Medchal : మేడ్చల్ జిల్లా జవహర్నగర్ పోలీస్స్టేషన్ పరిధిలోని ఎన్టీఆర్ నగర్లో అదృశ్యమైన 10 ఏళ్ల చిన్నారి ఘటన విషాదాంతమైంది. దమ్మాయిగూడ చెరువులో చిన్నారి మృతదేహం లభ్యమైంది. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా బాలిక చెరువు వైపు వెళ్లినట్లు గుర్తించిన పోలీసులు డెడ్ బాడీని కనుగొన్నారు. అల్లారుముద్దుగా పెంచుకుంటున్న చిన్నారి అకాల మరణంతో తల్లిదండ్రులు శోక సంద్రంలో మునిగిపోయారు. బాలిక మృతదేహాన్ని చూసి కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.
4వ తరగతి చదువుతున్న ఇందు అనే చిన్నారి గురువారం తప్పిపోయింది. స్కూల్ కు వెళ్లిన బాలిక తిరిగి ఇంటికి రాకపోవడంతో తల్లిదండ్రులు పోలీసులకు కంప్లైంట్ చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు.. పాప కోసం గాలింపు చేపట్టారు. సీసీ కెమెరాల ఫుటేజీ ఆధారంగా దర్యాప్తు జరిపారు. బాలిక రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్నట్టు సీసీ కెమెరాల్లో రికార్డయింది. దీని ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
మృతదేహాన్ని తల్లిదండ్రులకు చూపించకుండానే పోలీసులు మార్చురీకి తరలించారు. దీంతో బాలిక పేరంట్స్ పోలీసులతో వాగ్వాదానికి దిగారు.