Tovino Thomas And Manju Warrier: కేరళలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు వయనాడ్ లో కొండచరియలు విరిగిపడి ఎంతోమంది మృతి చెందారు. మరెంతో మంది గాయపడ్డారు. అలాగే ఇంకెంతో మంది భవనాల శిథిలాల కింద చిక్కుకుపోయారు. ఒకవైపు వరదలు ముంచెత్తాయి. అది చూస్తే ఎత్తయిన కొండ ప్రాంతం…ఆ ఊరికి వెళ్లేందుకు మార్గం లేదు.. మధ్యలో వాగు తెగిపోయింది. అక్కడికి చేరుకోవడానికి, ప్రజలకు సహాయ చర్యలు అందించడానికి కూడా సాధ్యం కాని పరిస్థితుల్లో ప్రాణాలకు తెగించి భారత జవాన్లు అక్కడ సహాయ చర్యల్లో పాల్గొన్నారు.
అప్పటికప్పుడు ఆ వాగుపై తాత్కాలిక వంతెన కట్టి.. గ్రామంలోకి వెళ్లారు. అలా వర్షం పడుతూనే ఉంది.. తడుస్తూనే ఉన్నారు. అడుగు వేస్తే మట్టిలో జారిపోతూనే ఉన్నారు. కరెంటు లేదు, రాత్రయితే చిమ్మ చీకటి.. ఏం తిన్నారో, ఎక్కడ పడుకున్నారో తెలీదు. అలా భారత సైనికులు 24 గంటలు అలుపెరగకుండా పనిచేశారు. ఎంతోమందిని కాపాడారు. మళ్లీ తిరిగి అక్కడ పునరావస ఏర్పాట్లు చేశారు. జనసంచారానికి అవసరమైన చర్యలన్నీ తీసుకున్నారు.
ఈ నేపథ్యంలో వయనాడ్ వరద సహాయచర్యల్లో పాల్గొన్న 122 ఇన్ ఫాంట్రీ బెటాలియన్ (టెరిటోరియల్ ఆర్మీ) జవాన్లను గౌరవించేందుకు నటులు టోవినో థామస్, మంజు వారియర్ అక్కడికి వెళ్లారు. వారిని ఘనంగా సన్మానించారు. వారు చేసిన సేవలకు కృతజ్ఞతలు తెలిపారు. దీంతో సైనికులెంతో సంతోషించారు. వారు చేసిన సేవాభావాన్ని గుర్తించినందుకు పొంగిపోయారు.
Also Read: 1986 వరదలకు చిరంజీవి ఇచ్చిన విరాళం ఇంతేనా? అందరికంటే ఆ హీరోనే ఎక్కువ!
ఇందుకు సంబంధించిన ఫోటోలను మంజు వారియర్ తన ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేస్తూ ఈ పర్యటన మనసుకెంతో ఆనందాన్నిచ్చింది. ఎంతో ఆత్మ సంతృప్తిగా ఉందని అభివర్ణించారు. వారిని సన్మానించేందుకు అవకాశమిచ్చిన ఇన్ ఫాంట్రీ బెటాలియన్ (టెరిటోరియల్ ఆర్మీ) మద్రాస్ కమాండింగ్ ఆఫీసర్ కల్నల్ డి.నవీన్ బెంజిత్ కృతజ్ఞతలు తెలిపారు.