Niharika Konidela: రెండు తెలుగు రాష్ట్రాల వరద బాధితులకు సహాయం చేయడానికి టాలీవుడ్ మొత్తం కదిలివస్తున్న విషయం తెల్సిందే. మెగా, నందమూరి, అక్కినేని, దగ్గుబాటి కుటుంబాలు.. ఇప్పటికే తమవంతుగా భారీ విరాళాలను అందించాయి. అయితే ఈ కుటుంబాల్లో హీరోలు ఒక్కొక్కరుగా ఇవ్వడం విశేషం.
మెగా కుటుంబం తీసుకుంటే.. చిరంజీవి, పవన్ కళ్యాణ్, రామ్ చరణ్, అల్లు అర్జున్, సాయి ధరమ్ తేజ్, వరుణ్ తేజ్.. ఇలా ఒక్కొక్కరు భారీ విరాళాలను అందజేశారు. తాజాగా మెగా డాటర్ నిహారిక కొణిదెల కూడా తనవంతు సాయం చేసింది. వరద ముంపుకు గురైన పది గ్రామాలకు .. ఒక్కో గ్రామానికి రూ. 50 వేలు చొప్పున రూ. 5 లక్షలు ఇవ్వనున్నట్లు తెలిపింది.
” బుడమేరు వాగు ముంపుతో విజయవాడ రూరల్ ఏరియాలో అనేక గ్రామాలు నీట మునగడం, ప్రజలు అనేక ఇబ్బందులు పడుతుండడం నాకు చాలా బాధ కలిగించింది. ఇటువంటి ప్రకృతి విపత్తులో ఎక్కువగా ఇబ్బందులు పడేది గ్రామీణ ప్రాంత ప్రజలే. నేను పుట్టి పెరిగిన వాతావరణం అంతా నగరంలోనే అయినా మా పెద్దవారు అందరూ గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చినవారే కాబట్టి వారి చెప్పే అనుభవాలు విన్న దృష్ట్యా నాకు గ్రామీణ వాతావరణంపై ఎంతో అభిమానం ఉంది.
ఉప ముఖ్యమంత్రి అయినటువంటి మా బాబాయ్ పవన్ కళ్యాణ్ గారితో పాటు మా కుటుంబీకులు అందరూ బాధితులకు అండగా నిలబడడం నాకు ఎంతో సంతోషాన్ని కలిగించింది. నేను కూడా ఈ బృహత్కార్యంలో పాలు పంచుకోవాలనే ఉద్దేశ్యంతో ఉడతా భక్తిగా వరద ముంపుకు గురైన ఒక పది గ్రామాలకు ఒక్కో గ్రామానికి ఏభై వేలు చొప్పున ఐదు లక్షలు రూపాయలు విరాళంగా ఇవ్వాలని నిర్ణయించుకున్నాను. ఈ విపత్కర పరిస్థితులు తొందరగా తొలగిపోవాలని, ప్రజలంతా సురక్షితంగా ఉండాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను” అంటూ రాసుకొచ్చింది.
ఇక ఈ పోస్ట్ పై కొందరు నెగిటివ్ కామెంట్స్ చేయడం మొదలుపెట్టారు. మెగా డాటర్ అయ్యి ఉండి కేవలం రూ. 5 లక్షలేనా.. ?. రూ. 5 లక్షలా.. వామ్మో ఎక్కువైపోతాయేమో అంత డబ్బులు అంటే అని ఎగతాళి చేస్తూ కామెంట్స్ చేస్తున్నారు. ఇక వారికి మరికొందరు నెటిజన్స్ గడ్డిపెడుతున్నారు.
లక్షలు అంటే అంత ఈజీగా ఉందా.. ? నువ్వు ఒక్క రూపాయైనా ఇచ్చావా.. ? అవి తాను సొంతంగా కష్టపడిన డబ్బులు . ఎవరిని అడిగి తీసుకున్నవి కాదు.. వీలయితే ప్రశంసించు.. లేకపోతే వదిలేయ్.. అంతేకానీ విమర్శించే హక్కు లేదని చెప్పుకొస్తున్నారు.
నిహారిక.. విడాకుల తరువాత ప్రొడక్షన్ హౌస్ స్థాపించి అందులో సినిమాలు, సిరీస్ లు తీస్తున్న విషయం తెల్సిందే. ఈ మధ్యనే ఆమె బ్యానర్ లో కమిటీ కుర్రోళ్లు రిలీజ్ అయ్యి మంచి విజయాన్ని అందుకుంది. మరి ముందు ముందు నిహారిక ఇలాంటి మంచి సినిమాలను ప్రేక్షకులకు అందిస్తూ స్టార్ ప్రొడ్యూసర్ గా మారుతుందేమో చూడాలి.