– గైడ్లైన్స్ రూపొందించాలని ప్రభుత్వానికి ఆదేశం
– స్థానికత ప్రకారమే సీట్ల కేటాయింపు
– హైకోర్టు తీర్పుతో ప్రభుత్వానికి ఊరట
Medical Seats: తెలంగాణలోని ప్రభుత్వ మెడికల్ కళాశాలల్లో ప్రవేశాల కోసం.. సర్కారు జారీ చేసిన జీవో 33 విషయంలో తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టులో ఊరట లభించింది. ఈ జీవోను సవాలు చేస్తూ పలువురు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయటంతో కోర్టు ఈ పిటిషన్ను ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆలోక్ అరాధే, జస్టిస్ జె.శ్రీనివాసరావులతో కూడిన ధర్మాసనం విచారణ కొనసాగించింది. ఈ విషయంలో ప్రభుత్వపు ఆలోచన సముచితమైనదేనని కోర్టు వ్యాఖ్యానిస్తూ, సీట్ల కేటాయింపులో తీసుకోవాల్సిన జాగ్రత్తలను సూచించింది. పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాదులు బి.మయూర్రెడ్డి, డి.వి.సీతారాంమూర్తి తదితరులు వాదనలు వినిపించగా, ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ ఎ.సుదర్శన్రెడ్డి వాదనలు వినిపించారు.
ఏం జరిగిందంటే…
విభజన చట్టం ప్రకారం 2014 జూన్ 2 నుంచి 2024 జూన్ 2 వరకు అడ్మిషన్ల విషయంలో పాత పద్ధతే కొనసాగించాల్సి ఉంది. కాగా, 2024 జూన్ 2వ తేదీ నాటికి రాష్ట్రం ఏర్పడి పదేండ్లు పూర్తి కావడంతో.. తెలంగాణ రాష్ట్రం స్థానికతను నిర్ధారించుకునేందుకు సొంత రూల్స్ ఫ్రేమ్ చేసుకుని, దాని ప్రకారమే తెలంగాణలోని విద్యాసంస్థల్లో అడ్మిషన్లు ఇవ్వాల్సి ఉంది. దీంతో ప్రభుత్వం జీవో నంబరు 33 ను తెచ్చింది. దీని ప్రకారం.. చివరి విద్యాసంవత్సరం నుంచి నాలుగేండ్లు (అంటే 9 నుంచి 12వ తరగతి వరకు) ఎక్కడ చదివితే అక్కడే లోకల్ అని పేర్కొన్నారు. అయితే, బీఆర్ఎస్ ప్రభుత్వం 2017 జులై 5వ తేదీన జీవో నెంబర్ 114 ప్రకారం.. ఆరు నుంచి 12వ తరగతి వరకు ఏడేండ్లలో నాలుగేండ్లు చదివి ఉంటే స్థానికులుగా పరిగణించారని, ప్రస్తుతం తొమ్మిది నుంచి 12వ తరగతి వరకు చదివితేనే స్థానికులనడం వల్ల లోకల్ విద్యార్థులకు నష్టం జరిగే ప్రమాదముందనే వాదన తెరమీదికొచ్చింది. కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి స్థాయిలో అధ్యయనం చేయకుండా తెచ్చిన ఈ జీవో వల్ల తెలంగాణ వారికి అన్యాయం జరగుతుందని బీఆర్ఎస్, సీపీఎం వంటి పార్టీలు అభ్యంతరాలు వ్యక్తం చేశాయి. దీనిపై కొందరు కోర్టునూ ఆశ్రయించారు.
Also Read: Minister Seethakka: ఆదివాసీ మహిళ ఘటనకు మతం రంగు పులుమొద్దు: మంత్రి సీతక్క ఫైర్
కోర్టు సూచనలు..
జీవో నంబరు 33ను సమర్థిస్తూ..స్థానికులంతా స్థానిక కోటా కింద అర్హులేనని సీజేఐ నేతృత్వంలోని ధర్మాసనం స్పష్టత ఇచ్చింది. స్థానికులు ఎవరనే అంశంపై సరైన మార్గనిర్దేశకాలు లేవని ధర్మాసనం అభిప్రాయపడింది. స్థానికత నిర్ధరణకు సరైన మార్గదర్శకాలు రూపొందించాలని ప్రభుత్వానికి ఆదేశించింది. పిటిషనర్ల స్థానికతను నిర్ధారించుకున్నాకే వారి దరఖాస్తులను పరిగణలోకి తీసుకోవాలని సూచించింది. పిటిషన్ దాఖలు చేసిన విద్యార్థులు తెలంగాణ శాశ్వత నివాసులేనా కాదా అన్నది పరిశీలించాలని హైకోర్టు సూచించింది. ఇందుకోసం ప్రస్తుతం మార్గదర్శకాలు లేనందున కొత్తగా రూపొందించి, అమలు చేయాలని కాళోజీ వర్సిటీని హైకోర్టు ఆదేశించింది.