అధికారంలో ఉంటే ఒక రకం.. ప్రతిపక్షంలో ఉంటే మరో రకం. ఇదీ గతంలో టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు గురించి వ్యక్తమైన అభిప్రాయం. అధికారంలో ఉన్నప్పుడు ఆయన దృష్టంతా పాలనపైనే ఉండేది. రెండు సార్లు ఉమ్మడి రాష్ట్రంలో వ్యవహరించినప్పుడు అభివృద్దిని పరుగులు పెట్టించి హైటెక్ సీఎం అనిపించుకున్నారు. 2014లో మూడో సారి ముఖ్యమంత్రి అయినప్పుడు. రాజధానిలేని రాష్ట్రంగా విడిపోయిన ఏపీలో అభివృద్దికి కృషి చేశారు. పట్టిసీమ నిర్మించి, పోలవరం పనులు పరుగు పెట్టించి.. రాజధాని అమరావతికి పునాదిరాయి వేసి ఒక రూపం తీసుకొచ్చే ప్రయత్నం చేశారు.
నాలుగో సారి ముఖ్యమంత్రి అయ్యాక ఆయన వ్యవహారతీరులో మార్పు స్పష్టంగా కనిపిస్తోంది.గత ప్రభుత్వ హయాంలో ఎదుర్కొన్న చేదు అనుభవాలన్నీ చంద్రబాబును చాలానే ప్రభావితం చేశాయన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. అందుకే మార్పు ఎక్కువగా వచ్చిందంటున్నారు. గతానికి భిన్నంగా యాక్షన్ ప్లాన్ కొనసాగిస్తూ సొంత పార్టీ నేతలకు సైతం కొత్త వెర్షన్ ని పరిచయం చేస్తున్నారు. నా రూటే సపరేటు అని నిరూపిస్తున్నారు.
ఓ వైపు వరదల విపత్తుతో ఏపీ వాసులు అవస్థలు పడుతున్న తరుణంలో.. టీడీపీ ఎమ్మెల్యే ఆదిమూలం ఘటన ప్రస్తుతం తీవ్ర వివాదంగా మారింది. టీడీపీ పార్టీకి చెందిన మహిళ నేతపై.. ఎమ్మెల్యే ఆదిమూలం లైంగిక దాడికి పాల్పడ్డారని.. మీడియా వేదికగా వీడియోలతో సహా బాధితురాలు బయటపెట్టింది. తిరుపతిలోని భీమాస్ హోటల్లోని రూమ్ నెంబర్ 109 వ్యవహారాన్ని పూసగుచ్చినట్టు వివరించారు.
తనను బెదిరించి ఆదిమూలం లైంగిక దాడికి పాల్పడ్డాడని బాధితురాలు వాపోయింది. ఎవరికైనా చెబితే తన కుటుంబాన్ని చంపేస్తానని హెచ్చరించారని కూడా ఆవేదన వ్యక్తం చేసింది. ఇప్పటి వరకు మూడుసార్లు లైంగిక దాడికి పాల్పడ్డాడని చెప్పుకొచ్చింది. చివరకు ఎమ్మెల్యే ఆదిమూలం నిజరూపాన్ని బట్టబయలు చేయడానికి పెన్ కెమెరా పెట్టినట్లు తెలిపింది.
ఈ ఘటన కాస్త పొలిటికల్ గా తీవ్ర రచ్చగా మారింది. టీడీపీ అధినేత చంద్రబాబు, మంత్రి నారాలోకేష్ కు సైతం.. తనపై జరిగిన దారుణంపై లేఖను రాశారు. దీనిపై సీఎం చంద్రబాబు సీరియస్ అయ్యారు. ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలంను పార్టీ నుంచి సస్పెండ్ చేసినట్లు పార్టీ ప్రకటించింది. సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు.. టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఘటనపై చంద్రబాబు సీరియస్ గా స్పందించినట్లు తెలుస్తోంది.
Also Read: జగన్ ఫారెన్ టూర్ ఆలస్యం.. పాస్పోర్టు కష్టాలు, వెనుక ఏదో..
గతంలోనూ ఈ తరహా వ్యవహారాలపై ఆధికారంలో ఉన్న, ప్రతిపక్షంలో ఉన్నా కూడా చట్టపరంగానే చర్యలు తీసుకోవాలని చంద్రబాబు చెబుతూ వచ్చారు. ఇక ఇప్పటికే పార్టీ నేతలు తప్పు చేస్తే క్షమించను అని వార్నింగ్ ఇచ్చిన చంద్రబాబు.. ఈ ఘటనపై కూడా వెంటనే స్పందించి.. చట్టపరంగా విచారణ జరిపి చర్యలకు ఆదేశించినట్టు స్పష్టం అవుతోంది. అలానే ఘటనపై తనకు పూర్తి స్థాయిలో నివేదిక ఇవ్వాలని కూడా చంద్రబాబు ఆదేశించినట్లు సమాచారం.
పాలనా వ్యవహారాల్లో ఎంత బిజీగా ఉన్నా ఏపీ టీడీపీలో చోటుచేసుకుంటున్న పరిణామాలను నిశితంగా గమనిస్తూ.. నేతలకు మార్గ నిర్దేశం చేస్తున్నారు. అదే సమయంలో పార్టీ లైన్ దాటుతున్న నేతలకు సున్నితంగా వార్నింగులిస్తున్నారు. ఇటీవలే ఏపి క్యాబినెట్ సమావేశంలో మంత్రులతో సిఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. ఇద్దరు ముగ్గురు ఎమ్మెల్యేల, ప్రవర్తన కారణం ఇన్నాళ్లు నిర్మించుకున్న మంచిపేరు దెబ్బతింటోందని ..పేపర్ల నిండా వారు చేసిన పొరపాట్లను ప్రస్తావిస్తూ వార్తలు వస్తుండటంతో అందరికీ చెడ్డ పేరు వస్తోందని వ్యాఖ్యానించారు.
పార్టీ ప్రతిష్టకు భంగం కలిగేలా చేస్తే ఉపేక్షించనన్న చంద్రబాబు.. ఆడబిడ్డల విషయంలోను అసలు తగ్గేదే లేదంటూ వెంటనే సదరు ఎమ్మెల్యే పై యాక్షన్ తీసుకోవడం.. పూర్తి స్థాయిలో నివేదిక అందించాలని ఆదేశించడం పట్ల సామాన్యులే కాకుండా.. నేతలు సైతం అలర్ట్ అవుతున్నారు. చంద్రబాబు ఇన్ యాక్షన్ మోడ్ అంటూ కితాబిస్తున్నారు.