CM Chandrababu: వరద విపత్తులను ధీటుగా ఎదుర్కొనే చంద్రబాబు సర్కార్ ఈసారి విఫలమయ్యారా? లేక పరిపాలన విభాగం ఫెయిలయ్యిందా? ఎందుకు బాధితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు? ప్రధాన ప్రాంతాలకే సాయం పరిమితమైందా? బాధితుల ఆవేదన వెనుక ఏం జరిగింది? చివరకు సీఎం చంద్రబాబు రంగంలోకి దిగినా అధికారుల్లో చలనం రాలేదా? అడ్మినిస్ట్రేషన్ ఫెయిలైందని సీఎం చంద్రబాబు ఎందుకన్నారు? ఇవే ప్రశ్నలు ఏపీ ప్రజలను వెంటాడుతోంది.
బెజవాడపై ప్రకృతి కన్నెర్ర చేసింది. మూడురోజులపాటు ప్రజలు నీటిలో ఉండిపోయారంటే అక్కడ పరిస్థితి ఏ రేంజ్లో ఉందో అర్థం చేసుకోవచ్చు. చాలా ప్రాంతాల్లో వరద నీరు కాస్త తగ్గుముఖం పట్టడం తో ప్రజలు బయటకు వస్తున్నారు. మరికొందరు బంధువుల ఇళ్లకు వెళ్తున్నారు. కావాల్సిన వస్తువులు నెత్తిన పెట్టుకుని వెళ్లిపోతున్నారు. గడిచిన మూడురోజులుగా జరిగిన సహాయంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు బాధితులు.
ఏ ఒక్కరూ తమనకు ఆదుకోలేని, సాయం అంతా మెయిన్ రోడ్డుకు ఇరువైపులా మాత్రమే జరిగిందని చెప్పుకొచ్చారు. గడిచిన మూడురోజులు క్షణమొక యుగంలా గడిచిందన్నారు. లోపల ప్రాంతాల ప్రజలు ఆకలితో అలమటించారని రుసరుసలాడారు. దాదాపు మూడు లక్షల మంది ముంపుకు గురైనట్లు వార్తలు వస్తున్నాయి. ప్రభుత్వం అందించిన సాయం సగానికి మాత్రమే సరిపోయిందని అంటున్నారు.
ALSO READ: గత ప్రభుత్వాన్ని విమర్శించి వేస్ట్.. నేను ఎందుకు రాలేదంటే?: డిప్యూటీ సీఎం పవన్
అధికారుల వ్యవహారశైలిని ముందే గమనించిన సీఎం చంద్రబాబు, నేరుగా రంగంలోకి దిగేశారు. అధికారులను ఉరుకులు పరుగులు పెట్టించారు. చివరకు అధికారుల వ్యవహారశైలిని అంచనా వేసి, అర్థరాత్రి సమయంలో బోట్లపై బాధితుల వద్దకు చేరుకున్నారు ముఖ్యమంత్రి. బాధితులకు ఆహారం, మంచినీరు ఇప్పించే ప్రయత్నం చేశారు. మరికొందర్ని పునరావాస కేంద్రాలకు తరలించే ప్రయత్నం చేశారు.
ఆదివారం రాత్రంతా ప్రతీ గంటలకూ బాధితులను కలిసి ప్రయత్నం చేశారు. అయినా అందర్నీ ఆదుకోవడంలో విఫలమయ్యామని మనసులోని మాట బయటపెట్టారు సీఎం చంద్రబాబు. ఈ లెక్కన బెజవాడలో వరద పరిస్థితి ఎంత దారుణంగా ఉందో గమనించవచ్చు. దీనికితోడు అధికారుల వ్యవహారశైలిపై పలుమార్లు సీరియస్ వార్నింగ్ ఇచ్చారు సీఎం.
ఆదివారం రాత్రి చాలా మంది అధికారులు ఇళ్లకు వెళ్లిపోయారు. ఈ విషయం తెలియడంతో నేరుగా ముఖ్యమంత్రి పర్యటించడం మొదలుపెట్టారు. అప్పటికీ ఓ అధికారిపై వేటు వేశారు కూడా. అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. వరదలను ఎవరిపైకి నెట్టాల్సిన అవసరంలేదన్నారు సీఎం చంద్రబాబు. అర్థరాత్రి మీడియాతో మాట్లాడిన ఆయన.. గడిచిన ఐదేళ్లు చేసిన నిర్వాహకమే రాష్ట్రాన్ని ఇంకా వెంటాడుతోందన్నారు.
ప్రజలకు అన్ని రకాల ఇబ్బందులు వచ్చాయని, అడ్మినిస్ట్రేషన్ అడుగడుగునా ఫెయిలైందన్నారు ముఖ్యమంత్రి. ఏపీని వెంటిలేటర్పై పెట్టారంటూ ఆవేదన వ్యక్తంచేశారు. ఒకవైపు ఆర్థిక ఇబ్బందులు, మరోవైపు అడ్మినిస్ట్రేషన్ ఫెయిల్, డిపార్టుమెంట్లు పని చేయకపోవడం, తప్పుడు పనులు చేయడం, బురద జల్లే కార్యక్రమం చేశారన్నారు. రాజకీయ పార్టీకి ఉండాల్సిన ఒక్క లక్షణం కూడా ఈ పార్టీకి లేదన్నారు సీఎం చంద్రబాబు.
వరద విషయంలో సీఎం చంద్రబాబు ఏరియల్ సర్వే చేస్తే సరిపోయేదని చాలామంది విమర్శించారు. కానీ నాకు వాస్తవ పరిస్థితి అర్ధం కావాలనే తన కాన్వాయిని వదిలి.. 5 గంటల పాటు 25 కిలోమీటర్లు గ్రౌండ్లో తిరిగారు. బాధితులందరికీ న్యాయం చేస్తామని భరోసా ఇచ్చారు ముఖ్యమంత్రి చంద్రబాబు. వరద తగ్గుముఖం పట్టడంతో మిగతా కార్యక్రమాలు వేగవంతం చేస్తామని వివరించారు.
రాజకీయ పార్టీకి ఉండాల్సిన ఒక్క లక్షణం, ఆ రౌడీల పార్టీకి లేదు..#APGovtWithFloodVictims#VijayawadaFloods#CBNsFatherlyCare#2024APFloodsRelief#NaraChandrababuNaidu#AndhraPradesh pic.twitter.com/hWR5Mh7ey5
— Telugu Desam Party (@JaiTDP) September 3, 2024