Hand Weavers: రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ విద్యా శాఖ అధికారులకు కీలక సూచనలు చేశారు. ఈ నెల 5వ తేదీన ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని అన్ని చోట్లా ఉపాధ్యాయులను సన్మానించే కార్యక్రమాలు ఉంటాయని గుర్తు చేశారు. ఈ సన్మాన కార్యక్రమాల్లో చేనేత రంగంలో ఉత్పత్తి అయిన వస్త్రాలను, శాలువాలను ఉపయోగించాలని సూచించారు. ఇలా చేస్తే నేతన్నలందరికీ ఆర్థికంగా సహకరించినట్టు అవుతుందని వివరించారు. ప్రభుత్వం తరఫున విద్యా శాఖ అధికారులకు కోరుతున్నట్టు సచివాలయంలో మీడియాతో మాట్లాడుతూ తెలిపారు.
సెప్టెంబర్ 5వ తేదీన నిర్వహించుకునే టీచర్స్ డే రోజు కార్యక్రమాల్లో సింథటిక్ శాలువాలకు బదులు కాటన్ శాలువాలు వాడండని మంత్రి పొన్నం ప్రభాకర్ వివరించారు. గణేశ్ ఉత్సవాల సందర్భంలోనూ అతిథులు వచ్చిన్పుడు సింథటిక్ శాలువాలకు బదులు కాటన్ శాలువాలు వాడాలని అందరికీ సూచించారు. అందరం కలిసి చేనేత రంగానికి బాసటగా నిలవాలన్నారు.
ఆ గ్రామాలను విలీనం చేస్తాం
జీహెచ్ఎంసీలో 150 డివిజన్ల కన్నా పెరగవని, హైడ్రా పేరుతో మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు జీహెచ్ఎంసీలో కలుస్తాయనేది అవాస్తవమని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఓఆర్ఆర్ గ్రామాలకు దగ్గరగా ఉన్న మున్సిపాలిటీల్లో ఆ గ్రామాలను కలుపుతామని, దీనికి ఆర్డినెన్స్ హైడ్రాతో సంబంధం లేదని స్పష్టం చేశారు.
ఇక గురుకులాల గురించి మాట్లాడుతూ.. గురుకులాలకు రూ. 100 కోట్లకు పైగా బకాయిలు ఉన్నాయని వివరించారు. రెంటెడ్ బిల్డింగ్స్ ఎన్ని ఉన్నాయనేది లెక్క తీస్తున్నామని, త్వరలోనే బకాయిలు విడుదల చేస్తామని తెలిపారు. ఉపాధి హామీ పథకం కింద గురుకులాల బిల్డింగ్స్ చుట్టూ క్లీన్ చేయిస్తామని చెప్పారు. డీపీవో, డీఎంహెచ్ఓ, రెవెన్యూ అధికారులు కమిటీలు ఏర్పడి గురుకులాలను తరుచూ విజిట్చేస్తూ మానిటర్ చేసేలా నిర్ణయాలు తీసుకుంటామని తెలిపారు. ప్రతి విద్యార్థి డైనింగ్ టేబుల్ మీద తినాలని, ఫిల్టర్ వాటర్ తాగాలని, బెడ్ మీద పడుకోవాలని, యూనిఫామ్ ధరించాలని, ఇదే తమ ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ అనే తేడాలేకుండా అన్ని గురుకులాల్లో అందరికీ అడ్మిషన్లు ఇస్తామని తెలిపారు.