తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం, చంద్రబాబు నివాసంపై దాడి కేసుల వ్యవహారం ఆంధ్రప్రదేశ్ లో మరోసారి హాట్ టాపిక్ గా మారింది. ఏపీ హైకోర్టు ఆదేశాలతో వైసీపీ నేతల్లో భయం పట్టుకుంది. నిందితులైన నేతలకు అరెస్ట్ నుంచి రక్షణ కల్పించేందుకు హైకోర్టు నిరాకరించింది. ఈ కేసులో ప్రమేయం ఉన్న వైసీపీ నేతలకు ముందస్తు బెయిల్ ఇచ్చేది లేదని న్యాయస్థానం స్పష్టం చేసింది. దాంతో వైసీపీ నేతల్లో కలవరం మొదలైందని జోరుగా చర్చ జరుగుతోంది.
వైసీపీ హయాంలో 19 అక్టోబర్ 2021న మంగళగిరిలోని టీడీపీ సెంట్రల్ ఆఫీస్ పై వైసీపీ మూకలు దాడికి తెగబడ్డాయి. పార్టీ ఆఫీసులోకి దూసుకొచ్చి కార్యాలయాన్ని మొత్తం ధ్వంసం చేశారు. ఆఫీసులో ఉన్న టీడీపీ నేతలు, కార్యకర్తలపైనా దాడులకు పాల్పడ్డారు. ఈ ఘటనలో ఆఫీసులోని ఫర్నీచర్ మొత్తం ధ్వంసమైంది. ఆఫీసుతో పాటు చంద్రబాబు నివాసంపై కూడా వైసీపీ మూకలు దాడికి పాల్పడ్డారు. ఆ దాడులకు తమ అనుచరులను ప్రోత్సహించి, దగ్గరుండి చేయించారని పలువురు నేతలపై కేసులు నమోదయ్యాయి.
టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో నందిగాం సురేష్, దేవినేని అవినాష్, అప్పిరెడ్డి, తలశిల రఘురామ్తో పాటు 14 మందికి బెయిల్ ఇచ్చేందుకు హైకోర్టు నో చెప్పింది. బెయిల్ నిరాకరిస్తూ ఇచ్చిన ఉత్తర్వులను రెండు వారాల పాటు సస్పెండ్ చేయాలని వైసీపీ నేతల తరఫు న్యాయవాదులు హైకోర్టును కోరారు. తీర్పులను పరిశీలించిన హైకోర్టు.. అరెస్ట్ నుంచి రక్షణ కల్పించే ప్రసక్తే లేదని ఉత్తర్వులు జారీ చేసింది.
Also Read: జగన్ ఫారెన్ టూర్ ఆలస్యం.. పాస్పోర్టు కష్టాలు, వెనుక ఏదో..
న్యాయస్థానం తీర్పు నేపథ్యంలో మాజీ ఎంపీ నందిగాం సురేష్ను అరెస్ట్ చేసేందుకు.. ఆయన ఇంటికి వెళ్లగా.. అప్పటికే ఇంట్లో లేకపోవడంతో అరెస్ట్ భయంతో అజ్ఞాతంలోకి వెళ్లినట్లు ప్రచారం జరిగింది. అయితే నిన్న నందిగం సురేష్ ను మంగళగిరి పోలీసులు హైదరాబాద్ లో అరెస్ట్ చేసారు. హైదరాబాద్ నుంచి సురేష్ ను గుంటూరుకు తరలించారు. వైద్య పరీక్షల నిమిత్తం సురేష్ ను హాస్పిటల్ కు తీసుకెళ్లినట్టు సమాచారం అందుతోంది.
తన భర్తకు ఏదైనా జరిగితే సీఎం చంద్రబాబుదే బాధ్యతని మాజీ ఎంపీ నందిగామ సురేష్ భార్య బేబిలత అన్నారు. గతంలో ఇదే పీఎస్లో తన భర్తపై హత్యాయత్నం చేశారని ఆరోపించారు. రాత్రి ఒంటిగంటకు అరెస్టు చేసి.. చాలా ఇబ్బందులు పెట్టారన్నారు. సాక్ష్యాలు లేకపోయినా టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో
అన్యాయంగా అరెస్టు చేశారని మండిపడ్డారు.
హైకోర్టు ఉత్తర్వుల నేపథ్యంలో కేసుతో సంబంధం ఉన్నవారందరినీ పోలీసులు అరెస్ట్ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇక ఇప్పటికే సురేష్ ను అరెస్ట్ చేయడంతో.. వైసీపీ నేతల అరెస్ట్ ల పర్వం మొదలైందని పొలిటికల్ వర్గాల్లో డిస్కషన్ నడుస్తోంది. ఈ క్రమంలో అరెస్ట్ భయంలో దాడి కేసులో నిందితులుగా ఉన్న మాజీ మంత్రి జోగి రమేశ్, దేవినేని అవినాశ్, ఇతర నేతలు అజ్ఞాతంలోకి వెళ్లారని చర్చ జరుగుతోంది. వారి కోసం పోలీసులు గాలింపు కొనసాగుతోంది.
అధికారం అండతో నేతలైనా, కార్యకర్తలైనా అడ్డగోలుగా రెచ్చిపోతే.. చట్టాల ముందు సమాధానం చెప్పక తప్పదని కూటమి నేతలు విమర్శలు చేస్తున్నారు.