు. అందుకు బీజేపీ అభ్యర్థుల విజయానికి కృషి చేయాలని పార్టీ కార్యకర్తలు సూచించారు.