Rameez Raza slams BCCI, ICC : భారత్ మీద విషం చిమ్మడంలో ఎప్పుడూ ముందుండే పాకిస్థాన్ క్రికెట్ బోర్డు అధ్యక్షుడు రమీజ్ రజా… మరోసారి తన అక్కసు వెళ్లగక్కాడు. నిధుల్ని సమకూర్చుతున్నందుకే బీసీసీఐ ఏం చేసినా ఐసీసీ ఎదురుచెప్పలేకపోతోందని మండిపడ్డాడు. ఇంతకుముందు కూడా బీసీసీఐ పైనా, ఐసీసీపైనా నోరు పారేసుకున్నాడు… రమీజ్ రజా.
వచ్చే ఏడాది పాకిస్థాన్ వేదికగా ఆసియా కప్ జరగబోతోంది. అయితే భారత జట్టు అక్కడికి వెళ్లదని బీసీసీఐ కార్యదర్శి జై షా ప్రకటించాడు. దాంతో… టీమిండియా పాకిస్థాన్లో ఆడకపోతే… భారత్లో 2023లో జరగబోయే వన్డే ప్రపంచకప్లో పాకిస్థాన్ కూడా ఆడదంటూ రమీజ్ రజా తేల్చిచెప్పాడు. పాకిస్థాన్ లేకుండా ఇండియాలో వన్డే ప్రపంచకప్ జరిగితే… ఆ టోర్నీని ఎవరు చూస్తారంటూ ఎగతాళి చేశాడు. తాజాగా ఆసియాకప్ అంశంపై స్పందించిన రజా… అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ లక్ష్యంగా చేసుకుని… భారత్పైనా అక్కసు వెళ్లగక్కాడు. బీసీసీఐ, పీసీబీ మధ్య తలెత్తిన వివాదాన్ని పరిష్కరించడంలో ఐసీసీ క్రియాశీలకంగా వ్యవహరించడంలేదని రజా ఆరోపించాడు. ఐసీసీకి ఇండియానే నిధులు సమకూరుస్తోందని, అందుకే ఐసీసీ రాజీ పడిందంటూ భారత్పై విషం చిమ్మాడు. నిబద్ధత ఉంటే తప్ప ఐసీసీ మారుతుందని తాను అనుకోవడం లేదని నోరు పారేసుకున్నాడు… రజా. ప్రతి క్రికెట్ బోర్డుతో మంచి సంబంధాలు కలిగి ఉండటానికి పాక్ క్రికెట్ బోర్డు కృషి చేస్తుందన్న రజా… భారత్, పాక్ ఒకరికోసం ఒకరు ఆడుకోవాలని అభిప్రాయపడ్డాడు. రెండు దేశాల మధ్య క్రికెట్ మ్యాచ్ను చూడాలని ఎవరు అనుకోరని… భారత్లో ఆడకపోవడానికి పాకిస్థాన్, పాకిస్థాన్లో ఆడటానికి భారత్ సాకులు వెతుక్కోకూడదని సూచించాడు.
T20 ప్రపంచకప్ సందర్భంగా కూడా భారత జట్టు, బీసీసీఐలను రమీజ్ రజా చాలా చులకనగా మాట్లాడాడు. ఫైనల్ చేరిన పాకిస్థాన్ జట్టే గొప్పదని, బిలియన్ డాలర్ల విలువైన జట్ల కంటే పాక్ టీమే ముందుందని నోటికొచ్చినట్లు మాట్లాడి… భారత అభిమానులతో చివాట్లు తిన్నాడు. అయినా పద్ధతి మార్చుకోకుండా… మరోసారి బీసీసీఐ, ఐసీసీలపై అక్కసు వెళ్లగక్కాడు.