Bandi Sanjay: అత్త మీద కోపం దుత్త మీద చూపించారు బండి సంజయ్. కేసీఆర్ తో పాటు జగన్ పైనా విరుచుకుపడ్డారు. దోచుకుందాం.. దాచుకుందాం.. అంటూ ఇద్దరు ముఖ్యమంత్రులు కలిసి దోచుకుంటున్నారని మండిపడ్డారు. ప్రజలు తిరస్కరిస్తే.. అక్కడ జై ఆంధ్ర.. ఇక్కడ జై తెలంగాణ నినాదాన్ని ఎత్తుకుంటున్నారని విమర్శించారు. కేసీఆర్, జగన్ లు కలిసి ఎప్పుడో తిన్న బిర్యానీ గురించి.. కాళ్ల సోర్వా, బ్రెయిన్ కర్రీ, బోటీ, చేపల పులుసు, రొయ్యల పులుసు, చికెన్ ఫ్రై, మటన్ ఫ్రై గురించి.. దెప్పిపొడిచారు బండి సంజయ్.
ప్రజాసంగ్రామ యాత్ర ఐదో విడత పాదయాత్ర పూర్తి చేశారు. సొంత ఇలాఖా కరీంనగర్ లో భారీ బహిరంగ సభ పెట్టారు. కాస్త సెంటిమెంటు, ఇంకాస్త పొలిటికల్ స్టెంటుతో ఎప్పటిలానే తన ప్రసంగాన్ని రక్తి కట్టించారు. అయితే, సడెన్ గా తెలంగాణ నుంచి ఏపీ రాజకీయాలకు షిఫ్ట్ కావడమే ఆసక్తికరం. కేసీఆర్ ను తిట్టడం కామనే. కానీ, ఈసారి కేసీఆర్ తో పాటు జగన్ నూ కలిపి విమర్శించడమే సంచలనం. ఇంతకీ బండి సంజయ్.. పక్క రాష్ట్ర సీఎంను ఎందుకు విమర్శించాల్సి వచ్చింది? కరీంనగర్ లో జగన్ టాపిక్ ఎందుకు?
ఇప్పుడే కాదు, వారం క్రితం కూడా బీజేపీ నేతలు వైసీపీపై మండిపడ్డారు. రాష్ట్ర విభజన కేసు సుప్రీంకోర్టులో పెండింగ్ లో ఉందని, అవసరమైతే రెండు రాష్ట్రాలు మళ్లీ కలుస్తాయంటూ.. ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల చేసిన వ్యాఖ్యలపై రెండు తెలుగు రాష్ట్రాల కమలనాథులు కస్సుమన్నారు. సజ్జల కామెంట్లపై టీఆర్ఎస్ మాత్రం సైలెంట్ గా ఉంది. ఇలాంటి వ్యాఖ్యలు కావాలనే చేస్తున్నారని.. కేసీఆర్, జగన్ లు కలిసి రెండు రాష్ట్రాల్లో మళ్లీ సెంటిమెంట్ రాజేయాలనేది వాళ్ల ప్లాన్ అనేది బీజేపీ భావన. అలా జరిగితే.. బీజేపీకి మైలేజ్ తగ్గే ఛాన్స్ ఉంటుంది కాబట్టే.. కరీంనగర్ సభలో కేసీఆర్, జగన్ లపై నేరుగా అటాక్ చేశారు బండి సంజయ్.
ఏపీలో వైసీపీతో బీజేపీ ఫ్రెండ్లీగా ఉంటోందనేది ఓపెన్ సీక్రెట్. పీఎం మోదీని సీఎం జగన్ అనేక సార్లు కలిశారు. ఏపీకి కేంద్రం నుంచి భారీగా నిధులు వస్తున్నాయి. అలాంటిది, జగన్ దోచుకుంటున్నారంటూ తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు విమర్శలు చేయడం ఆసక్తికరం. కేసీఆర్ పై రాజకీయ దాడి చేయడానికి బీజేపీ నేతలు ఎందాకైనా వెళతారని, ఏ అవకాశాన్నైనా వాడేసుకుంటారని తాజా ఘటనతో తెలిసిపోతోంది. మరి, జగన్ పై బండి సంజయ్ చేసిన ఆరోపణలపై వైసీపీ రియాక్షన్ ఎలా ఉంటుందో…