ICC World Test Championship 2025: ఇప్పటికే రెండుసార్లు ప్రపంచ టెస్టు ఛాంపియన్ ఫైనల్ వరకు వెళ్లి, రన్నరప్ గా టీమ్ ఇండియా మిగిలిపోయింది. మరి ముచ్చటగా మూడోసారి ఫైనల్ కి వెళ్లి, ఈసారైన ప్రపంచ టెస్టు ఛాంపియన్ ట్రోఫీ పట్టుకురావాలని అభిమానులు కోరుతున్నారు. మాజీ కోచ్ రాహుల్ ద్రవిడ్ కూడా వెళ్లిపోతూ.. భారత్.. ప్రపంచ టెస్టు ఛాంపియన్ కావాలనే కలను నెరవేర్చమని కోరాడు.
ఇంతకీ విషయం ఏమిటంటే.. ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ 2025 ఫైనల్ ముహుర్తం ఖరారైంది. 2025 జూన్ 11-15 మధ్య లండన్ లోని లార్డ్స్ మైదానంలో ప్రతిష్టాత్మకమైన పోటీ జరగనుందని ఐసీసీ ఒక ప్రకటనలో తెలిపింది. జూన్ 16న రిజర్వ్ డే గా ఉన్నట్టు తెలిపింది.
2019లో డబ్ల్యూటీసీ టోర్నీని ఐసీసీ ప్రారంభించిన విషయం తెలిసిందే. మొదటి ఫైనల్ (2019-21) సౌత్ హాంప్టన్ వేదికగా జరిగింది. భారత్ తో తలపడిన కివీస్ విజేతగా నిలిచింది. విరాట్ కోహ్లీ సారథ్యంలోని టీమిండియా పరాజయం పాలై, రన్నరప్ గా మిగిలింది.
రెండో ప్రపంచకప్ ఫైనల్ (2021-23) ఓవల్ వేదికగా జరిగింది. ఇక్కడ కూడా రోహిత్ శర్మ సారథ్యంలో భారత్ ఫైనల్ కి చేరి, ఆస్ట్రేలియాతో తలపడి పరాజయం పాలైంది. మళ్లీ రన్నరప్ గా మిగిలిపోయింది.
2023-25లో కూడా భారత్ ప్రపంచ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ చేరే దిశగా సాగుతోంది. ప్రస్తుతం పాయింట్స్ టేబుల్లో అగ్రస్థానంలో ఉంది. తర్వాత స్థానాల్లో వరుసగా ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ ఉన్నాయి.
Also Read: రెండో టెస్టులో పాకిస్తాన్ ఓటమి: బంగ్లాదేశ్ క్లీన్ స్వీప్
ఈ మూడు జట్ల మధ్యే డబ్ల్యూటీసీ ఫైనల్ జరగడంపై నెట్టింట సెటైర్లు పేలుతున్నాయి. సెంటిమెంటుగా భారత్ కి వర్కవుట్ కాదేమోనని కొందరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
ఇకపోతే ఇక్కడ నుంచి భారత్ వరుసగా బంగ్లాదేశ్ తో 2, న్యూజిలాండ్ తో 3, ఆస్ట్రేలియాతో (బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ) 5 టెస్టు సిరీస్ లు ఆడనుంది. అంటే డబ్ల్యూటీసీ ఫైనల్ కి వెళ్లే ముందు 10 టెస్టు మ్యాచ్ లు మూడు దేశాలతో ఆడనుంది.
మరింత అనుభవం పెట్టుకుని వచ్చే ఏడాది జూన్ 11-15 మధ్య అసలు, సిసలైన ఫైనల్ మ్యాచ్ ఎలా ఆడుతుందో వేచి చూడాల్సిందేనని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు.