Venkatesh: రెండు తెలుగు రాష్ట్రాలను వరదలు ముంచెత్తుతున్న విషయం తెల్సిందే. ముఖ్యంగా ఏపీ ప్రజలు వరదల కారణంగా ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. ఎంతోమంది తిండిలేక అలమటిస్తున్నారు. మరెంతో మంది నిరాశ్రయులు అయ్యారు. ఇంకా కొంతమంది వరద ముంపు ప్రాంతాల్లో సాయం కోసం ఎదురుచూస్తూ ఉన్నారు.
ప్రజలను ఈ వరద బారి నుంచి రక్షించడానికి ప్రభుత్వం తమవంతు ప్రయత్నం చేస్తుంది. ఇక ప్రజలకు టాలీవుడ్ సైతం చేయూతను అందిస్తున్న విషయం తెల్సిందే. తమ సినిమాలకు ప్రేక్షకులు ఎలాంటి పరిస్థితిల్లో ఉన్న వచ్చి ఆదరించినందుకు.. వారు కూడా ఇలాంటి విపత్కర సమయంలో తమవంతు సాయం అందిస్తూ మానవత్వం చూపిస్తున్నారు.
ఇప్పటికే టాలీవుడ్ స్టార్ హీరోలందరూ రెండు తెలుగు రాష్ట్రాలకు భారీ విరాళాలు అందించారు. తాజాగా దగ్గుబాటి హీరోలు కూడా మేము సైతం అంటూ చెయ్యి కలిపారు. దగ్గుబాటి హీరోలు వెంకటేష్, రానా .. కలిసి రెండు తెలుగు రాష్ట్రాలకు చెరో రూ. 50 లక్షలు ఇస్తున్నట్లు ప్రకటించారు.
” వరదల వల్ల నష్టపోయిన బాధితులని చూసి మా హృదయం తల్లడిల్లుతోంది. ఈ ఆపద సమయంలో చేపట్టిన సహాయక కార్యక్రమాల కోసం తెలుగు రాష్ట్ర ప్రభుత్వాల సహాయ నిధులకు రూ.కోటి విరాళంగా ఇస్తున్నాం. అత్యవసరంలో వున్న వారికి ఇది సహాయపడుతుందని ఆశిస్తున్నాం. మనం కలిసి పునర్నిర్మాణం చేద్దాం. మరింత దృఢంగా ఆవిర్భవిద్దాం” అంటూ బాబాయ్ – అబ్బాయ్ రాసుకొచ్చారు. ఇక దీంతో దగ్గుబాటి అభిమానులు ఈ హీరోలను అభినందిస్తున్నారు.
ఇకపోతే వీరి కెరీర్ విషయాల గురించి మాట్లాడుకుంటే.. ప్రస్తుతం వెంకటేష్.. అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు. రానా దగ్గుబాటి రానా నాయుడు సిరీస్ తో బిజీగా ఉంటూనే.. ఇంకోపక్క నిర్మాతగా కొనసాగుతున్నాడు. ఈ మధ్యనే 35 ఇది చిన్న కథ కాదు అనే సినిమాను సమర్పించి.. మంచి విజయాన్ని అందుకున్నాడు.