Pawan Kalyan: వినాయక చవితి వచ్చిందంటే.. అసలు హడావిడి ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. గణేశుడును తీసుకొచ్చిన దగ్గరనుంచి సాగనంపే వరకు ప్రతోరోజు పండగే. డీజేలు, సాంగ్స్ , పూజలు, ప్రసాదాలు ఇవేమి లేకుంటే అసలు పండగే అనిపించుకోదు. కానీ, ఈ ఏడాది అలాంటి పరిస్థితులు రెండు తెలుగు రాష్ట్రాల్లో లేవు.
వరదల కారణంగా ప్రజలు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా ఏపీ ప్రజలు మరింతగా కష్టాలను ఎదుర్కుంటున్నారు. అయినా కూడా దేవుడిని మర్చిపోకుండా.. కొంతమంది ఇప్పటికే వినాయక చవితికి ఏర్పాట్లు చేస్తున్నారు.
ఇక రేపు వినాయక చవితి పండుగ సందర్భంగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.. రెండు తెలుగు రాష్ట్ర ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలుపుతూనే.. జాగ్రత్తలు చెప్పుకొచ్చారు. హంగు ఆర్భాటాలతో పండుగ చేసుకొనే పరిస్థితిలో లేము కాబట్టి అందరూ సంప్రదాయబద్ధంగా పండుగ సెలబ్రేట్ చేసుకోవాలని కోరారు.
“తెలుగు రాష్ట్రాల అభివృద్ధి, ప్రజల సౌభాగ్యం అవిఘ్నంగా కొనసాగాలని విఘ్నాలకు అధిపతి అయిన గణనాథుడిని మనసారా వేడుకుంటూ సకల జనులకు వినాయకచవితి శుభాకాంక్షలు. ఆంధ్రప్రదేశ్ వాసులు వరదలతో భీతిల్లుతున్న తరుణంలో వచ్చిన ఈ వినాయక చవితిని భక్తిప్రపత్తులతో ఆనందదాయకంగా చేసుకునే పరిస్థితులు లేకపోవడం దురదృష్టకరం. అందువల్ల వినాయక పందిళ్లను ఆడంబరంగా, ఆర్భాటాలు జోలికి పోకుండా సంప్రదాయబద్ధంగా పరిమితంగా చేసుకుని.. విధంగా మిగిలే నిదులను వరద బాదితులను ఆదుకోవడానికి వినియోగించవలసిందిగా మనవి చేస్తున్నాను.
ఎప్పటిలాగే ఇప్పుడు కూడా చెబుతున్నాను మట్టి వినాయక ప్రతిమలకు పూజలు చేయండి. నీటిలో కరగని కృత్రిమ పదార్ధాలతో రూపొందే ప్రతిమలను ప్రోత్సహించకండి. మన భావి తరాలకు చక్కటి పర్యావరణాన్ని అందించాలన్న సంకల్పాన్ని విస్మరించవద్దు.
వరదలు, కరవు కాటకాలు లేని భవిష్యత్తును ప్రసాదించమని ‘నమామి తమ వినాయకం ‘అని ప్రార్ధిస్తూ జనులందరికీ శుభాలు కలగాలని మనసారా కోరుకుంటున్నాను” అంటూ ప్రకటన రిలీజ్ చేశారు. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది.
వినాయక చవితి శుభాకాంక్షలు
– ఉప ముఖ్యమంత్రి @PawanKalyan pic.twitter.com/bEqcV2UGxG
— Deputy CMO, Andhra Pradesh (@APDeputyCMO) September 6, 2024