YCP Leaders Target on Pawan Kalyan in Social Media: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ని వైసీపీ టార్గెట్ చేసింది. మీడియా ముందు నీతి కబుర్లు చెప్పి.. చాటుగా బిల్లులు పెడుతున్నారా అంటూ పవన్ ను విమర్శిస్తూ సోషల్ మీడియా వేదికగా ట్వీట్ చేసింది. పవన్ గెస్ట్ హౌస్, క్యాంప్ ఆఫీసుకి 82 లక్షల 14 వేలు ఖర్చు చేయబోతున్న కూటమి ప్రభుత్వం అని ఎక్స్ లో పోస్ట్ చేసింది. దీంతో ఈ వ్యవహారం ఏపీ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది.
విజయవాడలోని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ క్యాంపు కార్యాలయంలో ఈ ఏడాది జూలై 1 నుంచి వచ్చే ఏడాది మార్చి నెలాఖరు మధ్య పారిశుధ్య, సెక్యూరిటీ కార్యక్రమాల నిర్వహణ కోసం ప్రభుత్వం 82 లక్షల 14 వేల 471 రూపాయలను మంజూరు చేసింది.
అసలు విషయానికి వస్తే.. ఈ ఏడాది జూన్ 12న పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశాక.. రాష్ట్ర సచివాలయంలో ఆయనకు ప్రత్యేక చాంబర్ ఏర్పాటు పనులు కొంత ఆలస్యంగా పూర్తయ్యాయి. ఈలోగా పవన్.. విజయవాడలోని క్యాంపు కార్యాలయంలోనే బాధ్యతలు చేపట్టారు. బాధ్యతలు చేపట్టిన రోజు నుంచి వరుసగా మూడు రోజుల పాటు క్యాంపు కార్యాలయంలో అధికారిక విధుల్లో ఆయన పాల్గొన్నారు. ఆ తర్వాత పవన్ ఎక్కువగా మంగళగిరిలోని జనసేన పార్టీ ప్రధాన కార్యాలయంలోనే సమీక్షలు నిర్వహించారు.
Also Read: తెలుగు ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు.. తెలిపిన ఏపీ సీఎం
డిప్యూటీ సీఎంగా పవన్ బాధ్యతలు చేపట్టిన మూడు నెలల కాలంలో.. పవన్ కేవలం మూడు రోజుల పాటు క్యాంప్ కార్యాలయంలో ఉన్నారని.. నెలకు రూ.9,12,719 చొప్పున.. తొమ్మిది నెలలకు ప్రభుత్వం 82 లక్షల 14 వేల 471 రూపాయలను మంజూరు చేయడం ఏంటని వైసీపీ ప్రశ్నిస్తోంది. ఉప ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం పారిశుధ్య పనులకే ఇంత భారీ మొత్తం కేటాయించడం ఏంటని విమర్శలు గుప్పిస్తోంది.
అయితే గెస్ట్ హౌస్, క్యాంప్ ఆఫీస్ నిర్వహణకు 82 లక్షల 14 వేలు మంజూరు చేసినప్పటికీ.. అవి కేవలం పారిశుధ్య సిబ్బంది, అటెండర్లు, సెక్యూరిటీ సిబ్బంది కోసం విడుదల చేసిన నిధులని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. తన ఆఫీసుకి ఒక్క రూపాయి కూడా వద్దని గతంలో స్టేట్మెంట్ ఇచ్చినట్టు పవన్ గుర్తు చేశారు. దీంతో వైసీపీ విమర్శలకు పవన్ గట్టి కౌంటర్ ఇచ్చినట్టు అయ్యిందని జనసేన నేతలు వ్యాఖ్యానిస్తున్నారు.