CM Revanth Reddy Visits Mahaboobabad: మహబూబాబాద్ జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించారు. పరిస్థితిని పరిశీలించారు. బాధితులను పరామర్శించి, ఆదుకుంటామంటూ హామీ ఇచ్చారు. అనంతరం ఆయన మంత్రు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, సీతక్కతో కలిసి వరదలపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి వివరాలను వెల్లడించారు. మహబూబాబాద్ జిల్లాలో అత్యధిక వర్షపాతం నమోదైందన్నారు. ఈ జిల్లాలో వర్షాలు, వరదల కారణంగా మొత్తం నలుగురు మృతిచెందడం చాలా బాధాకరమన్నారు. దాదాపు 30 వేల ఎకరాల్లో పంటనష్టం వాటిల్లిందంటూ ఆయన వివరాలను వెల్లడించారు. సహాయకచర్యల్లో నిరంతరం పనిచేసిన రెవెన్యూ, పోలీస్ సిబ్బందిని సీఎం రేవంత్ రెడ్డి ఈ సందర్భంగా అభినందించారు.
Also Read: బీఆర్ఎస్ నేతల ఖమ్మం పర్యటనలో ఉద్రిక్తత.. వాహనాలపై రాళ్లదాడి
‘వర్షాలు, వరదలు ముంచెత్తిన సమయంలో అధికారులు అప్రమత్తమయ్యారు. అధికారుల చర్యలతో ప్రాణనష్టం తగ్గించగలిగాం. మృతుల కుటుంబాలకు రూ. 5 లక్షల చొప్పున పరిహారం ప్రకటించాం. పంట నష్టం అంచనా వేసి పరిహారం అందజేస్తాం. నష్టపోయిన మూడు తండావాసులకు ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేస్తున్నాం. నష్టంపై కేంద్రానికి నివేదించడానికి ఓ నివేదికను తయారు చేస్తున్నాం. కేంద్ర ప్రభుత్వం దీనిని జాతీయ విపత్తుగా ప్రకటించాలి. ఆస్తి, ప్రాణ నష్టాన్ని పరిశీలించేందుకు రావాలంటూ ప్రధాని మోదీని తెలంగాణకు ఆహ్వానించాం. ఆపదలో ఉన్న తెలంగాణను ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం వెంటనే రాష్ట్రానికి రూ. 2 వేల కోట్లను మంజూరు చేయాలి. వర్షం తగ్గినందున బరుద తొలగించే పనులను అధికారులు ప్రారంభిస్తారు. ట్యాంకర్ల ద్వారా నీరు సరఫరా చేస్తే ఇళ్లలోని బురద తొలగించవచ్చు. వరదలు ముంచెత్తిన ప్రాంతాల్లో విష జ్వరాలు ప్రబలే ప్రమాదం లేకపోలేదు. అందువల్ల సంబంధిత అధికారులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.
Also Read: చనిపోయినవారి సంఖ్యను కూడా ప్రభుత్వం తక్కువ చేయడం దారుణం: హరీశ్రావు
ఎంత ఒత్తిడి ఉన్నా కూడా హైడ్రాను ఏర్పాటు చేసి ఆక్రమణలను కూల్చివేస్తున్నాం. హైడ్రా విషయంలో వెనక్కి తగ్గేదిలేదు. ప్రకృతి ప్రకోపిస్తే ఏం జరుగుతదనేది మనం ఇతర రాష్ట్రాల్లో చోటు చేసుకున్న పరిణామాలను చూస్తూనే ఉన్నాం. చెరువులు, నాలాల ఆక్రమణల తొలగింపునకు రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తున్నది. ఇటు ఆక్రమణలకు సహకరించినవారిపై కూడా ప్రభుత్వం చర్యలు తీసుకుంటది. పేదల ప్రాణాలు పోయినంక ప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తూ కూర్చోదు. ఇక్కడి నుంచి హరీశ్ రావుకు నేనొక సవాల్ విసురుతున్నా. అదేమంటే.. పువ్వాడ ఆక్రమణలు తొలగించాలని హరీశ్ రావు డిమాండ్ చేయగలడా..? చెరువులను ఆక్రమించిన వారు ఎంతటివారైనా కూడా వాటిని తొలగిస్తాం’ అంటూ సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఆక్రమణలు తొలగింపునకు వెంటనే విధివిధానాలను రూపొందించాలని అధికారులకు ఆదేశాలను జారీ చేశారు.
గడిచిన పదేళ్లలో రాష్ట్రంలో వచ్చిన వరదల్లో మాజీ సీఎం కేసీఆర్ ఏ ఒక్కరోజైనా వరద బాధితులను పరామర్శించిన దాఖలాలు ఉన్నాయా..? ఏ ప్రమాదంలో ప్రజలు దుర్మరణం చెందినప్పుడు ఆయన బయటకు వచ్చారు..? ఒకవేళ ప్రజలను కలిసినట్టుగా ఆధారాలు ఉంటే వాటిని చూపాలని డిమాండ్ చేశారు సీఎం రేవంత్ రెడ్డి. తాను కేసీఆర్ మాదిరిగా కాదన్నారు. వర్షాలు, వరదలు ముంచెత్తకముందు నుంచే తాను మంత్రులను, ప్రజాప్రతినిధులను అప్రమత్తం చేశానన్నారు. వరదలు ముంచెత్తాయని తెలియగానే తాను, మంత్రులు అక్కడికి వెళ్లి పర్యటించాల్సిందిగా ఆదేశించానన్నారు. ఎప్పటికప్పుడు వివరాలపై ఆరా తీశానన్నారు. అదేవిధంగా తాను కూడా వరద సహాయక చర్యల్లో పాల్గొన్నాను అని చెప్పారు. గత రెండురోజులుగా తాను ముంపు ప్రాంతాల్లోనే పర్యటిస్తూ బాధితులకు భరోసా ఇస్తున్నాను అంటూ సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.