Balakrishna donates to Telugu states: గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాల తెలుగు ఉభయ రాష్ట్రాల్లోని విజయవాడ, ఖమ్మం.. సగానికిపైగా మునిగిపోయాయి. ఇప్పటికీ కృష్ణా పరివాహక ప్రాంతంలో చాలా గ్రామాలతోపాటు మరికొన్ని గ్రామాలు జలదిగ్ధంలోనే ఉన్నాయి. వేలాది మంది బాధితులు సర్వం కోల్పోయి, ఇళ్లు వదిలి కట్టుబట్టలతో పునరావాస కేంద్రాల్లో ఉంటున్నారు. రెండు రాష్ట్రాల్లో కలిపి 25కు పైగా మృత్యువాత పడ్డట్లు తెలుస్తుంది. వరద బాధితులకు తక్షణ సహాయం అందించేందుకు రెండు తెలుగు రాష్ట్ర ముఖ్యమంత్రలు తగిన చర్యలు తీసుకుంటున్నారు. ఈ వరదల వల్ల దాదాపు రూ.10వేల కోట్ల ఆస్తి నష్టం వాటిల్లినట్లుగా అంచనా వేస్తున్నారు. దీంతో వరద బాధితులను ఆదుకునేందుకు ప్రముఖులు తమ వంతు సాయం చేసేందుకు తెలుగు చిత్ర పరిశ్రమ ముందుకు వస్తోంది.
ఇప్పటికే జూనియర్ ఎన్టీఆర్, సిద్ధు జొన్నలగడ్డ, విశ్వక్ సేన్, త్రివిక్రమ్, వైజయంతి మూవీస్, హారిక & హాసిని క్రియేషన్స్ తమ వంతుగా వరద బాధితులను ఆదుకోవడానికి విరాళాలను ఇవ్వగా.. తాజాగా నందమూరి బాలకృష్ణ భారీ విరాళాన్ని ప్రకటించారు. రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సహాయనిధికి తనవంతు సాయంగా రూ.50లక్షల చొప్పున మొత్తంగా కోటి రూపాయలు విరాళం ప్రకటించారు. విరాళంతోపాటు ఓ కోట్ను కూడా ట్విటర్(X)లో షేర్ చేశారు.
Also Read: ‘ది గోట్’ మూవీ కోసం AI దివంగత విజయకాంత్ సృష్టించారట!
విరాళంతోపాటు ఓ కోట్..
ట్విటర్(X)లో షేర్ చేేసిన కోట్లో.. ‘50 ఏళ్ళ క్రితం మా నాన్నగారు నా నుదుటిన దిద్దిన తిలకం ఇంకా మెరుస్తూనే ఉంది. 50 ఏళ్ల నుంచి నా నట ప్రస్థానం సాగుతూనే ఉంది, వెలుగుతూనే ఉంది. తెలుగు భాష ఆశీస్సులతో, తెలుగుజాతి అభిమాన నీరాజనాలతో పెనవేసుకున్న బంధం ఇది.. ఈ ఋణం తీరనిది. ఈ జన్మ మీకోసం.. మీ ఆనందం కోసం. నా ఈ ప్రయాణంలో సహకరించిన అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ప్రస్తుతం తెలుగు నేలను వరద ముంచెత్తుతోంది. ఈ విపత్కర పరిస్థితులలో బాధాతప్త హృదయంతో ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ.50 లక్షలు, తెలంగాణ ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ.50 లక్షలు నా బాధ్యతగా బాధిత ప్రజల సహాయార్థం విరాళంగా అందిస్తున్నాను.రెండు రాష్ట్రాలలో మళ్ళీ అతి త్వరలోనే సాధారణ పరిస్థితులు నెలకొనాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నాను’ అని రాసుకొచ్చారు.
జూనియర్ ఎన్టీఆర్ కూడా రెండు తెలుగు రాష్ట్రాలకు రూ.50లక్షల చొప్పున కోటి రూపాయలు విరాళం అందిచారు. ఇక అబ్యాయ్ బాటలోనే బాబాయి కూడా తన సాయంగా కోటి విరాళం అందించడం విశేషం. అలాగే విశ్వక్ సేన్ రెండు తెలుగు రాష్ట్రాలకు రూ.10లక్షలు అందించగా.. నిర్మాత అశ్వనీదత్ రూ.25లక్షలు, ఆయ్ మూవీ మేకర్స్ వారాంతపు వసూళ్లలో 25శాతాన్ని సీఎం రిలీఫ్ ఫండ్కు అందచేయనున్నట్లు ఇప్పటికే ప్రకటించారు.