Jammu and Kashmir Assembly Polls: జమ్మూకాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల వేల బీజేపీ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేసింది. ఈ మేనిఫెస్టోను శుక్రవారం కేంద్ర హోంమంత్రి అమిత్ షా విడుదల చేశారు. రెండురోజుల పర్యటనలో భాగంగా ప్రస్తుతం జమ్మూకాశ్మీర్ లో పర్యటిస్తున్న ఆయన.. మేనిఫెస్టోను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నేతలు, జమ్మూకాశ్మీర్ బీజేపీ నేతలు పాల్గొన్నారు. నేడు సాయంత్రం పార్టీ నేతలతో అమిత్ షా సమావేశమై ఈ ఎన్నికల్లో పార్టీని గెలిపించే అంశాలకు సంబంధించి ఆయన చర్చించనున్నారు.
కాగా, ఆర్టికల్ 370 రద్దు, జమ్మూ కాశ్మీర్ ను రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా మార్చిన తరువాత అక్కడ తొలిసారిగా అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. ఇదిలా ఉంటే.. జమ్మూ కాశ్మీర్ లో ప్రధాన పార్టీలైనటువంటి నేషనల్ కాన్ఫరెన్స్-ఎన్సీ, పీడీపీలు తమ మేనిఫెస్టోలను విడుదల చేశాయి. అందులో ఆర్టికల్ 370 పునరదుద్ధరణ హామీలు ఇచ్చాయి. ఈ నేపథ్యంలో అమిత్ కీలక వ్యాఖ్యలు చేశారు. 2019లో కేంద్ర ప్రభుత్వం ఆర్టికల్ 370ని రద్దు చేసిన విషయం తెలిసిందే.
Also Read: హృదయ విదారక ఘటన.. భుజాలపై ఇద్దరు పిల్లల మృతదేహాలతో 15 కి.మీలు నడిచిన తల్లిదండ్రులు
ఈ సందర్భంగా అమిత్ షా మాట్లాడుతూ.. రాష్ట్రానికి ప్రత్యేక హోదాను కల్పించే ఆర్టికల్ 370 పునరుద్ధరణను ఆయన తోసిపుచ్చారు. ఆర్టికల్ 370 చరిత్ర అయ్యిందని, అది తిరిగి రాదంటూ ఆయన స్పష్టం చేశారు.
స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి బీజేపీకి జమ్మూ కాశ్మీర్ ముఖ్యమైందన్నారు. అప్పటి నుంచి ఈ ప్రాంతాన్ని భారత్ తో కలపాలని అనుకున్నదని ఆయన పేర్కొన్నారు. 2014 వరకు జమ్మూకాశ్మీర్ వేర్పాటువాదులు, ఉగ్రవాదుల నీడలో ఉండేదని.. వివిధ రాష్ట్ర, జాతీయ నాకులు దానిని అస్థిరపరిచేందుకు ప్రయత్నించారన్నారు. గత ప్రభుత్వాలు బుజ్జగించే విధానాలను అవలంభిస్తూ వచ్చాయన్నారు. కానీ, 2014-2024 మధ్య జమ్మూకాశ్మీర్ అభివృద్ధి సువర్ణాక్షరాలతో లిఖించబడుతుందని అమిత్ షా పేర్కొన్నారు.
Also Read: సీపీఎం కార్యదర్శి ఏచూరి ఆరోగ్య పరిస్థితి మరింత విషమం
ఆర్టికల్ 370 నీడలో వేర్పాటువాదులు, హురియత్ వంటి సంస్థల డిమాండ్లకు ప్రభుత్వాలు తల వంచడం చూశాం. ఆగస్టు 5, 2019న ప్రధానమంత్రి మోదీ హయాంలో ఆర్టికల్ 370, 35-ఏ అంశాలు రద్దు తరువాత ఈ ప్రాంతంలో అభివృద్ధి వేగం పెరిగిందన్నారు. నేషనల్ కాన్ఫరెన్స్ మేనిఫెస్టోకు కాంగ్రెస్ మద్దతు ఇస్తున్నదంటూ అమిత్ షా అన్నారు. ‘నేను దేశ ప్రజలకు ఒక విషయాన్ని తెలియజేయాలనుకుంటున్నాను. ఆర్టికల్ 370 చరిత్రగా మారింది. ఇది ఎప్పటికీ తిరిగి రాదు మరియు దానిని తిరిగి రావడానికి మేం ఎప్పటికీ అంగీకరించబోము. ఎందుకంటే ఆర్టిక్ల 370 కాశ్మీర్ లో యువతకు తుపాకులు, రాళ్లను అప్పగించేందుకు దారులు తీసింది. జమ్మూ కాశ్మీర్ అభివృద్ధిలో ముందంజలో ఉండాలనుకుంటున్నాం. అందుకే ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోం’ అంటూ అమిత్ షా పేర్కొన్నారు.
కాగా, ఆగస్టు 16, 2024 కేంద్ర ఎన్నికల సంఘం జమ్మూకాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి షెడ్యూల్ ను విడుదల చేసింది. మొత్తం మూడు దశల్లో జమ్మూకాశ్మీర్ లో అసెంబ్లీ ఎన్నికలు నిర్వహిస్తామని పేర్కొన్నది. సెప్టెంబర్ 18 తొలి దశ, 25న రెండో దశ, అక్టోబర్ 1న మూడో దశ ఎన్నికలు నిర్వహిస్తామని స్పష్టం చేసింది. జమ్మూకాశ్మీర్ లో మొత్తం 90 స్థానాలకు ఎన్నికలు జరుగుతాయని ఈసీ ప్రకటించింది. ఫలితాలను అక్టోబర్ 4న విడుదల చేస్తామని చెప్పింది.