Drugs Case : బెంగళూరు డ్రగ్స్ కేసులో టాలీవుడ్ నటి రకుల్ ప్రీత్ సింగ్, బీఆర్ఎస్ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డికి ఈడీ నోటీసులు జారీ చేయటం సంచలనం రేపుతోంది. ఈ నెల 19న విచారణకు హాజరుకావాలని ఆ నోటీసుల్లో పేర్కొంది. డ్రగ్స్ వ్యవహారంలో భారీగా నగదు బదిలీ జరిగినట్లు ఈడీ అధికారులు అనుమానిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ కేసు విచారణ చేపడుతున్నారు.
గతేడాది బెంగళూరులో భారీగా డ్రగ్స్ పట్టుబడ్డాయి. ఈ కేసులో నైజీరియన్ను అరెస్టు చేయడంతో అనేక లింకులు బయటపడ్డాయి. ఇప్పటికే కన్నడ నిర్మాత శంకరగౌడను పోలీసులు విచారించారు. ముగ్గురు ఎమ్మెల్యేల పాత్రపై అనుమానాలు వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డికి డ్రగ్స్ దందాతో సంబంధాలున్నాయని అనుమానిస్తున్నారు. ఆయన ద్వారా భారీగా నగదు చేతులు మారినట్లు ప్రాథమికంగా తేల్చారు. ఈ నేపథ్యంలో ఈ కేసును ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్కు అప్పగించారు. దీంతో ఈడీ అధికారులు రంగంలోకి దిగి విచారణ సిద్ధమయ్యారు. అటు హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్, ఇటు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డికి నోటీసులు ఇచ్చారు.
వ్యాపార లావాదేవీలపై రోహిత్రెడ్డిని విచారించనున్నట్లు సమాచారం. 2014 నుంచి జరిపిన ఆర్థిక లావాదేవీలు, కంపెనీల వ్యవహారంపై ఈడీ ఆయన్ను ప్రశ్నించనున్నట్లు తెలుస్తోంది. నోటీసులు అందిన విషయాన్ని రోహిత్రెడ్డి ధ్రువీకరించారు. విచారణకు హాజరై అధికారులు అడిగే ప్రశ్నలకు సమాధానాలిస్తానని చెప్పారు.
టాలీవుడ్ డ్రగ్స్ కేసులోనూ గతేడాది సెప్టెంబర్ 3న రకుల్ను ఈడీ అధికారులు విచారించారు. అప్పుడు విచారణ మధ్యలోనే రకుల్ వెళ్లిపోయింది. దీంతో ఈడీ అధికారులు ఆమెను పూర్తిస్థాయిలో విచారించలేకపోయారు. టాలీవుడ్లో డ్రగ్స్ వ్యవహారంపై 2017 జులైలో ఎన్డీపీఎస్ చట్టం కింద తెలంగాణ ఎక్సైజ్ పోలీసులు కేసు నమోదు చేశారు. సిట్ ఏర్పాటు చేసి పలువురు సినీ ప్రముఖులును విచారించారు.
గతేడాది సెప్టెంబర్లో మనీలాండరింగ్ కింద ఈ కేసులో ఈడీ అధికారులు విచారణ చేపట్టారు. ఆగస్టు 31 నుంచి సెప్టెంబర్ 22 వరకు పలువురికి నోటీసులు జారీ చేసి ప్రశ్నించారు. ఈడీ విచారణకు పూరీ జగన్నాథ్, రవితేజ, ఛార్మి, రకుల్ప్రీత్ సింగ్, రానా దగ్గుబాటి, ముమైత్ఖాన్, నందు, తనీష్, నవదీప్తో పాటు పబ్ మేనేజర్, రవితేజ డ్రైవర్ హాజరయ్యారు. ఇప్పుడు బెంగళూరు కేసు తెరపైకి రావడంతో ఈడీ మరోసారి విచారించేందుకు సిద్ధమైంది. ఇంకా ఎవరెవరికి నోటీసులు జారీ చేస్తారనే ఉత్కంఠ నెలకొంది.